నన్నయ పదకొండవ శతాబ్ది వాడు. తిక్కన పదమూడో శతాబ్దానికి చెందిన కవి. ఎఱ్ఱనది పద్నాలుగవ శతాబ్దం. అరణ్యంలో నాలుగో అశ్వాసం 142వ పద్యంతో దీర్ఘ నిశ్వాసం తీసి వెళ్లిపోయాడు నన్నయ. ఆ తర్వాత 200 ఏండ్లకు తిక్కన అరణ్యపర్వంలో మిగిలినదాన్ని అలాగే వదిలి, విరాటం నుంచి స్వర్గారోహణం వరకు 15 పర్వాలు రచించాడు. ఐనా, భారతంలో అరణ్యానికి సంబంధించిన కొరత అలాగే మిగిలింది. ఆ తర్వాత దాదాపు వందేండ్లకు వచ్చిన ఎఱ్ఱన నన్నయ విడిచిన
దగ్గరినుంచి తిక్కన చేపట్టిన పర్వం పర్యంతం భారత రచన చేసి నిండుదనం కలిగించిన మహానుభావుడు.
నన్నయ్య నుంచి ఎఱ్ఱన వరకూ మధ్యలో ఒక్క తిక్కన మాత్రమే లేడు తెలుగు సాహిత్య రంగస్థలమ్మీద. అసలు తిక్కన కన్నముందే పాల్కుర్కి ఉన్నాడు. తెలుగు సాహితీ ప్రారంభం నుంచి తనవరకు ఉన్న సారస్వత పరిణామ వికాసాలు ఎఱ్ఱనకు బాగా ఎరుక. స్వతంత్రమైన పనినీ, ఇష్టమున్న కార్యాన్నీ సాధించడం ఒకింత సులువు. కానీ- ఎర్రన, ఆదికవి అనివార్యంగా రాయలేకపోయిన, తిక్కన రాయకుండా వదిలేసిన ‘గండి’ని పూరించాడు. ఖాళీని నింపాడు. అసలు ‘సాహిత్యానికి నిర్వచనం ఖాళీలు పూరించడమే..’ అన్నాడు బాలగోపాల్. ప్రబంధ పరమేశ్వరుడైన ఎర్రన ఆ శేషాన్ని గొప్ప సంబద్ధతతో పూరించాడు. ఈ పనిలో, నన్నయ శైలి పట్టుకోవాలి. తిక్కన సంవిధానం తెలుసుకోవాలి. ఇద్దరి మధ్యా ఓ వంతెన వేయాలి. ఓ పొంతన తేవాలి. అది చిన్న విషయం కాదు. తన స్వీయశైలిని వదిలి ముందు నన్నయలో ప్రవేశించి పిదప తిక్కనను ఆవాహన చేసుకోవాలి. దీనికి త్యాగబుద్ధి, అధ్యయనశీలం, పరిణత మనస్కత, కాలిక స్పృహ, చేస్తున్న పని పట్ల గొప్ప అవగాహన వంటి లక్షణాలన్నీ ఉండాలి. అవి కల్గినవాడే ఎర్రన.
‘శారద రాత్రు లుజ్జ్వల లసత్తర తారకహార పంక్తులన్
చారుతరంబు లయ్యె వికసన్నవ కైరవగంధ బంధురో
దార సమీర సౌరభము తాల్చి సుదాంశు వికీర్యమాణక
ర్పూర పరాగ పాండురుచి పూరము లంబర పూరితంబులై..’
ఇది నన్నయ చివరి పద్యం. అజగర ఉపాఖ్యానంలో ధర్మరాజు-తమ్ముడైన భీముణ్ణి వెదకబోయి అతణ్ణి నహుషుని నుంచి విడిపించుకొస్తాడు. తర్వాత్తర్వాత.. శరదృతువు వచ్చింది. దాన్ని పై పద్యం వర్ణిస్తున్నది. శరత్తులో రాత్రులు బాగా ప్రకాశించే చక్కుల హారపు వరుసలతో చాలా అందంగా కన్పించాయి. ఇంకా అప్పుడే వికసించిన కలువల సుగంధ సౌరభాలు దాల్చి, చంద్రునిచే వ్యాపించిన కర్పూర పరాగ ధవళకాంతులు ఆకాశంలో నిండి ఆ రాత్రులు అందంగా కన్పించాయి. మొత్తమ్మీద అది శరత్ రుతువు. రాత్రి సమయాలు. ఆ విభావరులు నక్షత్రాలతో సుందరంగా ఉన్నాయి. నిశి వేళల్లో కలువలు విచ్చుకుంటాయి. వాటి పరిమళాలతో, చంద్రుని ధవళ కౌముదులతో నింగి నిండిపోయింది. ఇది వర్ణన.
