గణపతి దేవుడు వేయించిన అభయ శాసనంలో ‘నా ప్రాణం కన్నా నా ప్రజల రక్షణే ముఖ్యం, ప్రజలే రాజుకు సంపద, వారిని జాగ్రత్తగా రక్షించుకోవాలి’ అని ఉన్నది. ఇది 1150 నుంచి 1323 వరకు దక్షిణ భారతదేశంలో సువిశాల ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయుల తాత్వికతను తెలియజేస్తున్నది. కాకతీయ రాజులు ప్రజలతో సన్నిహితంగా మెలిగి వారి జీవన ప్రమాణాలను పెరిగేలా కృషి చేశారు. కాకతీయుల పాలన ముగిసిన రెండు శతాబ్దాల తర్వాత ఓరుగల్లును పాలించిన సీతాపతిరాజు వేయించిన శాసనంలో ‘కాకతి వంశ రాజు నివహైర్యా పాలిత ధర్మాత్మభి’ కాకతీయ పాలకులు ధర్మాత్ములని, జన సామాన్య మన్ననకు పాత్రులైన వారని ప్రశంసించారు.
కాకతీయుల కాలంలో ప్రజల భాషలో ఎక్కువగా సాహిత్యం వెలువడింది. ప్రధానంగా శైవ రచనలకు పెద్దపీట వేశారు. సోమన రచించిన పండితారాధ్య చరిత్ర, బసవపురాణం, రాజనీతి గ్రంథాలైన నీతిసారం, సుమతీ శతకం, పురుషార్థసారం, దశ కుమార చరిత్ర జాన తెలుగులో రచించినవే. సంస్కృతంలో ఉత్తర భాస్కర రంగనాథ రామాయణాలు మార్కండేయ పురాణాలు రచనలు వెలువడ్డాయి.
ఆర్థిక, సామాజిక విషయాల్లో కాకతీయులు చరిత్రలోనే నూతన అధ్యాయం ప్రారంభించారు. అరణ్యం, విశాలమైన భూమి, కొండలు, గుట్టలు, తక్కువ వర్షపాతం, రాతినేలలు ఎక్కువగా ఉన్న కాకతీయ సామ్రాజ్య పరిధిలో జనాభా తక్కువ. నదులు, వాగుల తీరాల్లో వ్యవసాయ భూమి కూడా ఉండేది. కాకతీయులు స్థానిక పాలకులు కాబట్టి సహజ వనరులను ఉపయోగించి భూమిని అభివృద్ధి చేయడంలో, నీటి వసతి కల్పించడంలో శక్తివంచన లేకుండా కృషిచేశారు. సారవంతమైన భూములున్న అనేకచోట్ల నీటి ప్రవాహాలకు అడ్డుకట్టలు వేసి పెద్దపెద్ద చెరువులను నిర్మించారు. చెరువుల నిర్మాణం గొప్ప విద్య. దీన్ని భారతదేశానికి అందించినది కాకతీయులే.
కాకతీయ రాజులు స్వయంగా చెరువులను నిర్మించి తమ సామంత రాజులకు ఒక మార్గాన్ని ఏర్పరిచారు. మొదటి ప్రోలరాజు కేసముద్రం చెరువును, గంగాధరుడు భద్రకాళి చెరువును, గణపతిదేవుడు ఘనప సముద్రంను, మైలాంబ బయ్యారం చెరువును, కుందమాంబ కుందసముద్రపు చెరువులను నిర్మించారు. కాకతీయ పాలనాధికారులు, సామంతులు పాకాల, రామప్ప, ఘనపూర్, లక్నవరం చెరువులను నిర్మించారు. తెలంగాణలో ఉన్న చెరువులన్నీ కాకతీయులకాలంలో నిర్మించినవే. నాటి వ్యవసాయంలో వరి, గోధుమ, మక్కజొన్న, రాగులు, పప్పు ధాన్యాలు, పత్తి, పసుపు, నూనెగింజల పంటలు విరివిగా పండేవి. ఈ విధంగా కాకతీయ రాజ్య ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి వ్యవసాయం తోడ్పడింది.
భౌతిక, జీవన అవసరాలు సంతృప్తిపడిన తర్వాత తలెత్తే సృజనాత్మక కార్యకలాపాలే కళ సాహిత్యాలు. ఇవి మనిషిలో ఉన్న సహజాతాలను ప్రేరేపించి వ్యక్తీకరింపజేస్తాయి. వాటిని పరిపుష్టం చేసి రసజ్ఞతను పెంచుతాయి. ఈ వెలుగులో కాకతీయ పరిపాలనాకాలంలో అద్వితీయంగా సాహిత్య సాంస్కృతిక నిర్మాణ వాస్తు శిల్పరంగాలు అభివృద్ధి చెందాయి. కాయకష్టమే కైలాసం, కష్టించి పనిచేయడమే ఆరాధన అనే తాత్వికతతో ఉన్న కాకతీయ ప్రజలు శ్రమలో, అన్వేషణలో అనంతమైన కళారంగాలను సృష్టించారు. కాకతీయుల కాలంలో మతసహనం పరిఢవిల్లింది.
