కేసీఆర్ ఈజ్ రైట్..!
ఇప్పటివరకు దేశ ద్రోహులుగా ముద్రపడినవారు, విద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కొంత ఊరట పొందవచ్చు. వారికి మరొక తోడు దొరికింది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ద్రోహ ఆరోపణలకు గురయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కు చెందిన నాయకులు ఆయనను జైల్లో పెట్టాలని ప్రకటనలు చేస్తున్నారు. మనం నిజంగా ఒక ప్రజాస్వామ్యంగా వృద్ధి చెందుతున్నామా?
కేసీఆర్ చేసిన నేరమేమిటి? రాష్ర్టాల ప్రయోజనాలను విస్మరిస్తున్నందుకు కేంద్రంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రాజ్యాంగాన్ని లోతుగా పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని డబ్భు ఏండ్లవుతున్నది. ఇంతకాలం తర్వాత కూడా ప్రజల అవసరాలను తీర్చడంలో విఫలమయ్యాం. యాభై ఏండ్లుగా ప్రజా జీవితంలో గడిపిన వ్యక్తిగా చెప్తున్నా.. ఇప్పుడు ఎదురవుతున్న అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మొత్తంగా సమీక్షించుకోవాలన్న నా సూచనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటున్నా’ అని కేసీఆర్ అన్నారు. మన దేశం వృద్ధి చెందే కొద్దీ రాష్ర్టాలను బలోపేతం చేసే బదులు, కాంగ్రెస్ లేదా బీజేపీ నేత్వత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు తమ కేంద్రీకృత చర్యల ద్వారా మరింత బలహీనపరిచాయి. ఒకే దేశం, ఒకే గుర్తింపు లేదా ఇటీవల రాష్ర్టాల అనుమతి లేకుండానే ఐఏఎస్ అధికారుల డిప్యూటేషన్ అధికారాలు చేజిక్కించుకోవడం మొదలైన ప్రతిపాదనల ద్వారా రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది- ఇదీ కేసీఆర్ వాదనలోని సారాంశం.
కానీ, ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు గుప్పించాయి. ప్రజాస్వామ్యయుత పాలనకు కేసీఆర్ ఏ మాత్రం గౌరవం ఇవ్వరని, ఆయన డిమాండ్ అంబేద్కర్ను అవమానించడమేనని విమర్శించాయి. ఆయనను దళిత వ్యతిరేకి అని కూడా అన్నాయి. మన దేశంలో ప్రత్యేకించి ఇటీవలి కాలంలో- రాజకీయ చర్చ ఏ మాత్రం తర్కబద్ధత, హేతుబద్ధత, పరిశోధన ప్రాతిపాదికగా జరగకపోవడం పెద్ద సమస్య. పర్యావరణ కార్యకర్త కావచ్చు, కమెడియన్, రచయిత, గిరిజన కార్యకర్త, రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు- తాము వ్యతిరేకించేవారిపై దేశద్రోహి అనే ఒక ముద్ర వేయడం తేలిక. ఇప్పుడు కేసీఆర్ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనపై ప్రతిస్పందన
కూడా అటువంటిదే.
కానీ వాస్తవాలేమిటి? రాజ్యాంగాన్ని సమీక్షించాలని కోరడం ఇదే మొదటిసారా? రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత ఈ 71 ఏండ్లలో వంద సార్లకు పైగా సవరించుకున్నాం. ఎక్కువ సవరణలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. మంచికో, చెడుకో పలుదేశాల మాదిరిగా రాజ్యాంగాన్ని తిరగరాసుకోవడం అసాధారణమేమీ కాదు.
కేసీఆర్ ప్రతిపాదన పట్ల కన్నెర్ర చేస్తున్న కాషాయ నేతలు గతాన్ని ఒకసారి గుర్తుకుతెచ్చుకోవాలి. 1999 ఎన్నికల సందర్భంగా ఎన్డీయే రాజ్యాంగాన్ని సమీక్షిస్తామని తమ జాతీయ అజెండాలో పేర్కొన్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే వాజపేయి ప్రభుత్వం ఇందుకోసం 2000 సంవత్సరం ఫిబ్రవరిలో 11 మంది సభ్యులతో ప్రముఖ న్యాయకోవిదుడు ఎం.ఎన్.వేంకటాచలయ్య నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ లక్ష్యాలు కూడా గుర్తుకుతెచ్చుకోవలసినవే. ‘ఆధునిక భారతదేశంలో సమర్థమైన, సాఫీయైన, ప్రభావవంతమైన పాలనా వ్యవస్థ, సామాజిక-ఆర్థిక పరివర్తన కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిధిలో అవసరమైన మార్పులు తేవడం సాధ్యమా అనేది కమిషన్ యాభై ఏండ్ల అనుభవాల నేపథ్యంలో పరిశీలిస్తుంద’ని పేర్కొన్నారు. తీవ్ర చర్చల అనంతరం కమిషన్ డజన్ల కొద్ది మార్పులను సూచించింది. ఇందులో 58 రాజ్యాంగ సవరణలకు సంబంధించినవి. 86 శాసనపరమైన చర్యలు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, వికేంద్రీకరణ-అధికారాల బదలాయింపు మొదలైన అంశాలపై ఈ సూచనలున్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్ సూచనల మాదిరిగానే ఇవి కూడా అమలుకు నోచుకోలేదు. అది వేరే సంగతి!
