గత పదిహేడేండ్లలో మొదటిసారి దేశ వ్యవసాయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.9 శాతానికి చేరుకున్నది. ఇది ఆశాజనకమైన అభివృద్ధిగా 2020-21 ఆర్థిక సర్వే తెలియజేసింది. దేశంలో వ్యవసాయం ప్రైవేటు రంగంలో కొనసాగుతున్నఅతిపెద్ద రంగం. అయినా వ్యవసాయరంగంపై అనేక రూపాల్లో ఆంక్షలు, నియంత్రణలు, నిషేధాలు కొనసాగుతున్నాయి.
వ్యవసాయం రాష్ర్టాల పరిధిలోని అంశం. వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలను, సమస్యలను రాష్ట్రమే చూసుకోవాలి. కాలగమనంలో.. ఏండ్లు గడుస్తున్నా వ్యవసాయరంగ సంస్కరణల అమలులో అనేక అడ్డంకులు తలెత్తుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తిని గుర్తిస్తూ వ్యవసాయాభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రణాళికలను, సంస్కరణలను చేపట్టాలి. వ్యవసాయ రంగానికి అన్నివిధాలా అండగా నిలువాలి. వ్యవసాయాభివృద్ధికి స్థానిక పరిస్థి తులపై గల అవగాహనతో రాష్ర్టాలు పనిచేయాల్సి ఉంటుంది. దేశంలోని విభిన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, సమస్యల నేపథ్యంలో ఆయా ప్రాంతాలవారీగా రాష్ట్ర ప్రభుత్వాలు పంటల సాగు విధానాలను అనుసరిస్తున్నాయి. అయితే కాలగమనంలో వ్యవసాయరంగం రాష్ట్ర పరిధిలోని విషయం కాకుండాపోయింది. వ్యవసాయరంగం అధికారికంగా కేంద్ర పరిధిలోకి మారనప్పటికీ, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించగలిగే అనేక విషయాలు కేంద్ర పరిధిలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టాలను సంప్రదించకుండానే కేంద్రం వ్యవసాయంరంగంలో మౌలిక సంస్కరణలకు తెరలేపుతున్నది. ఈ విధానాల మూలంగా అనేక ప్రాంతీయ, అంతరాష్ట్ర అసమానతలు, అసమాన అభివృద్ధి చోటుచేసుకుంటున్నాయి. అలాగే వ్యవసాయ రంగంపై కేంద్రీకృత అధికారం మూలంగా, రాజ్యాంగబద్ధంగా రైతులకు సంక్రమిచిన స్వేచ్ఛ మృగ్యమవుతున్నది. సరళీకృత విధానాలకు అధికారంలో వికేంద్రీకరణ, కుదిం పు అవసరం. కేంద్రీకృత అధికారం మూలంగా మార్కెట్ సంస్కరణలు అంతర్గత వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్నాయి.
వ్యవసాయానికి స్థానికతపై ఆధారపడిన వికేంద్రీకృత విధానాలు అవసరం. అయితే, కేంద్రం ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా కొత్త సాగుచట్టాలను తెచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెట్పై కేంద్రీకృత అధికారం కల్పించే ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైనవి. అందు వల్లనే వాటిని రద్దుచేయక తప్పలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ విధాన వైఫల్యమే. ఈ ప్రభావం భవిష్యత్ వ్యవసాయ సంస్కరణలపై తప్పక ఉంటుంది.
