స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పటికి సాగు సడుగులిరిగి మూలకు చేరింది. అందుకే ఉద్యమనేత కేసీఆర్ రాష్ర్టాధినేతగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టింది ఆశలుడిగిన అన్నదాతను అన్నివిధాలా ఆదుకోవడంపైనే. ఉచిత విద్యుత్తు, రైతుబీమా, రైతుబంధు, రైతు వేదిక, గోదాముల విస్తరణ, ధాన్యం కొనుగోలు.. ఇలా రైతుకు అవసరమైన వనరులన్నిటినీ సమకూర్చి నిస్సందేహంగా ఇది రైతురాజ్యమని చాటిచెప్పారు. అయితే ఎరువుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భమిది. సాగులో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం పటాపంచలు చేసింది. పంటను చీడపీడల నుంచి కాపాడుకుంటూ, భూమికి బలం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికలు వేశారు. ఎరువులు, మందులు సమకూర్చేందుకు ఆయన లోతైన సమాలోచనలు జరిపారు. ఎరువులతో పాటుగా విత్తనాల కొరత కూడా లేకుండా చేశారు. సకాలంలో అవసరమైనంత సరుకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా రైతుకు ధైర్యంగా సాగుపనులు చేపట్టేందుకు భరోసా లభించింది. నాటి, నేటి పరిస్థితుల మధ్య జమీన్ ఆస్మాన్ తేడా మనకు కనపడుతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల దుకాణాల దగ్గర నో స్టాక్ బోర్డులు నిత్యకృత్యంగా ఉండేవి. స్టాక్ ఎప్పుడొస్తుందో తెలియక రైతులు అయోమయంలో గడిపేవారు. చెప్పులతో సహా రకరకాల వస్తువులు క్యూలైన్లలో ఉంచి ఉసూరుమంటూ పడిగాపులు కాచేవారు. ఎరువుల దుకాణాల వద్ద ధర్నాలు జరిగేవి. ఉద్రిక్తతలు తలెత్తి పోలీసు స్టేషన్లలో ఎరువులు అమ్మిన సందర్భాలూ కోకొల్లలు. విసిగి వేసారిపోయి ఎరువుల గోదాములపై రైతులు దాడులు చేస్తే పోలీసు లాఠీలు వారి వీపులపై విరిగేవి. రైతులు పడ్డ ఆ గోసను తీర్చేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకుసాగారు. సీజన్కు ముందే సేకరణ జరగాలి. వానకాలం సీజన్కు ముందు మార్చి-ఏప్రిల్ నాటికే కేంద్రం నుంచి కొనుగోలు పూర్తికావాలి.
సీఎం కేసీఆర్ అమలుచేసిన ఈ వ్యూహం ద్విముఖమైనది. ఎరువులు ఎక్కువగా అవసరమయ్యే వానకాలం సీజన్కు ముందే సరఫరాపై ఢిల్లీతో సంప్రదింపులు జరపడం మొదటిది. ఇతర రాష్ర్టాలకు పెద్దగా అవసరం పడని సమయంలో కొనుగోలు చేయడం రెండవది. ముందస్తు అంచనాతో సాగుకు సరిపడా సరుకు తెప్పించి ఉంచడం వల్ల కొరత అనే మాట వినిపించడం లేదు. సేకరించిన ఎరువులను మండల స్థాయిలోనే నిల్వచేసి అడుగగానే, అడిగినంత సరఫరా చేస్తున్నారు. వ్యవసాయం పెరిగింది. వినియోగం 50 శాతానికిపైగా పెరిగింది. అయినా సరఫరాలో ఎలాంటి సమస్యా రావడం లేదు. ఎరువుల రవాణాకు రేక్ పాయింట్లు, నిల్వచేసే గోదాములూ పెంచారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బఫర్ స్టాక్ నిల్వలూ పెంచారు. ఒకప్పుడు లక్ష టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంటే మహా ఎక్కువ. ఇప్పుడు 4 లక్షల టన్నుల బఫర్ స్టాక్ పెడుతున్నారు. ఇలా అన్నింటిని ఆకళింపు చేసుకొని చర్యలు తీసుకోవడంతో తెలంగాణ రైతు సంబురంగా సాగు చేసుకుంటున్నాడు.