మహారాజా తన పుట్టింటికి తిరిగి చేరుకున్నాడు. 69 ఏండ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత ఎయిరిండియా టాటాల గూటికి మళ్లీ చేరింది. ఎయిరిండియాను టాటా గ్రూపునకు కేంద్రప్రభుత్వం అధికారికంగా అందజేయటంతో ఆ కంపెనీ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసి మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. ‘సమిష్టి కృషితో ఎయిరిండియాను ప్రపంచస్థాయి ఎయిర్లైన్ సంస్థగా తీర్చిదిద్దుతాం’ అని చెప్పిన మాటల్లో టాటాలకు ఉన్న విశ్వాసమే కాదు.. కోట్లాదిమంది భారతీయులకు ఉన్న విశ్వా సం కూడా వెల్లడి అవుతుందని అనటం అతిశయోక్తి కాబోదు. టాటా ల చేతుల్లో మహారాజాకు పునఃవైభవం సిద్ధించాలని మార్కెట్ పండితులు, ఆర్థిక నిపుణులు, సాధారణ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. నిజానికి ఇదొక అరుదైన సందర్భమేనని చెప్పాలి.
ప్రైవేటైజేషన్ పట్ల సర్వసాధారణంగా విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. ఒక ప్రభుత్వ కంపెనీని అందులోనూ ఎయిరిండియా వంటి దిగ్గజ సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టినప్పుడు మరింత తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఉం టుంది. కానీ, ఆ కంపెనీని టాటాలు తీసుకుంటున్నారని తెలిసినప్పుడు.. ‘మంచిదేలే, ఎయిరిండియా బాగుపడుతుంది’ అని అనుకున్నవాళ్లే అధికం. 150 ఏండ్లకుపైగా ఉనికిలో ఉన్న ఒక ప్రైవేటు కం పెనీ ఈ స్థాయి ఇమేజీని కలిగి ఉండటం సామాన్యమైన విషయం కాదు. దీనికి కారణం.. ఆ సంస్థ పాటిస్తున్న విలువలు. టాటా గ్రూపు సంస్థలకు మార్గనిర్దేశకంగా రతన్టాటా రూపొందించిన 40 పేజీల ప్రవర్తన నియమావళిని చదివితే.. ఇది ఒక కార్పొరేట్ కంపెనీదా? లేక ఏదైనా ఆధ్యాత్మిక సంస్థదా? అన్న అనుమానం కలుగుతుంది. అత్యున్నత విలువలు, అత్యుత్తమ ప్రమాణాలు- టాటాల విజయసూత్రం ఇది.
ఎయిరిండియాను అమ్మకానికి పెట్టినప్పుడు కేంద్రం నిర్ణయించిన ప్రారంభధర రూ.12,906 కోట్లు. స్పైస్ జెట్ యజమాని అజయ్సింగ్ నేతృత్వంలోని కన్సార్షియం రూ.15,100 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ, టాటాలు ఏకంగా రూ.18,000 కోట్లతో ఎయిరిండియాను సొంతం చేసుకున్నారు. ప్రభుత్వం పేర్కొన్న ధర కంటే ఇది దాదాపు రూ.6,000 కోట్లు అధికం. ఏ నమ్మకంతో ఇంత భారీ వ్యయానికి టాటాలు ముందుకొచ్చారో తెలియదు కానీ, నష్టాలతో కునారిల్లిన ఎయిరిండియాను లాభాల బాట పట్టిస్తే అది అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలోనే ఒక గొప్ప సక్సెస్ స్టోరీ అవుతుంది. అందుకే టాటాలను ప్రపంచ ఎయిర్లైన్ కంపెనీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. తమ చేతుల్లోకి తీసుకున్న తొలిరోజునే ఎయిరిండియా విమానాల్లో టాటాలు మార్పులను ప్రారంభించారు. భోజనం నాణ్యతను, పరిమాణాన్ని పెంచారు. ప్రయాణికులను అతిథులుగా సంబోధించాలని సిబ్బందిని ఆదేశించారు. రతన్టాటా మాటలతో కూడిన ఒక ప్రకటనను కూడా విమానాల్లో వినిపించనున్నారు. విమానాల రాకపోకల్లో జాప్యాన్ని నివారించటానికి చర్యలు ప్రారంభించారు. మహారాజా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. బెస్ట్ ఆఫ్ లక్.