తెలుగువారికి తమదైన ఒక ప్రత్యేక నృత్యరీతి ఉండాలని, నాట్యాభినయాల కళాసంతకం ప్రపంచ కళాజగత్తుకు అందించాలని జీవితాంతం తపించిన కళారాధకుడు, కళాసాధకుడు, కళాచోదకుడు, కళావిమర్శకుడు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ. సౌండ్ వైబ్రేషన్ థియరీని ప్రతిపాదించి మార్గ, దేశీయ జానపద నృత్యరీతుల మీద ఎంతో కృషిచేసిన గొప్ప నృత్యగురువు నటరాజ రామకృష్ణ.
మీకు హస్త అభినయాలు లేవా? అని రామయ్య పిైళ్లె ప్రశ్నిస్తే ‘ఎక్కడైతే మీ హస్త అభినయం ఆగిపోతుందో అక్కడినుంచి మా సాత్వికాభినయం మొదలవుతుందని’ సగర్వంగా సాధికారికంగా చెప్పిన గొప్ప పరిశోధకులు నట రాజ రామకృష్ణ. అర్ధాభినయం, భావాభినయం, విశిష్టాభినయాల మధ్య ఉన్న పలుచని భేదాన్ని వారు పలికించినంత అందంగా మరెవ్వరూ చెప్పలేరేమో అంటారు వారి ప్రియ శిష్యులు కళాకృష్ణ. ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో నాట్యకారులెవరినీ అడి గినా నటరాజ రామకృష్ణ లెక్చర్ డెమోనిస్ట్రేషన్ చూసి ఆ స్ఫూర్తితోనే నృత్యం నేర్చుకున్నామని చెప్తారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
దేవదాసీ నిర్మూలన చట్టంతో ఆ నృత్యాలే కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఎదురైనప్పుడు ఆంధ్రలాస్యనర్తనాన్ని పునఃప్రతిష్ఠించిన దార్శనికుడు నటరాజ రామకృష్ణ. 1970లో నిర్వహించిన మొదటి అభినయ సదస్సు ద్వారా ఒక కొత్త నాట్యానికి మార్గనిర్దేశనం చేశారు. ఆ సభకు ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఎంతోమంది మహానుభావులను పిలిచి ఆ సదస్సులోనే ఒక సిలబస్ను తయారుచేసి అప్పుడే పుట్టిన ఆ బిడ్డకు ‘ఆంధ్రనాట్యం’గా నామకరణం చేసి తెలుగువారికి ఒక సాధికారిక దర్పణంగా అందించారు. ఆగమ, ఆలయ, ఆస్థానరీతుల్లో ఈ నృత్యం చేయడం వల్ల తెలుగు సంస్కృతి సౌరభాలు పెద్దఎత్తున విరజిమ్మబడినాయి.
ఆలయ ఆస్థాన ప్రబంధ నర్తనాల సమగ్ర రూపమే ఆంధ్రనాట్యం. నృత్యం, అభినయం ఈ రెండింటిని సమపాళ్ళలో పొందుపరిచి రసజ్ఞులను ఆనందింపజేస్తుంది. లాస్యనర్తనానికి సంపూర్ణత్వాన్ని అందించిన నవజనార్ధన పారిజాతం ద్వారా తొమ్మిది రాత్రుళ్ళు తొమ్మిది మంది సత్యభామలతో ఈ కార్యక్రమాన్ని చేయించారు. పేరిణీతో తెలంగాణకు ఒక వికసిత నృత్యరూపకాన్ని పునఃప్రతిష్ఠింపజేసి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న తపోధనుడాయన.
రామప్ప దేవాలయంలోని గర్భగుడికి అటు ఇటుగా ఉన్న శిల్పాల భంగిమలను తీసుకొని పేరిణి నృత్యాన్ని పునఃసృష్టి చేయడం ఆయనకే చెల్లింది. ఎంతో వైభవంగా రాజుల కొలువుల్లో ఎగిసిన అనేక నృత్యాలు, నృత్యరీతులు విదేశీ పాలకుల చేతుల్లో మరుగున పడిపోతే మళ్లీ వాటిని పరిశోధించి, పునఃస్థాపించి తెలుగువారు గర్వపడేలా తమకు ఒక నృత్యకళను అందించి ఆంధ్ర నాట్యానికి పునర్జీవం పోసిన అపర నాట్యబ్రహ్మగా నటరాజ రామకృష్ణను తెలుగువారందరూ నిత్యం తలవాలి, సదా కొలవాలి కూడా.
ఒక వ్యక్తి జీవితకాలంలో ఇంతపని చేయగలుగుతారా? అని ఆశ్చర్యపోయేన్ని పనులు నృత్య కళ కోసం, నృత్య వికాసం కోసం ఎన్నో చేశారు నటరాజ రామకృష్ణ. అసలు ఆంధ్రదేశానికి నాట్యకళ ఎక్కడ? అని వేళాకోళం చేసినవారే ముక్కున వేలేసుకునేలా ఆంధ్ర నాట్యాన్ని మించింది లేదని కూచిపూడిలో యక్షగానాలు మాత్రమే ఉన్నాయని ఆంధ్రనాట్యంలో నృత్య రూపకాలు కూడా ఉన్నాయని మేఘసందేశం, కుమార సంభవం, వేంకటేశ్వర కళ్యాణం, ఋతుసంహారం, బాలాజీ వంటి నృత్య రూపకాలను చూపించారు. తెలుగు రాష్ర్టాల్లో నృత్యనాటికలు మొదటిసారిగా రూపొందించింది నటరాజ రామకృష్ణే. అప్పటివరకు యక్షగానాలు మన తెలుగు ప్రాంతాలలో విస్తృతంగా ప్రదర్శించేవారు. వారెక్కడికి వెళ్లినా వారి కళ్లు నాట్యానికి పనికొచ్చేవారి కోసం వెతికేవట.
