రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ హిందుత్వ నినాదాన్ని వల్లె వేస్తుంది గానీ.. ఆ పార్టీకి హిందుత్వ పట్ల ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ మాజీ మిత్రుడు, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే కుండబద్దలు కొట్టారు. బీజేపీతో 25 ఏండ్లు పొత్తు పెట్టుకోవటం వల్ల తమకు తీరని నష్టం జరిగిందన్నారు.
బీజేపీకి నామమాత్రపు బలం కూడా లేని రోజుల్లో ఆ పార్టీకి అండగా నిలిచామని, కానీ, ఆ పార్టీ తమను తమ స్వరాష్ట్రంలోనే నాశనం చేయాలని చూసిందని.. అందుకనే తాము ఎదురుతిరిగామని పేర్కొన్నారు. హిందుత్వ మిత్రపక్షం బీజేపీ గురించి ఉద్ధవ్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
‘బీజేపీ వల్లించే హిందుత్వ కేవలం డొల్ల మాత్రమే. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ వేసే కపట వేషధారణ అది. అటువంటి పార్టీతో మేం 25 ఏండ్ల పాటు దోస్తీ చేయటం అనేది దురదృష్టకరమైన విషయం. దానివల్ల శివసేన పాతికేండ్ల అమూల్యమైన సమయాన్ని నష్టపోయింది. రాజకీయం కోసమే బీజేపీ హిందుత్వ గురించి మాట్లాడుతుంది. ఆ పార్టీది వాడుకొని వదిలేసే విధానం. మేం అనేక ఏండ్ల పాటు వారికి అండగా నిలబడ్డాం. కానీ, విజయం సాధించగానే వాళ్లు మాకు ద్రోహం చేశారు. మమ్మల్ని రాజకీయంగా నిర్మూలించాలని చూశారు. మాది అలాంటి పార్టీ కాదు. మేం బీజేపీతో పొత్తును వదులుకున్నామే గానీ హిందుత్వతో కాదు. బీజేపీ హిందుత్వకు ప్రతినిధి కానే కాదు.
దేశంలో బ్రిటీష్ కాలం నాటి బానిసత్వ పరిస్థితులను సృష్టించటం హిందుత్వ కాదు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడటాన్ని ఏ నిజమైన హిందువూ ఆమోదించడు. దానికి వ్యతిరేకంగా పోరాడుతాడు. ఇటువంటి సంక్లిష్ట సమయంలో మేం నోరు మూసుకొని కూర్చుంటే పరిస్థితి మరింత ఘోరంగా తయారై, దేశంలో తిరిగి బానిసత్వం నెలకొంటుంది. ఎమర్జెన్సీని ఎదిరించిన వాళ్లే నేడు మన దేశంలో ఎమర్జెన్సీ వంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
అధికారంలోకి రావటానికి హిందుత్వను శివసేన ఎన్నడూ ఉపయోగించుకోలేదు. కానీ, బీజేపీ ఆ పని చేసింది. ఆ పార్టీ చిన్నస్థాయిలో ఉన్నప్పుడు శివసేనతో పాటు పలు ప్రాంతీయపార్టీలతో పొత్తు పెట్టుకునేది. ఆ కాలంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండేదంటే.. ఎన్నికల్లో పోటీ చేసిన అనేక ప్రాంతాల్లో విజయం మాట అటుంచి, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కేది కాదు. అటువంటి బీజేపీ అధికారం కోసం అవకాశవాద హిందుత్వ రాజకీయాలకు పాల్పడింది. రాజకీయం కోసం హిందుత్వను పక్కనపెట్టింది. కశ్మీర్లో పీడీపీతో బీజేపీ పొత్తు అవకాశవాదం కాక మరేమిటి? సంఘ్ముక్త్ (ఆర్ఎస్ఎస్ విముక్త) భారత్ కావాలని ప్రకటించిన నితీశ్ కుమార్తో పొత్తు పెట్టుకోవటం అవకాశవాదం కాక మరేమిటి?
బీజేపీ ప్రకటించే జాతీయవాద లక్ష్యాలను చూసి ఆ పార్టీకి మేం గతంలో హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చాం. ‘మేం మహారాష్ట్రను చూసుకుంటాం. మీరు యావత్దేశాన్ని చూసుకోండి’ అని బాలాసాహెబ్ (బాల్థాకరే) బీజేపీకి చెప్పారు. అప్పట్లో మా మధ్య ఉన్న అవగాహన అదే. కానీ, వాళ్లు మాకు ద్రోహం చేశారు. మా ఇంట్లోనే (మహారాష్ట్రలోనే) మమ్మల్ని నాశనం చేయాలని కుట్రలు పన్నారు. అందువల్లే, మేం ఎదురుతిరిగి ప్రతిదాడి చేశాం. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా అంటూ అమిత్ షా మాకు సవాల్ విసిరారు. మేం ఆ సవాల్ను స్వీకరిస్తామని కూడా ప్రకటించాం. అయితే, కార్యకర్తల బలం మీద ఆధారపడి పోటీ చేసే ధైర్యం మీకుందా? ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పటం ధైర్యం అనిపించుకోదు’.
– ఉద్ధవ్ ఠాక్రే
(శివసేన వ్యవస్థాపకుడు బాల్ఠాక్రే 96వ జయంతి
సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉద్ధవ్ చేసిన
ప్రసంగంలోని ముఖ్యాంశాలు)