బెంగళూరును ముంచెత్తిన వరదలు మరోసారి ప్రకృతి ప్రకోపం, నగరాల నిర్వహణ, రాజకీయ నాయకుల పోకడను చర్చనీయాంశం చేస్తున్నది. ప్రకృతి ముందు మానవుడు ఎప్పుడూ అల్పుడే. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత ప్రగతి సాధించినా, ప్రకృతి బీభత్సాన్ని తట్టుకోవడం కష్టం. మనం చేయగలిగిందల్లా వాటి వల్ల కలిగే నష్టాల్ని వీలైనంత తగ్గించుకోవటమే. అసమర్థ నాయకులైతే విపత్తు తెచ్చిన కష్టాలను ప్రకృతి మీదనో, గత పాలకుల మీదనో తోసివేసి చేతులు దులుపుకొంటారు. విజ్ఞత గల పాలకులైతే తక్షణ కర్తవ్యాన్ని గుర్తించి తదనుగుణంగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. బీజేపీ పాలకుల ద్వంద్వ వైఖరి కూడా బెంగళూరు వరదల సందర్భంగా మరోసారి వెల్లడైంది.
రెండేండ్ల కిందట హైదరాబాద్ను భారీవర్షాలు ముంచెత్తాయి. వందేండ్లలో నమోదైన రెండో గరిష్ఠ వర్షపాతం అది. నగరం అతలాకుతలమైంది. నష్టాన్ని తగ్గించటానికి రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. బాధితులకు కనీస సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పించడంతోపాటు కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహాయం అందించకపోగా, బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధికి ప్రయత్నించారు. ఇల్లు కాలిపోతుంటే చలి కాచుకోవడం అంటే ఇదే! ఇప్పుడు బెంగళూరులో వరదలు వస్తే మాత్రం అదంతా గత ప్రభుత్వాల తప్పిదమని ఇతర పార్టీల మీదకు తోసివేస్తున్నారు. బెంగళూరులో బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి ఇతర పార్టీలకు ఇది సరైన సందర్భం. కానీ, మంత్రి కేటీఆర్ ఎంతో సంస్కారవంతంగా స్పందించారు. నీట మునిగిన బెంగళూరుపై నెటిజన్లు ట్రోలింగ్ చేయటం సరికాదని హితవు పలికారు. కేంద్రం ఆర్థికంగా సహకరిస్తే వరద నీటి నిర్వహణ వ్యవస్థను నిర్మించటం పెద్ద విషయమేమీ కాదని మంచి సూచన చేశారు.
దేశ జనాభాలో దాదాపు 35 శాతం మంది నగరాల్లోనే నివసిస్తున్నారు. నగర జనాభా భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. నగరాల నిర్వహణ ప్రాధాన్యాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లోనే ప్రధాని మోదీకి సవివరంగా ఒక నివేదిక ఇచ్చారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని సూచించారు. ఎంతో దూరదృష్టితో కేసీఆర్ చెప్పిన ఈ సలహాను కేంద్రం పట్టించుకోనే లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తే ప్రజలకు ఇక్కట్లు తప్పుతాయి.