ఏ నృత్యమైనా సాహిత్యాన్ని బట్టి, భావాన్ని బట్టి, ఛందస్సును బట్టి రూపకల్పన చేయబడుతుందని చెప్పేవారు నటరాజ రామకృష్ణ. మానవ సంస్కృతి సారాన్ని నృత్యకళగా అభివర్ణించారు. నాట్యకళ కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. తన జీవితాన్ని నాట్యకళకే అంకితం చేశారు. వారి సిఫారసు మేరకు ఏర్పాటైనవే ఇప్పుడు మనం చూస్తున్న ప్రభుత్వ సంగీత నృత్యకళాశాలలు. ప్రస్తుతం ఉన్న త్యాగరాజ సంగీత నృత్యకళాశాల ప్రిన్సిపల్గా రావాలని స్వయంగా బూర్గుల రామకృష్ణారావు ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించి, కళా ప్రచారం తన ధ్యేయమనీ, ఉద్యోగిగా అది సాధ్యం కాదని తెలిపారట. కళావికాసం విస్తరించాలని, అందుకు అకాడమీల స్థాపన అత్యావశ్యకమని వాదించి మరీ ప్రభుత్వంతో ఆ పని చేయించారు.
ఆయనెంత నిజాయితీపరుడో, తెలిపే ఒక ఉదంతం గురించి చెప్పాలి. ఒకసారి రాజామణి అనే నర్తకి తన దగ్గర నృత్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన నటరాజ రామకృష్ణను ఒక గొప్ప కళాపోషకుడి దగ్గరకు తీసుకువెళ్ళారట. నాదోత్పత్తి ఆధారంగా నాట్యం నేర్పించటంలో అందె వేసిన చేయి రాజామణిది. నృత్యం చేయమనగానే వెంటనే చేశారట నటరాజ రామకృష్ణ. వీరి ప్రదర్శన చూశాక ఆ కళాపోషకుడు రామకృష్ణ చేతిలో ఒక వస్తువును పెట్టి ఆ గుప్పిట మూసి ఇంటికి వెళ్లేంతవరకు చూడొద్దన్నారట. ఇంటికి రాగానే రాజామణి గుప్పెట తెరిచి చూస్తే అందులో బంగారు నాణెం ఉందట. ‘అమ్మా, ఇది మీదే’ అంటూ గౌరవంగా ఆవిడకు అందించారట రామకృష్ణ. ఆ వినయాన్ని చూసి మురిసిపోయి తిరిగి నటరాజ రామకృష్ణకే ఆ నాణేన్నిచ్చేసి ‘నిస్వార్థంగా ఉండే నీకు వేయి విజయాలు కలుగుగాక’ అంటూ ఆశీర్వదించింది. గురుశిష్యుల మధ్య ఉండే అనుబంధమది.
తన సొంత డబ్బులతో చిన్నప్పుడు రామకృష్ణ మిషన్లో అందరికీ బట్టలు కుట్టించటం దగ్గర్నుంచీ పెద్దయ్యాక ఎందరో దేవదాసీలు, నాట్యకళాకారులకు నెలనెలా డబ్బులు పంపించటం, ఎంతోమంది పేదపిల్లలను తన ఇంటికే తెచ్చి వారికి భోజన వసతులు సమకూరుస్తూ నాట్యం నేర్పించటం వరకు ప్రతిదీ ఎదుటివారికి ఇవ్వడంలోనే ఆనందాన్ని పొందే హృదయ సంస్కారం రామకృష్ణది.
సాహిత్యకారునిగా నటరాజ రామకృష్ణ గురిం చి మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వారు నాట్యాచార్యులే కాదు, గొప్ప అక్షరశిల్పి కూడా. వారు 50 పుస్తకాలు రాశారు. సాంఘిక దురాచారాలకు బలైన నాట్యకళాకారిణుల దుస్థితిని చూసి వారికోసం తపిస్తూ రుద్రగణిక రాశారు. ముఖ్యంగా ముత్తు లక్ష్మీరెడ్డి తీసుకొచ్చిన దేవదాసీ చట్టం వల్ల నృత్యకళకు విఘాతం కలిగిందనే విమర్శకుల మాటలు తోసివేస్తూ అన్ని కులాలవారు ఇప్పుడు నృత్యకళను అభ్యసించే సౌలభ్యం కలిగిందన్నారు. అంబను అమ్మగా కొలి చే మన సనాతన హైందవ ధర్మంలో నృత్యానికి జీవితాన్ని అంకితం చేసిన దేవదాసీల మీద చిన్నచూపు వద్దన్నారు.
చతుర్వేదాల్లాంటి నలుగురు గురువుల వద్ద నృత్యాభ్యాసం చేసి చతుర్వేదసార నాట్యశాస్త్రసారాన్ని సంగ్రహించి, సంక్షిప్తం చేసి నాట్యప్రచారం చేసిన నాట్య నటరాజు ఆశయాలను, సలహాలను, అభివృద్ధిని నేటి నాట్యాచార్యులు అనుసరించి పరిశోధించి భావితరాలకు అందించినపుడే వారికి నిజమైన నివాళులర్పించిన వారమవుతాం.
(నటరాజ రామకృష్ణ శతజయంతి సందర్భంగా..)
-అయినంపూడి శ్రీలక్ష్మి
99899 28562