దేశంలోని సహజ వనరుల లభ్యత, వాటి వినియోగం, మానవవనరులపై సీఎం కేసీఆర్ ఇటీవల చర్చకు లేవనెత్తారు. ముఖ్యంగా మన జలవనరులు ఏ విధంగా సముద్రం పాలవుతున్నాయో లెక్కలతో సహా వివరించారు. గత పాలకుల వైఫల్యాలను చూపెడుతూ ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వ అవసరాన్ని తెలియజేశారు. తాను దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు నాంది పలుకుతున్నట్లు ప్రకటించారు. దీనిపై దేశాభివృద్ధి, పురోగతిని కాంక్షించే మేధావులు, ఆర్థికవేత్తలు, అనేక ప్రసార మాధ్యమాలు విశ్లేషణలు చేశాయి.
చేనేత రిజర్వేషన్ చట్టం నిర్వీర్యం: చేనేత కళాకారుల కోసం 22 రకాల వస్ర్తోత్పత్తులను చేనేత మగ్గం పైనే తయారుచేయాలని 1985లో రాజీవ్గాంధీ ప్రభుత్వం చేనేత రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. తర్వాతి కాలంలో 11 రకాల ఉత్పత్తులకు కేంద్రం కుదించింది. ప్రస్తుతం ఉన్న 11 రకాల ఉత్పత్తులను కాపాడటంలో గత ప్రభుత్వాలు, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి.
ఈనేపథ్యంలో చేనేతరంగం కోసం గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, విడుదల చేసిన నిధుల గురించి లోతైన అధ్యయనం చేశాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటిమందికి జీవనోపాధి కలిగిస్తున్న చేనేతరంగానికి పదేండ్లు పాలించిన యూపీయే ప్రభుత్వాలు 800 కోట్లకు మించి బడ్జెట్ కేటాయింపులు జరపలేదు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న రాహుల్గాంధీ 2011లో చేనేత కళాకారుల రుణమాఫీకి, సహకార సంఘాల పటిష్ఠత కోసం 6 వేల కోట్ల ప్రత్యే క ప్యాకేజీని ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వాన్ని కోరగా వెంటనే (RE VIVAL, REFORM AND RESTRUCTURING PACKAGE FOR HANDLOOM SECTOR) ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ పథకానికి రూ.2,825 కోట్లు బడ్జెట్లో పెట్టి రూ.760 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది.
2014, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేనేతరంగ కేటాయింపులను మరింతగా తగ్గించింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.410 కోట్లు కేటాయించి ఇప్పటివరకు కేవలం 20 కోట్ల 7 లక్షలు మాత్రమే ఖర్చుచేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.2,812 కోట్ల చేనేత ఉత్పత్తులు ఎగుమతి కాగా నేటికీ ఆ మార్కును దాటలేకపోయారు. చెన్నై వేదికగా 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవ ఆవిర్భావ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తీరు చేనేత కళాకారుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. చేనేతరంగ అభివృద్ధి, చేనేత కళాకారుల సం క్షేమం కోసం తాను పనిచేయబోతున్నట్లు ఒక విశ్వాసాన్ని కల్పించారు. కానీ వాస్తవికతలో కేంద్రం విధానాలు చేనేతరంగాన్ని చిదిమేసే విధంగా ఉన్నాయి.
అస్తవ్యస్తంగా చేనేత మగ్గాల లెక్కలు: 4వ జాతీ య సెన్సస్ ప్రకారం దేశవ్యాప్తంగా 26,73,891 చేనేత ముగ్గాలున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ లెక్కలపై పలు అనుమానాలున్నాయి. తెలంగాణలో సుమారు 19 వేల చేనేత మగ్గాలను గుర్తించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో జియో ట్యాగింగ్ ప్రతి చేనేత మగ్గానికి వేసింది. ఇంకా కూడా జియో ట్యాగింగ్ కాని చేనేత మగ్గాలున్నాయి. వాటిని గుర్తిం చేపనిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. కానీ భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 11,544 చేనేత మగ్గాలుగా చూపించింది. దీంతో కేంద్రం చెప్పే లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయి.
వస్త్రమే అస్త్రంగా జీరో జీఎస్టీ ఉద్యమం: ప్రపంచదేశాల ఉనికి వారి ఆచారవ్యవహారాలు, సాంస్కృతిక సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపెట్టే భారతీయ సం స్కృతి గొప్పది. విభిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, కళాకృతుల మేళవింపైన భారతదేశం ప్రపంచానికి ఒక మార్గనిర్దేశనం. స్వాతంత్రోద్యమంలో చేనేత రంగానిది కీలక భూమిక. స్వాతంత్య్రానంతరం అన్ని ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రత్యేకంగానే చూశాయి. చేనేత వస్ర్తాలపై ఏ ప్రభుత్వం కూడా పన్నులు విధించలేదు. 2017లో తొలిసారి చేనేతపై జీఎస్టీ రూపంలో 5 శాతం పన్నును మోదీ ప్రభుత్వం విధించింది. పన్నుల పరిధిలోకి చేనేతరంగం వచ్చిందంటే ఈ రంగం తన ప్రత్యేకతను, అస్తిత్వాన్ని కోల్పోయినట్లే. చేనేతపై జీఎస్టీ పన్ను తొలగించాలంటూ జీరో జీఎస్టీ ఉద్యమం చేస్తున్న అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మద్దతు పలికారు. చేనేతపై జీరో జీఎస్టీ కోరుతూ ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రులకు తెలంగాణ నుంచి ఎన్నో ఉత్తరాలు రాశారు.
ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ నాయకత్వంలో (జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ) తీర్మానం చేశారు. ఇప్పటికే 8 రాష్ర్టాల నుంచి ఆరు రాజకీయపార్టీలు జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు పలికాయి. నరేంద్ర మోదీ ప్ర భుత్వ చేనేత వ్యతిరేక విధానాలపై నాటి స్వా తంత్య్ర పోరాట స్ఫూర్తితో స్వతంత్ర భారతదేశం లో మన ఉనికిని కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి సిద్ధమవుదాం. ఈ మహోజ్వల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములమవుదాం.
(వ్యాసకర్త: అధ్యక్షులు, అఖిల భారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం)
-యర్రమాద వెంకన్న నేత
92465 77488