ప్రజలు సామరస్యంగా జీవించారు. బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవ మతాలు ఆదరణ పొందాయి. కాకతీయ రాజులు, వారి సామంతులు తాము స్వయంగా అనుసరించే మతం ఏదైనా ఇతర మతాలను కూడా సమానంగా గౌరవించారు. అందుకే అనేక మంది సామంతరాజులు సమాధారిత సమయ చతుష్టయ బిరుదులను కలిగి ఉన్నారు. గొప్ప ఇంజినీరింగ్ నిర్మాణ నైపుణ్యాలతో, రమణీయ శిల్పకళతో గుడులు నిర్మించబడ్డాయి. అతుకుల గీతలు కనిపించకుండా కోటలను నిర్మించడం కాకతీయుల ప్రత్యేకత. శిల్పాలను అప్పటి అలంకరణలతో, పురాణేతిహాసాల వృత్తాలతో చెక్కారు.
కాకతీయుల కాలంలో గుడులు భక్తితో పాటు అత్యుత్తమైన కళలకు, నాగరికతకు, మానవతకు సంబంధించిన కేంద్ర బిందువుగా తమ పాత్రలను నిర్వహించాయి. రామప్ప, వేయిస్తంభాల గుడి, పానగల్, పద్మాక్షి, గణపురం వంటి అనేక దేవాలయాలు మహత్తరమైన పాత్ర పోషించాయి. కాకతీయుల కాలంలో ప్రజల భాషలో ఎక్కువగా సాహిత్యం వెలువడింది. ప్రధానంగా శైవ రచనలకు పెద్దపీట వేశారు. సోమన రచించిన పండితారాధ్య చరిత్ర, బసవపురాణం, రాజనీతి గ్రంథాలైన నీతిసారం, సుమతీ శతకం, పురుషార్థసారం, దశ కుమార చరిత్ర జాన తెలుగులో రచించినవే. సంస్కృతంలో ఉత్తర భాస్కర రంగనాథ రామాయణాలు మార్కండేయ పురాణాలు రచనలు వెలువడ్డాయి.
కాకతీయుల సుదీర్ఘపాలన సప్త సంతానం తాత్వికతతో కొనసాగింది. సొంత కొడుకు, దత్తపుత్రుడు, సాహిత్యరచన, ఆగ్రహారం, తోట, చెరువు, గుడి. కాకతీయుల తర్వాత అలాంటి మహోజ్వల వైభవ శకాన్ని అపర కాకతీయుడు, భగీరథుడు కేసీఆర్ పునరుద్ధరిస్తున్నారు. దశాబ్దాల వలస పాలనలో దుర్భిక్షంగా, సంఘర్షణల మయంగా మారిన తెలంగాణను సుభిక్షమార్గంలో పయనింపజేస్తున్నారు. భూమిపుత్రులు పాలకులైతే రాజ్యం ఎంతటి ప్రజాస్వామిక అభివృద్ధిని సాధిస్తుందో కేసీఆర్ అనుభవంలోకి తీసుకువచ్చారు. తెలంగాణకు ఉన్న సహజవనరులు వైశాల్యంపరంగా మన రాష్ట్రం ఆహారోత్పత్తిలో దేశంలో అగ్రస్థానం పొందింది. విత్తన భాండాగారంగా విలసిల్లుతున్నది.
తెలంగాణ ఉనికి, అస్తిత్వాలకు, జవజీవాలకు ఆధారమైన పండుగలు, జాతరలు, నృత్యాలు సమస్త కళల పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం విశిష్టమైన సేవలందిస్తున్నది. ఆధునిక భారతదేశ చరిత్రలో కాకతీయ విలువలను స్వీకరించి ఆచరిస్తూ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాకతీయుల ప్రాభవాన్ని పాలకులు, విద్యార్థులు, అధికారులు, పౌరసమాజం ఆవాహన చేసుకొని ఆ ప్రేరణతో మరింత ముందడుగు వేయాలని సీఎం కేసీఆర్ కాకతీయ వైభవ సప్తాహ ఉత్సవాలను ఈ నెల 7 నుంచి 13 వరకు ఓరుగల్లు కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కాకతీయ అపురూప స్ఫూర్తి సంప్రదాయాల కొనసాగింపులో భాగంగా అందరం పాల్గొందాం.
(వ్యాసకర్త: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి)
-వి.శ్రీనివాస్ గౌడ్