వ్యవసాయ చట్టాల రద్దు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కాకుండా, వ్యవసాయ సంస్కరణల విధానాలకు ఎదురుదెబ్బ. 19, 20వ శతాబ్దాల్లో ఒకటవ, రెండవ పారిశ్రామిక విప్లవాలను కోల్పోవడంతో దీనిని పోల్చవచ్చు. వ్యవసాయం, పరిశ్రమలు ఆర్థికరంగానికి మూలస్తంభాలు. స్థూల జాతీయోత్పత్తిలో ఈ రెండింటి వాటానే 45 శాతం ఉంటుంది. ఎప్పటిలాగానే వ్యవసాయరంగ ఉత్పత్తులకు విశ్వవిపణి అవకాశాలను ఒడిసిపట్టడంలో వైఫల్యం కనిపిస్తున్నది. ‘నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధత సూచిక-2020’ కూడా ఎగుమతి విధానాన్ని జాతీయస్థాయి వనరులపై ఆధారపడి, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయి సామర్థ్యాల అవగాహనతో రూపొందించాలని తెలిపింది. రాష్ర్టాల పరిస్థితులకనుగుణంగా విధానాలను రూపొందించాలి. స్థానిక వనరులు, ఉత్పత్తుల ఎగుమతులలో రాష్ట్రస్థాయి భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
వ్యవసాయానికి స్థానికతపై ఆధారపడిన వికేంద్రీకృత విధానాలు అవసరం. ‘నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధత సూచిక-2020’ కూడా ఎగుమతి విధానాన్ని జాతీయస్థాయి వనరులపై ఆధారపడి,రాష్ట్ర, ప్రాంతీయ స్థాయి సామర్థ్యాల అవగాహనతో రూపొందించాలని తెలిపింది. రాష్ర్టాల పరిస్థితులకనుగుణంగా విధానాలను రూపొందించాలి. స్థానిక వనరులు, ఉత్పత్తుల
ఎగుమతులలో రాష్ట్రస్థాయి భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
చాలా రాష్ర్టాలు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయ వృద్ధిని సాధించాయి. కానీ పంటలకు లాభదాయకమైన ధరల్లేక అవస్థలు పడుతున్నాయి. అలాగే ఉత్పత్తి ఖర్చుల తగ్గింపు, నిల్వ, ప్రాసెసింగ్, విలువ జోడింపు విషయంలోనూ సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆహారధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ 2020-21నాటికి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. ఏడేండ్ల కిందటితో పోలిస్తే ఉత్పత్తి అనేక రెట్లు పెరిగింది. స్థానిక అవసరాలకు మించి అదనపు ఉత్పత్తిని సాధిస్తున్న పరిస్థితుల్లో కేంద్రం మరింత బాధ్యతగా ఉత్పత్తుల అమ్మకాన్ని పట్టించుకోవాలి. ఎగుమతులను పెంచటం ద్వారా రైతులకు లాభాలు సమకూర్చాలి, జీవనోపాధిని సంరక్షించాలి. అవరోధాలను, నియంత్రణలను విధాన నిర్ణయాలతో అధిగమించాలి.
ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రభావం వ్యవసాయంపై గణనీయంగా ఉంటున్నది. ఈ క్రమంలోనే వ్యవసాయం ఎంతగా జాతీయమైనదిగా చెప్పుకున్నా స్థానిక ప్రత్యేకతలను కలిగి ఉంటున్నది. ఈ నేపథ్యంలోంచే.. తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’, ‘రైతుబీమా’ లాంటి వినూత్న పథకాలతో రైతులకు అండగా నిలిచింది. ఈ కోవలోనే.. ఒడిశాలో ‘కాలియా’ పథకం, మధ్యప్రదేశ్లో ‘భవాంతర్ భుగ్తన్ యోజన’ లాంటి వాటిని చెప్పుకోవచ్చు. ఇలాంటి రాష్ట్రప్రభుత్వ పథకాలు ప్రజలందరి మన్ననలు పొందుతున్నాయి. చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై నిరసనోద్యమం చేపట్టడం గమనార్హం. ప్రాంతీయ పార్టీలన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేతులు కలిపి వ్యవసాయరంగ సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, జాతీయా భివృద్ధి ఎజెండాతో ముందుకుపోవలసి ఉన్నది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడాలి.
(వ్యాసకర్త: దేవీప్రసాద్ జువ్వాడి, డైరెక్టర్, సెంటర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్)