రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా శ్వేతపత్రాల విడుదల పేరిట నానా యాగి చేస్తున్నది. రాష్ర్టాన్ని సుభిక్షంగా పాలించాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే.. అది మరిచిన కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వం చేసిన అప్పులను బూచీగా చూపిస్తూ పాలనను అటకెక్కిస్తున్నది. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడినాక కూడా పరిస్థితి ఇదేమాదిరిగా ఉన్నది. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులను సాకుగా చూపెట్టి పాలనను పట్టించుకోకుండా ఉండలేదు కదా? అలా చేసి ఉంటే ఆయనను విజన్ ఉన్న నాయకుడని ఎందుకంటారు? కానీ, రేవంత్రెడ్డి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న తీరు చూస్తుంటే తమకు పాలించడం చేతకాదని చేతులెత్తేసే విధంగా కనిపిస్తున్నది.
ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆ గ్యారెంటీల ఊసే ఎత్తడం లేదు. ‘రైతు భరోసా’ కింద ఎకరానికి పసలుకు రూ.7,500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ను మొత్తానికే అటకెక్కించింది. పంట కాపుకొచ్చినా ఇంకా రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ పైసలు జమకాలేదు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్రెడ్డి మాట వరుసకు కూడా ‘రుణమాఫీ’ గురించి మాట్లాడటం లేదు. ‘డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాను, మీరు వెళ్లి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకోండి’ అని గొప్పలకు పోయిన ముఖ్యమంత్రి రుణమాఫీ విధివిధానాలను రూపొందిస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారు.
రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి సుమారు నాలుగు నెలలు కావస్తున్నది. కానీ, రాష్ట్రంలో వారు చెప్పినట్టు అద్భుతమైన మార్పేమీ జరుగలేదు. ‘మార్పు, మార్పు’ అంటే ఏదో జరుగబోతుందని ఊహించి ఓటు వేశామని ప్రజలు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు మత్తులోంచి బయటకు రావాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ప్రజలే వారికి సరైన రీతిలో బుద్ధి చెప్తారు.
– కత్తుల వెంకటేష్