నన్నయ ఈ లోకంలోంచి అంతర్థానమైపోయాడు. మహా కవులకు తాము వెళ్లిపోయే స్పృహ తెలుస్తుందనీ, అందుకే ఆ పద్య పాదాంతాన్ని ‘అంబరపూరితంబులై’ అనే కాకుండా, ‘పూరములన్ పరపూరితంబులై’ అని విడదీయాలనే కొందరు విమర్శకులన్నారు. కావొచ్చును.- తన తర్వాతి భారతం పరులచే పూరించబడుతుందని అని వుంటాడు ఆ ‘వాగమశాసనుడు’. కవులు కాంత్రదర్శులే కాక త్రికాలజ్ఞులేమో! ఇదిలా ఉంటే ఇక ఎర్రన వచ్చి రాసిన తర్వాత పద్యం చూద్దాం.
‘స్ఫురదరుణాంశు రాగరుచి పొంపిరిపోవ నిరస్త నీరదా
వరణములై దళిత్కమల వైభవ జృంభన ముల్లసిల్ల ను
ద్దురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
కరము వెలింగె వాసరముఖంబులు, శారదవేళ చూడగన్’
నన్నయ శరద్రాత్రి గురించి చెప్పి ఆపాడు. ఎర్రన ఆ రాత్రి పోయి వచ్చిన ఉదయం గూర్చి ప్రారంభించాడు. ఎలా… ‘స్ఫురత్ అరుణాంశురాగ రుచి పొంపిరి పోవ’ అన్నాడు. ‘స్ఫురత్’ అంటే ప్రకాశించు అని అర్థం. అరుణాంశుడు ఎవరు? సూర్యుడు. ఎర్రని రాగ రుచి ఆయనది. ‘బహుశా ఆరుద్ర వంటి విమర్శకులు కావచ్చును… ఎర్రన పద్య ప్రారంభంలో ‘అరుణ’లో తన పేరు లీలామాత్యంగా స్ఫురింపజేశాడన్నారు. అది మహాకవుల ముద్ర. దూరదృష్టి. నన్నయేమో ‘పర పూరితములై’ అనేస్తే; ఎర్రనేమో ‘అరుణాంశు’ అంటూ తన పేరు ఆదిలోనే రాసుకున్నాడట! ఐతే, ఇవేవీ కొత్త విషయాలు కాదు. అసలు విషయం… ఈ ఇద్దరి చివరి, మొదటి పద్యాల నిశిత పరిశీలనలో నేను గమనించిన కొన్ని అంశాలు చెప్పాలి. ఈ రెండు పద్యాల మధ్య 300 ఏండ్లు గడిచాయి. ఆదికవి పోయి శంభుదాసుడొచ్చాడు. కానీ ఎర్రన మొదటి పద్యంలోనే నన్నయలో ప్రవేశించాడు. ఇద్దరి మధ్య మూడు శతాబ్దాల దూరం ఆవిరైతేనే నన్నయ విడిచిన శరద్రాత్రి గడిచి శరదుదయం అవుతుంది. అంటే ఇక్కడ వ్యవధి 12 గంటలే!
ఆదికవి అనివార్యంగా రాయలేకపోయిన, తిక్కన రాయకుండా వదిలేసిన ‘గండి’ని ఎర్రన పూరించాడు. ఖాళీని నింపాడు. అసలు ‘సాహిత్యానికి నిర్వచనం ఖాళీలు పూరించడమే..’ అన్నాడు బాలగోపాల్. ప్రబంధ పరమేశ్వరుడైన ఎర్రన ఆ శేషాన్ని గొప్ప సంబద్ధతతో పూరించాడు. ఈ పనిలో, నన్నయ శైలి పట్టుకోవాలి. తిక్కన సంవిధానం తెలుసుకోవాలి. ఇద్దరి మధ్యా ఓ వంతెన వేయాలి. ఓ పొంతన తేవాలి. అదే చేశాడు ఎర్రన.
నన్నయ ‘శారదరాత్రులు’ అన్నాడు. ఆదిలో ఎర్రయ్య ‘వాసర ముఖంబులు శారద వేళ’ అని చెప్పాడు దాదాపు చివరలో. వస్తైక్యం గమనార్హ ం. ఏకసూత్రత పరిశీలించదగింది. ‘వాసర ముఖంబులు’ అంటే ‘ఉదయాలు’ ఇద్దరి పద్యాల్లోనూ ‘శారద’ అనే పూర్వపదమే సాభిప్రాయంగా ఆదికవి ‘ఉజ్వల లసత్ తర తారకలు’ అని రచించాడు. ‘ఎసత్’ అంటే ప్రకాశించు అని అర్థం. ప్రారంభ పదంలోనే ఎర్రన ‘స్ఫురత్’ అనేశాడు. స్వరత్ అంటే కూడా ప్రకాశించు అనే! ‘లసత్’ వంటి విశేషణమే ‘స్ఫురత్’. రెండూ ‘త్’ అంతాలు. అవి ఒక ప్రవాహ గుణాన్నీ, ప్రకాశ లక్షణాన్నీ, సామ్యస్వభావాన్నీ కల్గిస్తున్నాయి.
