ఆర్థిక సంక్షోభాల్లోంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు మరోసారి పారిశ్రామిక నియంత్రణల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. హరిత, సుభిక్ష, సుస్థిర పారిశ్రామిక భవిష్యత్తు కోసం సబ్సిడీలు, నియంత్రణలు, టారిఫ్లను సవరించుకోవాల్సిన అవసరం ఉన్నదని, అందుకు నియంత్రణలే శరణ్యమనే వాదనను ముందుకుతెస్తున్నాయి. అధికారుల కర్ర పెత్తనం, పశ్చిమదేశాల భావదాస్యానికి అలవాటుపడ్డ కొన్ని వర్ధమాన దేశాల్లోనూ పారిశ్రామిక నియంత్రణ విధానం వైపు వెళ్తున్నాయి.
ఇండియా చేపడుతున్న పారిశ్రామిక నియంత్రణ విధానాలు ఇక్కడ ఉదహరించుకోవచ్చు. ఉత్పత్తితో అనుసంధానించిన ప్రోత్సాహకాలు (పీఎల్ఐ), విదేశీ పెట్టుబడులపై నియంత్రణలు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వంటి ఉత్పత్తులపై సంకుచిత టారిఫ్ విధానాలు, ల్యాప్టాప్ల వంటివాటిపై నిషేధాలు, లైసెన్సింగ్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెలిసిందే. ఇవన్నీ డిమాండ్, సరఫరాల్లో ఎగుడు దిగుడులకు స్పందనగా ఏక కాలంలో ప్రవేశపెట్టినవి కాకపోవచ్చు. కానీ ఇవన్నీ పారిశ్రామిక నియంత్రణ విధానంలో భాగమైన పరికరాలు. అధికారులు, సానుభూతిపరులు మాత్రం ఇవన్నీ సంపన్న దేశాల్లో అమలు చేస్తున్నవేగా అని దబాయిస్తారు.
ఇవన్నీ కూడా మనదేశంలోనూ గతంలో ఉన్నవే కదా అని నిలదీస్తే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరని వాదిస్తారు. మాది కాంగ్రెస్ తరహా ప్రభుత్వం కాదు, స్థిరమైన, స్పందించే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నదని గొప్పలు పోతారు. ‘తూర్పు ఆసియాలో ఈ తరహా నియంత్రణ విధానాలు విజయవంతమయ్యాయి. మనమూ అమలుచేసి చూస్తే పోయేదేముంది’ అనే ధోరణి దీనివెనుక కనిపిస్తుంది. ఇది నిజమే అనుకుందాం. పారిశ్రామిక నియంత్రణలు కొన్నిసార్లు, కొన్నిచోట్ల పనిచేసి ఉండవచ్చు. అందులో మనకు పనికివచ్చే అంశం అంటూ ఏదైనా ఉందా? అనేది ప్రశ్న. అంశాలవారీగా ఆ సంగతి పరిశీలిద్దాం.
మొదటిది, పారిశ్రామిక నియంత్రణలకు రాజ్యవ్యవస్థకు అందుబాటులో ఉన్న సిబ్బంది సంఖ్య, వారికున్న నైపుణ్యం చాలా ముఖ్యం. జపాన్లో పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని పర్యవేక్షించిన అంతర్జాతీయ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద వివిధ స్థాయిల్లో 12 వేల మంది ఉద్యోగులుండేవారు. మన వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖలకు కలిపి మంజూరైన మొత్తం ఉద్యోగుల సంఖ్య 400 మాత్రమే.
రెండు, పారిశ్రామిక నియంత్రణ విధానానికి నిపుణులతో కూడిన అరమరికలు లేని, పారదర్శకమైన విధాన నిర్ణాయక వ్యవస్థ ఉండాలి. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖలో ఒక్క ఇంధన విధానం రూపకల్పనకే పది ముఖ్యమైన కమిటీలున్నాయి. వీటిలో ఏకాభిప్రాయ విధానం అమలవుతుంది. ఆ కమిటీల్లో 40 శాతం మంది పరిశ్రమల రంగానికి చెందినవారు, 40 శాతం మంది స్వతంత్ర నిపుణులు, విద్యావేత్తలుంటారు. పౌరసమాజ ప్రతినిధులకూ కమిటీల్లో స్థానం కల్పించారు. ఇక ప్రభుత్వ ప్రాతినిధ్యం ఓ ఐదు శాతానికే పరిమితం. మరి భారత్లో ఇలాంటి వ్యవస్థకు ఆస్కారం ఉందా? ఇక్కడ విధాన నిర్ణయాలు ఇందుకు పూర్తిభిన్నంగా జరుగుతాయని చెప్పాల్సిన పనిలేదు.