రాజ్యాంగాన్ని సమీక్షించాలనడానికి తగిన కారణాలను ఆయన చెప్తున్నారు. ప్రత్యేకించి కేంద్రం రాష్ర్టాలను బలహీనపరుస్తున్నదని అంటున్నారు. ఈ విధంగా బలహీనపరచడం దేశాన్ని రాష్ర్టాల సంఘటనగా అభివర్ణిస్తున్న రాజ్యాంగంలోని 1వ ఆర్టికల్ను ఉల్లంఘించడమే కాదా?
ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలిస్తాను. ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఇటీవల కేంద్రం ఒక ప్రతిపాదన చేసింది. శాంతిభద్రతలు రాష్ట్ర జాబితాలోనిది. కేంద్రప్రభుత్వ చర్యకు ప్రతిగా కేసీఆర్ కానీ మరో ముఖ్యమంత్రి కానీ అఖిల భారత సర్వీసు అధికారులను కాకుండా, సొంత అధికారులను నియమించుకుంటే ఎలా ఉంటుంది? చట్ట ప్రకారం ఇందులో తప్పేమీ లేదు. విద్యారంగాన్నే తీసుకుందాం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చేవరకు ఇది రాష్ట్ర పరిధి అంశం. ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఇష్టారీతిన మార్చారు. రాజ్యాంగ పీఠికను కూడా మార్చ
ప్రయత్నించారు. ఈ మార్పులలో మంచివీ ఉన్నాయి, చెడ్డవీ ఉన్నాయి. ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని సవరణలను తొలగించి యథావిధిగా మార్చారు.
ఇవన్నీ ప్రధాన అంశాలే. భిన్నవర్గాలు చర్చించదగిన అంశాలే. వీటిని రాజకీయ నినాదాలతో వ్యక్తిగత విమర్శలతో కొట్టిపారేయగూడదు. రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిందే, సంస్కరించి మరింత బలోపేతం చేయవలసిందే. ఇది చర్చల ద్వారానే సాధ్యపడుతుంది. తమతో ఏకీభవించని వారిని అవహేళన చేయడం, నిరసనలను అణిచివేయడం, విమర్శకులను అరెస్టు చేయడం వల్ల రాజ్యాంగం బలపడటానికి బదులు మరింత బలహీనపడుతుంది. ప్రజా జీవితంలో ఉండేవారందరికి ఈ సూత్రం ఒక సాధారణ నియమంగా ఉండాలి.
ఇక మళ్లీ విద్య విషయానికి వస్తే, సమానుల మధ్య మాత్రమే సమానత్వం వర్తిస్తుందనే మౌలిక భావనను ఆమోదించాలి. ఉమ్మడి పాఠ్యాంశం లేదా పరీక్ష పేర- ఒక చిన్న గ్రామం లేదా పట్టణంలోని విద్యార్థిని మెట్రో నగరంలో పెరిగిన విద్యార్థితో ఎలా పోటీ పెట్టగలం? కేరళ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాలకు ఒకే ప్రామాణికం ఉండదని గతంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ తెలిపారు. కేసీఆర్ ఆహ్వానించిన ‘వన్ కార్డ్ వన్ నేషన్’ కావచ్చు, ఇతరత్రా ఉమ్మడి నిబంధనలు ప్రవేశపెట్టాలనడం కావచ్చు- ఇది రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం మాత్రమే కాదు, దేశ భిన్నత్వ స్వభావాన్ని దెబ్బతీయడమే.
ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ద్వారా మనకు చెప్పిందేమిటంటే- (భారత భావన వక్రీకరణలను ప్రభుత్వం చక్కదిద్ద ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇంకా ఆ పాఠ్యాంశాలున్నాయా అనేది చెప్పలేను) ‘రాజ్యాంగ పాఠం దానిని రాసుకున్నప్పటి సమాజ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. కానీ అది నిశ్చలమైనదీ, మార్చకూడనిది కాదు. పునఃపరిశీలన చేసుకొని సవరించుకోవచ్చు’. అంబేద్కర్ సహా రాజ్యాంగ నిర్మాతలు-భవిష్యత్ తరాలు ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తాయని పేర్కొంటూనే సవరణలు అవసరమవుతాయని భావించి, అందుకు వెసులుబాట్లు పొందుపరిచారు.
– జి.ఎస్.వాసు
ఎడిటర్, ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’
(సౌజన్యం: ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’)