కాకతీయ చక్రవర్తుల సామంతులు చాలామంది ఉన్నారు. అందులో రేచర్ల రెడ్డి వంశీయులు ముఖ్యులు. రేచర్ల రుద్రరెడ్డి కాకతీయ సేనాధిపతిగానే కాక రామప్ప వంటి విశేష ఆలయ నిర్మాణాలు చేసినాడు. రేచర్ల బేతిరెడ్డి కొడుకైన లోకిరెడ్డి వేయించిన ఒక శాసనం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎడ్లపల్లిలో ఉన్నది. ఈ శాసనంలో రెండు శాసన కాలాలు పేర్కొనబడినాయి. ఒకటి శ.సం1174 = క్రీ.శ.1252, ఇంకొకటి శ.సం. 1140 = క్రీ.శ. 1218.
శ్రీమతు రేచెరువుల లోకిరెడ్డి బొమ్మకల్లు గ్రామంలో పానకాల సముద్రము వెనుకున్న సూదెటి కాలువ కింద 94 మర్తురుల భూమిని త్రికూటములైన చెన్నకేశవ దేవర(రెండు ఆలయాల పేర్లు చెరిగిపోయాయి) అంగభోగాది సమస్త సేవలకు ఆ చంద్రార్కతారకంగాసమర్పించాడు.
కాకతీయ మహాదేవుని కొడుకైన గణపతి క్షోణీశుడి పాలనలో రేచర్ల రుద్రుడు మంత్రిగా ఉన్నాడు. అయన కొడుకు కాట. అతని కొడుకు కామ. ఇతడు మూసీనది తీరంలో శివుడికి తన తల్లిదండ్రులు, సవతి తల్లి పేరున ఆలయాలను నిర్మించాడు. బొమ్మకల్లులోని బొల్లసముద్రం కింద 33 నివర్తనాల భూమిని దానమిచ్చాడు.
బేతిరెడ్డి కుమారుడు లోకిరెడ్డి భీమరాజుపల్లిలో తన తండ్రి పేరు మీద బేతేశ్వర, తల్లి బొల్లసానమ్మ పేర బొల్లేశ్వరాలయాలను నిర్మించాడు. ఆ ఆలయాల్లోని స్వామి అంగభోగాది సమస్త పూజా ప్రయోజన సిద్ధ్యర్థం ఏరువ భూమిలో భాగమైన బొమ్మకల్లులో పాలేటి కాల్వ కింద వేసంగి, వానకాలాల పంటలు పండే 9 మర్తురుల భూమిని దానమిచ్చాడు.
శాసనంలో లోకిరెడ్డి ‘స్వస్తి గుణగణాలంకార పరనారీ దూర మనికంటి పురవరేశ్వర వీరలక్ష్మీ నిజేశ్వర మార్బల భీమ రణరంగరాయ, వితరణ కర్ణ, శౌర్య సౌవర్ణ పతిహితాంజనేయ, శౌచ గాంగేయ, స్వామి ద్రోహరగండ, బేతన దండ, సత్య రత్నాకర దుష్టజన భీకర మనుమకులాదిత్య సుభట సంస్తుత్య’ నామాది సమస్త ప్రశస్తి సహితుడుగా పేర్కొనబడ్డాడు.
-భిన్నూరి మనోహరి