కాలానుగుణంగా రాజ్యాంగం పనితీరు, అన్ని వర్గాల ప్రజలకు ఏ స్థాయిలో దాని స్ఫూర్తి, విలువలు అందుతున్నాయో అందరికీ తెలవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ క్రమంలో.. రాజ్యాంగాన్ని ఏనాడూ గౌరవించని వారు కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై ఎగిరిపడుతున్నారు. నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించేవారే అయితే సాగు చట్టాల విషయంలో ఎందుకు రాజ్యాంగవిరుద్ధంగా ప్రవర్తించారు?
రైతు వ్యతిరేక మూడు సాగుచట్టాలపై రైతాంగం పోరాడితే వాటిని వెనక్కి తీసుకొని, ప్రధాని మోదీయే రైతాంగానికి క్షమాపణలు చెప్పారు. దీనికి ఈ రాజకీయ కోతులు సమాధానం చెప్పగలవా? కేసీఆర్పై ఎంత విష ప్రచారం చేసినా.. ఎవరికీ ఒనగూరేదేమీ ఉండదు.
ఏడెనిమిది దశాబ్దాల క్రితం రాసుకున్న రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నది కేసీఆర్ అభిప్రాయం. అందుకే ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నానని (‘ఫర్మ్ బిలీవర్’ అన్న పదాన్ని వాడారు ) తెలిపారు. దీనిపై చర్చ జరగాలన్నారు. ఈ మాటలు ఎందుకన్నారో గమనించకుండా, ఎవరికి తోచింది వారు అన్వయించుకొని ఇష్టారీతిన మాట్లాడటం ఆశ్చర్యం.
దేశంలో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్పుకోసం ఏం చేయాలో, ఈ అం శంపై అందరినీ కలుపుకొని వెళ్తానన్నారు. దీనిలో తప్పేమున్నది! ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర అధికారాల విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఏకపక్ష వైఖరిపై చాలామందికి అభ్యంతరాలున్నాయి. రాజ్యాంగం లో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడిజాబితా పేర ఎవరేం చేయా లో స్పష్టంగా ఉన్నది. కానీ కేంద్రం రాష్ర్టాల అధికారాలు లాగేసుకుంటున్నది అన్న విషయం అక్షరసత్యం. దేశం అంటేనే రాష్ర్టాల సమాఖ్య (యూనియన్ ఆఫ్ స్టేట్స్) కాదా? ఈ విషయాన్ని విస్మరిస్తూ ఇష్టారీతిన చట్టాలు చేసుకుంటే, రాష్ర్టాలు చూస్తూ ఊరుకోవాలా?
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగి రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను. అక్కడి రైల్వే స్టేషన్లో దిగి, ఆటో కోసం చూస్తున్న క్రమంలో ఒక బీహారీ రిక్షా కార్మికుడు తారసపడ్డాడు. ‘అరే తెలంగాణ హై భాయ్… సబ్సే బడే లీడర్ కేసీఆర్కా రాజ్య్ హై భాయ్’ అంటూ ఆనందపడుతూ అడిగాడు. ఆయన భలే హిందీ మాట్లాడతాడు అంటూ కేసీఆర్ను ‘గొప్ప నేత’ అంటూ పొడిగాడు.
విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) పునరుద్ధరణకు తెలంగాణ చేసిన వినతిని పక్కన పెట్టింది. ఇలా దక్షిణాది అంటే ప్రతి విషయంలో వివక్ష చూపుతున్న ఢిల్లీ పెత్తనం ఎల్లకాలం నడవదు. రాష్ర్టాల హక్కుల పరిరక్షణ, దేశ సమగ్రాభివృద్ధికోసం రాజ్యాంగ మార్పులు అవసరమైతే చేసుకోవటంలో తప్పేమీ లేదు. కాలానుగుణంగా ప్రజా ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా రాజ్యాంగం ఉండాల్సిందే.
(వ్యాసకర్త: మన్నారం నాగరాజు, 95508 44433, తెలంగాణ లోక్సత్తా, రాష్ట్ర అధ్యక్షుడు)