‘మహాలయ అమావాస్య’ మరుసటి రోజు నుంచి దసరా ఉత్సవాలు మొదలవుతాయి. మన జీవితాలకు దోహదపడిన ముందుతరాలకు చెందిన పూర్వికులకు కృతజ్ఞతలు తెలియజేసే ప్రత్యేకమైన రోజు మహాలయ అమావాస్య. ఈ గ్రహం మీద మనిషి ఉనికి రెండు కోట్ల ఏండ్ల కిందటి నుంచి ఉన్నదని శాస్త్రజ్ఞులు చెబుతారు. మనకు ముందు నివసించిన ఈ లక్షల తరాల వారు మనకు ఏదో ఒకటి ఇచ్చే వెళ్లారు. మనం మాట్లాడే భాష, కూర్చునే విధానం, వేషధారణ.. ఇలా దాదాపు ఇవాళ మనకు అందుబాటులో ఉన్న సౌలభ్యాలన్నీ పూర్వికుల నుంచి మనకు సంక్రమించినవే.
ఈ భూమి మీద జంతువులు మాత్రమే ఉన్నప్పుడు.. జీవితమంతా కేవలం మనుగడ సాగించడం, తినడం, నిద్రపోవడం, పునరుత్పత్తి చేయడం, ఆపై ఒకరోజు మరణించడం ఇవే ఉండేవి. తర్వాత కాలంలో… మనుగడ మాత్రమే తెలిసిన ఈ జంతువు మెల్లగా పరిణతి చెందింది. వెన్నును అడ్డంగా ఉంచుతూ వచ్చిన జంతువు క్రమంగా నిల్చోవడం మొదలుపెట్టింది. దాంతో మెదడు పెరగడం ప్రారంభమై, ఈ జంతువు సామర్థ్యాలు పెరుగుతూ వచ్చాయి. అలా ఇతర జీవుల కన్నా మానవులు కొంత మెరుగైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. నిప్పు రాజేయడం వంటి సామాన్య విషయం నుంచి చక్రాన్ని కనుగొనడం, ఇంకా అనేక ఇతర ఆవిష్కరణల వరకూ ఈ అభివృద్ధి కొనసాగింది. అభివృద్ధి ఫలాలు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వ సంపదగా అందుతూ వచ్చాయి.
మనకు అందుబాటులో ఉన్న సౌకర్యాలన్నీ ఊరికే వచ్చేశాయి అన్నట్టు భావిస్తుంటాం. కానీ, మన ముందు తరం వారు లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేదా? అసలు వాళ్లు లేకపోతే మనం ఉండేవాళ్లమే కాదు. ఈనాటి మన స్థితికి కారణం మన పూర్వికులు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం మన బాధ్యత. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించే రోజు మహాలయ అమావాస్య. దీనిని మనం మృతులైన తల్లిదండ్రులకు ఆతిథ్యం ఇచ్చే కార్యక్రమంగా చేస్తుంటాం. నిజానికి ఇది మనకంటే ముందు నివసించిన మన ప్రాచీనులందరికీ మన కృతజ్ఞతా భావనను తెలియజేయాల్సిన సందర్భంగా గుర్తించాలి. అంతేకాదు, మహాలయ పక్షం సమయంలో భారత భూభాగంలో కొత్త పంటలు చేతికొస్తాయి. ప్రజలంతా దసరా నవరాత్రులు, దీపావళి వంటి పండుగలు ప్రారంభించడానికి ముందు, మొదటి పంటను పితరులకు పిండం రూపంలో సమర్పిస్తారు. పెద్దలపై ఉన్న గౌరవానికీ, కృతజ్ఞతా భావనకు ప్రతీకగా మనం మహాలయ అమావాస్యను జరుపుకోవాలి.
– ప్రేమాశీస్సులతో సద్గురు