మూడు, పారిశ్రామిక విధానం కేవలం విదేశీ కంపెనీలను అనుమతించాలని మాత్రమే చెప్పదు. ప్రభుత్వ విధానపరమైన ఎంపికల్లో వాటిమాటకు విలువ ఇవ్వాలని కూడా అది సూచిస్తుంది. ఇది మనదేశంలో మింగుడుపడే విషయం కాదు. కొరియా, జపాన్ మధ్య అభివృద్ధి చెందిన వాణిజ్య, పారిశ్రామిక సయోధ్య ఇక్కడ ప్రస్తావించుకోవాలి. గ్లోబల్ సప్లయ్ చైన్లలో మనదేశం ప్రవేశించాలంటే ప్రస్తుతం ఆ చైన్లలో అగ్రగాములుగా ఉన్న కంపెనీల ఉత్సాహపూరితమైన అనుమతి, ఆమోదాలు అవసరం. ప్రస్తుతం అలాంటి కంపెనీలేవీ భారత్కు లేవు.
నాలుగు, పారిశ్రామిక విధానం విజయవంతం కావాలంటే పరిశోధనల్లో, సాంకేతిక వృద్ధిలో స్వదేశీ ప్రైవేటురంగం క్రియాశీల భాగస్వామ్యం అవసరం. కీలక సాంకేతిక సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి.1950 దశకంలో జపాన్ సాధించిన అభివృద్ధిలో ఇదే కీలకం. 1975 నాటికి సెమీకండక్టర్స్ రంగంలో అగ్రస్థానం నుంచి అమెరికాను తప్పించి ఆ స్థానాన్ని జపాన్ కైవసం చేసుకోవడం దీనివల్లే సాధ్యమైందని చెప్పవచ్చు.
ఐదు, పారిశ్రామిక విధానంలో అంతర్గతంగా, అలాగే ఒకరంగం నుంచి మరొక రంగానికి కార్మికుల వలసలు అవసరమవుతాయి. ఇక్కడ మరోసారి కొరియాను ఉదహరించుకుందాం. ఆ దేశ పారిశ్రామిక విధాన అభివృద్ధి దశలో వ్యవసాయంరంగంలోని అదనపు శ్రామికులను ఉత్పాదక రంగంలోకి కాకుండా సేవలు, అనుబంధ రంగాల్లోకి మళ్లించారు. ఇక అప్పుడే చదువులు పూర్తిచేసుకున్నవారిని మాత్రమే ఉత్పాదనలోకి అనుమతించారు. భారతదేశ ప్రస్తుత రాజకీయ, ఆర్థికవ్యవస్థకు ఇది అనువుగా ఉంటుందా?
ఆరు, పారిశ్రామిక నియంత్రణకు ప్రజల పొదుపు సొమ్ము అధికంగా అందుబాటులో ఉండటం అవసరం. చైనా బాహాటమైన నిరంకుశాధికారం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఇతర తూర్పు ఆసియా దేశాల్లో అధిక పన్నులతో దీన్ని ఒడిసిపడుతున్నారు. వడ్డీ రేట్లు పెంచుతూ పోవడం మరోమార్గం. ముఖ్యంగా కొరియాలో వడ్డీరేట్లు అధికం.
ఏడు, పారిశ్రామిక నియంత్రణ విధానానికి రాజకీయాలకు అతీతంగా పనిచేసే ప్రైవేటు రంగం అవసరం. కంపెనీలు రాజకీయ నేతల లేదా రాజకీయ పార్టీల తోక పట్టుకుని పోతే తీవ్రమైన రాజకీయ ఉత్పాతాలు ఎదురవుతాయి. కొరియా కార్పొరేట్ కంపెనీలు అన్నిరకాల రాజకీయ ఆటుపోట్లను తట్టుకొని నిలవడానికి అవి రాజకీయాలకు అతీతంగా పనిచేయడమే కారణం.
ఇందులో చాలావరకు భారత్కు వర్తించేవి కావని పైపైన చూస్తేనే తెలిసిపోతుంది. పారిశ్రామిక నియంత్రణల విధానం ఆసియాలో అద్భుతాలు సాధించిన దేశాల్లో బాగా పనిచేసి ఉండవచ్చుననే అభిప్రాయంతో నాకు విభేదాలున్నాయి. ఒకవేళ విజయాలే అనుకున్నా అవి గుణపాఠాలు మనదేశంలో ఆ తరహా విధానాలు ప్రవేశపెట్టడాన్ని ప్రశ్నించమనే చెప్తాయి.
(అనువాదం: తుమ్మలపల్లి రఘురాములు)