అవి శారదరాత్రులు కాబట్టి చుక్కలు బాగా మెరుస్తున్నాయి అన్నాడు నన్నయ. ఆ రుతువులో నింగిలో మబ్బులుండవు కదా! ఆ మేఘరాహిత్యాన్ని నన్నయ చెప్పలేదు. కానీ.. ఎర్రన ‘నిరస్త నీరదావ రణలై’ అని పలికాడు. అంటే ‘మబ్బులు లేని ఆవరణములై’ అని అర్థం. ఎర్రన తేటతెల్లం చేశాడు. నన్నయది పరోక్షం, ఇతనిది ప్రత్యక్ష పద్ధతి. ఏమైతేనేం… సారాంశం ఒక్కటే. నన్నయ్యలో ‘వికసత్ నవ కైరవములు’న్నాయి. వికసించిన కొత్త కలువలు అని అర్థం. ఎర్రనలో ‘దళత్ కమలము’లున్నై. కలువలకు ముందు నన్నయ వేసిన విశేషణం ‘వికసత్’ ఎర్రన వాడింది ‘దళత్’ ఒకే మోస్తరు శబ్ద సామ్యత ఇది.
నన్నయ కవిత్వం ఆసాంతం ఎర్రన స్వాంతంలోకి ఎక్కితే గానీ ఈ చెక్కడం సాధ్యం కాదు. అంటే.. రూపసారాలు రెండూ ఒంటపట్టాలి. ఇంకా మనంబునన్ పట్టాలి- మనసున వట్టాలె. నన్నయ ‘లసత్తర’ అన్నాడా. లసత్-లసత్ తర- లసత్ తరం’ ఇదే కదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ‘లసత్ తర’ అంటే మరింత ప్రకాశిస్తున్న అని అర్థం. ఎర్రనేమో.. ‘ఉద్ధుర తర’ ప్రకటించాడు. తర తమ బేధాలు తెలిసిన కవీంద్రులు పాటించే ‘ఏకరీతి’ యిది. నన్నయ ‘శారదరాత్రులు చారుతరంబులయ్యే’ అని రాస్తే, ఎర్రన ‘వాసర ముఖంబులు శారద వేళ… కరము వెలింగె’ అని విరచించాడు. ‘చారు’ అనగా అందమైన కదా! ‘చారుతరము’ అంటే ఇంకా అందమైన అనే అర్థమే! ఎర్రన ఊరకే ‘వెలింగె’ అని వూరుకోలేదు. ‘కరము’ వెలింగె అన్నాడు. ‘కరము’ అంటే ‘మిక్కిలి’ అని అర్థం. పైగా (భాస్) ‘కరము’ (కిరణము) కూడా కావచ్చును.
ఒక జీవితకాల తపస్సు వల్లే ఇటువంటి ఏకసూత్రత,వస్తు ఐక్యమూ సాధ్యమవుతాయి. భావజాలాలు ఏవైనా కావచ్చు. కవిత్వ రచనకు నిమగ్నత బాగా అవసరం. నిబద్ధత ఉంటే మరీ మంచిది. ప్రాచీన సాహిత్య అధ్యయనం మనకు ఒక సంయమనం కలిగిస్తుంది. ఆనాటి విలువలు అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ ప్రాచీన కవుల పరిశ్రమ, అధ్యయనశీలం, భాషా పటిమ, రూపసారాల సమన్వయం అలంకార శైలి, కాలికస్పర్శ, దూరదృష్టి, దార్శనికత.. ఇప్పటి మన తరానికి చాలా అవసరం.
కేవలం… రెండు పదాల ఆధారంగా నన్నయ- ఎర్రనల పద్య రచనను మనం మూల్యాంకనం చేస్తున్నప్పుడు ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. రాత్రికి రాత్రి కవులై పోవడం అనేది అవలక్షణం. శ్లోకం, పద్యం, గేయం, పాట, వచన విత, హైకూ, నానీ… రూపమేదైనా అందులో సారముందా లేదా చూసుకోవాలంటే పూర్వుల సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. వర్తమానంలో జీవించాలి. సమకాలీనుల కవిత్వాన్ని బాగా చదువాలి. ప్రపంచ కవిత్వాన్ని అనువాద మాధ్యమం ద్వారా పఠించాలి. భవిష్యద్దర్శనం ప్రతి కవికి చాలా అవసరం. ఒక్కమాటలో నన్నయ ‘రాత్రి, చుక్కలు, కలువలు, చంద్రుడు అంటే; ఎర్రన ‘ఉదయము, కవాలాలు, సూర్యుడు, హంసాదుల ధ్వనులు’ అన్నాడు. ఇదే… ఏకసూత్రత.
-నలిమెల భాస్కర్