‘నాగలితోడిదే జగమనం గృషిసల్పెడు రైతుబిడ్డలన్/భోగములెట్టివో! మధురభోజనమెట్టిదో! కానకున్న యా/త్యాగులు కార్మికుల్.. నశించిపోవనే… యూహలుపన్నకుమోయి…’ అంటూ రైతుల త్యాగాలు, ఏలికల బాధ్యతలను గూర్చి కేశవపంతుల నరసింహశాస్త్రి ఏడు దశాబ్దాల కిందటే హెచ్చరించిన మాట నేటి దేశ పాలకుల నీతికి సరిగ్గా సరిపోతుంది. దేశానికి రైతే వెన్నెముక అని మాటల్లో చెప్తూనే.. మోదీ సర్కార్ కర్షకులను కన్నీట ముంచుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనమంటే కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను మార్కెట్శక్తుల కోరలకు బలి చేస్తున్నది. తెలంగాణలో యాసంగి పంటగా వచ్చే వరిధాన్యాన్ని కొనేది లేదని చెప్పటం బాధ్యతారాహిత్యమే కాదు, వివక్షాపూరితం కూడా.
దేశ ఆహారభద్రతకు హామీ పడినట్లుగా వరిధాన్యాన్ని తెలంగాణ పండిస్తుంటే.. ప్రోత్సహించాల్సింది పోయి మోదీ ప్రభుత్వం నట్టేట ముంచుతున్నది. రాష్ర్టానికో నీతిగా వ్యవహరిస్తూ మన రైతుల పట్ల వివక్ష చూపుతున్నది. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో పండించిన వరి, గోధుమ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తున్న కేంద్రం, తెలంగాణ వరి ధాన్యం విషయంలో ‘రా రైస్’ మాత్రం కొనబోమని మెలికలు పెట్టడం కక్షపూరితమే. రైతు శ్రేయస్సు దృష్ట్యా రాజకీయాలను పక్కనపెట్టి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టడం గర్హనీయం. గత యాసంగి సీజన్ నుంచి ఎన్నిమార్లు రాష్ట్రమంత్రుల బృందాలు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినా కనీస స్పందన లేదు. ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతులు ఎదుర్కొనే కష్టాలు, నష్టాల గురించి చెప్తే.. మీకేం పనిలేదా అంటూ హేళన చేయటం మోదీ ప్రభుత్వానికే చెల్లింది.
రాజ్యాంగం ప్రకారం.. వ్యవసాయరంగం ఉమ్మడి జాబితాలోనిది. వ్యవసాయ అభివృద్ధి, సంక్షేమాల పట్ల రాష్ర్టాలకు ఎంత బాధ్యత ఉన్నదో, కేంద్ర ప్రభుత్వానికీ అంతే ఉన్నది. రాష్ర్టావతరణకు ముందు కరువు కాటకాలతో తెలంగాణ కన్నీరు కార్చింది. కానీ ఇవ్వాళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమం, అభివృద్ధి పథకాల ఫలితంగా సాగు కష్టాలన్నీ తీరాయి. ఒకప్పుడు గంజి కేంద్రాలతో కరువులో కడుపు నింపుకొన్న తెలంగాణ, నేడు దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా మారింది. గత వానకాలం సీజన్లో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సేకరించిన వరిలో సింహభాగం తెలంగాణ నుంచే ఉండటం గమనార్హం. రైతుల అవసరాలకు పోను మిగిలిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఎదురవుతుంది. ఈ పరిస్థితుల్లోంచే వరిధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నినదిస్తున్నారు, నిలుస్తున్నారు. అవసరమైతే ఢిల్లీ కేంద్రంగా ప్రత్యక్ష పోరాటానికైనా వెనుకాడేది లేదని ప్రకటించటం సమస్య తీవ్రతను తెలుపుతున్నది. కొంతకాలంగా రైతు సమస్యలను మోదీ ప్రభుత్వం రాజకీయం చేయటం పరిపాటైంది. రైతు చట్టాల పేరిట మూడు నల్లచట్టాలను దేశ రైతుల నెత్తిన రుద్దింది మొదలు.., ఏదో ఒక రూపంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. రైతులంటే రాజకీయ పార్టీ కాదు, ప్రజలు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సమన్యాయంతో వ్యవహరించాలి. తెలంగాణ వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలి.