HomeEditpageBjp Party Knows It Cant Win Hence Brought Bc Cm Slogan
బీజేపీతో బీసీలకు ఒరిగిందేమిటి?
తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ర్టాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ లేని బీసీ నినా దం తెలంగాణలో రావడానికి వెనుకాల పెద్ద కుట్ర ఉన్నది. తెలంగాణలో మెజారిటీ జనాభా బీసీలదే. సుమారు 54 శాతంతో బీసీలదే తెలంగాణలో పై చేయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తున్నది. పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. అందులో భాగంగా బీజేపీ కొత్తరాగం ఎత్తుకున్నది. అది తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని. ఆ పార్టీ అగ్ర నాయకుడు అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై తెలంగాణ సమాజం, మేధావి వర్గం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్టంలోనూ బీసీ నాయకున్ని సీఎం చేస్తామని ప్రకటించలేదు. అలాంటిది తెలంగాణలో చేయడమంటే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తప్ప మరొకటి కాదని స్పష్టమవుతున్నది.
తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ర్టాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ లేని బీసీ నినా దం తెలంగాణలో రావడానికి వెనుకాల పెద్ద కుట్ర ఉన్నది. తెలంగాణలో మెజారిటీ జనాభా బీసీలదే. సుమారు 54 శాతంతో బీసీలదే తెలంగాణలో పై చేయి. కాబట్టి , బీసీ వర్గా ల్లో సానుభూతి కోసమే ఈ రాగం ఎత్తుకున్నదని బహిర్గతమవుతున్నది. బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు సరే. బీసీ నాయకులైన బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, రాజాసింగ్లలో ఎవరినో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే సాహసం చేయగలదా? బీజేపీ. మొన్నటికి మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ను పదవినుంచి తొలగించి, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన బీజేపీ బీసీ నేతను సీఎం చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఏదో పండుగ ముందు అలికినట్టు ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితిలో లేదనేది బీజేపీ నాయకులు గుర్తించాలి.
తెలంగాణ రాష్ట్రంలో బీసీలదే అగ్రస్థానం. రాష్ట్రం ఏర్పడక ముందు గత ప్రభుత్వ పాలకుల చేతిలో అత్యధికంగా నలిగిపోయింది బీసీ కులస్థులే. అలాంటిది 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే సకలజనుల సర్వే అని ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని వారి జనాభాకు తగినట్టు పథకాలు రూపొందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. సర్వ సంపదలను సృష్టించే వృత్తి పనులన్నీ బీసీ కులాల చేతుల్లోనే ఉన్నాయి. రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయాల కోసం బీసీలను వాడుకున్నాయి. కానీ వారి అవసరాలను గుర్తించలేదు.
వలస పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ గ్రామీణ వ్యవస్థ చిన్నా భిన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పాలన పగ్గాలు చేతుల్లోకి తీసుకున్నారు ఉద్యమ నేత కేసీఆర్. తెలంగాణ గ్రామీణ వ్యవస్థను, స్వభావాన్ని వృత్తి పనివారలతో సన్నిహిత సంబంధమున్న కేసీఆర్ పాలకుడుగా మెజారిటీ ప్రజల అవసరాలను గుర్తించారు. ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ బీసీ సమాజాన్ని హృదయం నిండా నింపుకున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేయకుండా తెలంగాణ ప్రగతి సాధ్యం కాదని అర్థం చేసుకున్నారు. అందుకే గ్రామంలో ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంతో పాటు కుల వృత్తులను ప్రోత్సహించారు. తద్వారా వారి ఆదాయమార్గాలను పెంచడమే ప్రధాన విషయంగా భావించారు. అందుకే వివిధ వృత్తుల వారు వారి పనులు చేసుకుని బతుకడానికి వీలుగా వసతులు కల్పించడం, పరికరాలను అందించటం చేశారు.
వ్యవసాయాన్ని లాభసాటి చేయటానికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రైతుబంధు, పెట్టుబడి సాయం, పంటల మార్పిడి, గిట్టుబాటు ధర, కోటి ఎకరాలకు నీటి వసతి తదితర కార్యక్రమాలను చేపట్టారు. వ్యవసాయ సంబంధిత పథకాల వల్ల గ్రామ బీసీ ప్రజలంతా లబ్ధిపొందే అవకాశమున్నది.
అంతేకాకుండా గ్రామాల్లో వ్యవసాయం లాభసాటిగా ఉంటే తత్సంబంధిత కూలి పనులు దొరికి ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ఇలా గ్రామ ఆర్థిక వ్యవస్థ, బీసీ వర్గాలు బాగుపడటానికి, మెజారిటీ ప్రజలకు ఆదాయ మార్గాలు లభించడానికి వ్యవసాయం లాభసాటిగా మారడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతున్నది. దీనివల్ల వ్యవసాయం ప్రధాన వృత్తిగల కాపులతో పాటు భూములున్న అన్ని కులాలు లాభపడుతున్నాయి.
అలాగే గొల్ల కుర్మ కులవృత్తి సంబంధమైన గొర్రెలు, మేకలు పెంచుకొని బతుకడానికి లక్షలాది కుటుంబాలకు గొర్రెలు ఇచ్చింది ప్రభుత్వం. క్షీర విప్లవాన్ని ప్రోత్సహించడానికి కులాలకతీతంగా బర్రెలు, ఆవులు కూడా ఉచితం గా పంపిణీ చేసి బతుకు దెరువును చూపుతున్నది. చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ముదిరాజ్, గంగపుత్రులకు ఆసరాగా ఉంటున్నది. చేపల పరిశ్రమను అభివృద్ధి చేసింది. చేనేత వృత్తిని ప్రోత్సహించటం కోసం టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తూ పద్మశాలీలను ఆదుకుంటున్నది. అలాగే గౌడవృత్తి, ఇతర వృత్తులవారికి అండదండగా నిలుస్తున్నది. వృత్తి పనులు చేసుకునే వారంతా దాదాపు బీసీలే. ఇలా అతిముఖ్య ఆదాయవనరులైన వృత్తిపనులను ప్రోత్సహిస్తూ బీసీల ఆదాయ మార్గాలను పెంచే దిశగా ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ మూ చేయని విధంగా తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తున్నది. వృత్తి పనులకు పునరుజ్జీవనం కలిగిస్తున్నది.
కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శా ఖ ఏర్పాటు చేసే సోయి లేని బీజేపీ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే వాదన పస లేనిదని తెలంగాణ ప్రజలు పసిగట్టారు. ఈ బీజేపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరనే సంగతి బీజేపీ గుర్తెరుగాలి.