చందమామపై భారతీయుని అడుగు త్వరలోనే పడనుందా? జాబిల్లిపై మన త్రివర్ణ పతాకం రెపరెపలాడనుందా? అంటే అవునని బలంగా చెప్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ నెల 14న మధ్యాహ్నం రెండు గంటల 35 నిమిషాలకు శ్రీహరికోటలో సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్వీఎం 3పీ4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం జరుగనున్నది. ఈ సాఫ్ట్ లాండింగ్ విజయవంతమై లాండర్ (Lander) చంద్రునిపై సురక్షితంగా దిగితే ఈ ఘనత సాధించిన నాలుగవ దేశంగా భారత్ నిలువనున్నది. గతంలో అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి.
‘చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. గోగుపూలు తేవే..’ అంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తూ జాబిల్లిని పరిచయం చేయటం మనకు చిరపరిచితమే. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి తమ్ముడు, విష్ణుమూర్తికి బావమరిది అయిన చంద్రుడు మనకు మేనమామ. చంద్రునిపై మచ్చను లేడి కూనగాను, కుందేలుగాను భావించి హరినాంకుడని, శశాంకుడని మన పూర్వీకులు పిలిచారు. లాటిన్ భాషలో లూనా అనగా మూన్. భూమికి అతి సమీపంలోని గోళమైన చంద్రుని గురించి విశేషాలు 1610 గెలీలియో టెలిస్కోప్ ద్వారా ఎక్కువగా తెలిశాయి. 1959లో రష్యా వారి లునిక్ (Lunic-3) చంద్రుని ఆవలి వైపు ఫొటోలు తీసింది.
భూమితో పాటే 4.5 బిలియన్ సంవత్సరాల కింద ఏర్పడిన చంద్రుడు ఒక నిశ్శబ్ద, నిర్జీవ ప్రపంచం. చంద్రుని వ్యాసార్థం 3,476 కిలోమీటర్లు. సౌర కుటుంబంలో ఐదవ అతిపెద్ద ఉపగ్రహం చంద్రుడు. భూమి సైజులో 1/3 వంతు, ద్రవ్యరాశిలో 1/81వంతు, 1/6 మాత్రమే చంద్రునికి ఉన్నాయి. తక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల గాలులను పట్టి ఉంచే శక్తి లేక చంద్రునిపై వాతావరణం లేదు. గాలి లేకపోవడంతో ధ్వని ప్రసారం కాదు. ఈ మధ్య చంద్రయాన్-1 ద్వారా నీటి జాడలు కనుగొన్నారు. 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉండే చంద్రునిపై పగలు 127 డిగ్రీల సెల్షియస్, రాత్రి మైనస్ 173 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలుంటాయి. వాతావరణం లేకపోవడం వల్ల చంద్రునిపై ఆకాశం నల్లగా కనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం అకస్మాత్తుగా సంభవిస్తాయి. మన భూమి వెన్నెల చంద్రునిపై పడుతుంది. ఈ వెన్నెలలో మనం చంద్రునిపై హాయిగా పుస్తకం చదువుకోవచ్చు.
చంద్రుడు తనచుట్టూ తాను తిరిగే వేగం భూమి చుట్టూ తిరిగే వేగం ఒకటే కాబట్టి ఎప్పుడూ చంద్రుని ఒక వైపు మాత్రమే మనం చూడగలం. చంద్రునికి భూమికి మధ్యదూరం పెరుగుతూ, తగ్గుతూ ఉండటం వల్ల మనకు కనబడే చంద్రబింబం సైజు మారుతూ ఉంటుంది. మనకు 3,84,043 కిలోమీటర్ల దూరంలో గల చంద్రునిపై నుంచి సూర్యుని కాంతి మనకు చేరడానికి 1.3 సెకన్ల సమయం పడుతుంది.
ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఆధిపత్యం కోసం అమెరికా, రష్యాలు చందమామపై పరిశోధనలు వేగవంతం చేశాయి. 1969 జూలై 16న అపోలో 11 ద్వారా అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తొలిసారి చంద్రునిపై కాలు పెట్టారు. ప్రపంచంలోనే 400 స్పేస్ కంపెనీలలో మన దేశానికి చెందిన ఇస్రో 5వ స్థానంలో ఉన్నది. 2008లో చంద్రయాన్-1 ద్వారా చంద్రకక్షలోకి ప్రవేశించి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు తీసి నీటి జాడను కనుగొన్నది. 2019లో చంద్రయాన్-2 ద్వారా చంద్రుని మీద 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు చేరుకున్న విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయింది. 90 శాతం విజయవంతమైన ఈ మిషన్ వేగాన్ని నియంత్రించడంలో విఫలమైంది. ఈ వైఫల్యం నుంచి గుణపాఠం నేర్చుకున్న ఇస్రో చంద్రయాన్-3ను 2023 జూలై 14న ప్రయోగిస్తున్నది.
ఈసారి ఆర్బిటర్ లేకుండా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు సాఫ్ట్ లాండింగ్ ద్వారా దిగుతాయి. వేగాన్ని నియంత్రించే అల్టి మీటర్లు, యాక్సిలరో మీటర్, వెలాసిటీ మీటర్లు, సమతల మైదానాన్ని గుర్తించి ఇబ్బందులను అధిగమించే హజార్డ్ డిటెక్షన్ అండ్ ఎవిడెన్స్ కెమెరాలు ఈసారి అమర్చారు. చంద్రయాన్-3 విజయవంతమైతే ఇస్రో అంతరిక్ష వాణిజ్యం మరింత విస్తరిస్తుంది.
చంద్ర భూకంపాలు, రేహోలిత్లు (రాళ్లు, మట్టి), ఉపరితల ప్లాస్మా పర్యావరణం, మూలకాల కూర్పునకు సంబంధించిన రసాయన విశ్లేషణ ,చంద్రునిపై శాశ్వత స్థావరాలు ఏర్పాటు, నీటి ఉనికి అన్వేషణ, మానవ ఆవాసాల ఏర్పాటు, చంద్రునిపై నుంచి అంతరిక్ష ప్రయోగాల నిర్వహణ, చంద్రునిపై అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, చంద్రునిపై ఉష్ణోగ్రతలపై పరిశోధన, ఇస్రో ప్రయోగాలపై రాకెట్లపై విశ్వాసం పెరగడం, గగన్యాన్కు మార్గం సుగమం కావడం భారత్ కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించడం లాంటి ప్ర యోజనాలు ఈ చంద్రయాన్-3 ద్వారా సమకూరనున్నాయి. కనీసం రూ.3 వేల నుంచి రూ.50 వేల కోట్లు ఖర్చయ్యే చంద్రయాన్ ప్రాజెక్టును ఒక సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతో అనగా రూ.615 కోట్లతో నిర్వహిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల కృషికి దేశ ప్రజలందరూ జేజేలు పలుకాలి.
-తండ ప్రభాకర్ గౌడ్
94918 22383