‘రాజ్యాంగం ఎంత మంచిదైనా.. దాన్ని అమలు చేసేవాళ్లు మంచివాళ్లు కాకపోతే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసేవాళ్లు మంచి వాళ్లయితే అది మంచి ఫలితాలనిస్తుంది’ అని భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని, ప్రాధాన్యం గురించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నాడే తెలియజేశారు. 60కి పైగా రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశ ప్రజానీకం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారు. ఆయన ఆలోచనలు భారతీయ సమాజంపై, అణగారిన వర్గాలపై, రాజకీయ వ్యవస్థపై నేటికీ ప్రభావం చూపుతున్నట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.
ప్రజాస్వామ్యం పేరుకే కాకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా కొనసాగడానికి మూడు పనులు చేయాలని 1949 నవంబర్ 25న చేసిన తన ప్రసంగంలో అంబేద్కర్ కోరారు. అందులో మొదటిది… మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి చేసే నిరసనలు, ప్రతిఘటనలు రాజ్యాంగబద్ధ పద్ధతుల్లో మాత్రమే ఉండాలని, అరాచకాలకు తావు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. రెండవది… ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతడిముందు మన స్వేచ్ఛను పాదక్రాంతం చేయవద్దని హితవు పలికారు. గుప్పిట్లో అధికారం ఉన్న గొప్ప వ్యక్తిని గుడ్డిగా విశ్వసించడం వల్ల వ్యవస్థలను కూలదోసే అవకాశాన్ని చేజేతులా ఇచ్చినవారమవుతామని హెచ్చరించారు. మూడవది… కుల మత విశ్వాసాలు, ప్రాంతం వంటి అసమానతలను, విభేదాలను అధిగమించేలా.. సామాజిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని అంబేద్కర్ హితబోధ చేశారు. ఇలాంటి ప్రజాస్వామ్య నిర్మాణం ఉంటేనే సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా ఏర్పడిన దేశం వాస్తవరూపం దాలుస్తుందని, అర్థవంతమవుతుందని వివరించారు.
కులం పునాదులపై ఒక జాతిని, ఒక నీతిని నిర్మించలేం. కులరహిత సమాజాన్ని నిర్మించాలనేదే అంబేద్కర్ ఆకాంక్ష. ముఖ్యంగా నిమ్న వర్గాల సంక్షేమం కోసం తన పోరాటం ఫలితంగా రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ను చేర్చారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో కల్పించిన రిజర్వేషన్ల వల్ల ఈ రోజు చాలామంది స్వశక్తితో, ఆత్మగౌరవంతో బతికే పరిస్థితులు కల్పించబడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్, కార్పొరేషన్ల వల్ల నిమ్న వర్గాలకు ఆర్థిక చేయూతనందిస్తూ అన్నివర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పాటుపడే విధంగా చేశారు.
మతం విషయంలో అంబేద్కర్ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు. 1947లో పాకిస్థాన్, హిందుస్థాన్గా విడిపోతున్న సమయంలో పాకిస్థాన్ నుంచి హిందువులు, హిందుస్థాన్ నుంచి ముస్లింలు సురక్షితంగా వెళ్లిన తర్వాతనే దేశ విభజన జరగాలని ఆకాంక్షించారు. లేదంటే రాబోయేకాలంలో విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేశారు. ఇప్పుడు ఆయన మాటలు నిజమవుతున్నాయి. పాకిస్థాన్లో ఉన్న హిందువులపై అనేక దాడులు జరుగుతూ మతమార్పిడుల పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. గత 70 ఏండ్లలో ఇక్కడున్న మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ మైనారిటీ సంతుష్టీకరణ విధానాన్ని అనుసరిస్తూ వారి అభివృద్ధిని ఆపివేస్తూ ఇంకా అంధకారంలోకి నెట్టివేస్తున్నారు అనేక మత కలహాలు జరిగేలా ప్రోత్సహిస్తున్నారు.
దేశ ప్రజాస్వామ్యం గమనాన్ని, పాలనావ్యవస్థలను తీర్చిదిద్దుకునే క్రమంలో రాజ్యాంగస్ఫూర్తిని ప్రతిఫలిస్తూ చేయాల్సిన మార్పుచేర్పులు మరెన్నో ఉన్నాయి. ప్రభుత్వాధికారి వ్యవస్థను జవాబుదారీగా మార్చాలి. చట్టం ముందు అం దరూ సమానమే అనే మాటలను కాగితాల నుం చి వాస్తవంలోకి మార్చాలి. నేర దర్యా ప్తు స్వతంత్రంగా జవాబుదారీతనంతో జరిగేలా చేయాలి. అధికారం జనం ఇంటిముందుకు రావాలి. రాజకీయ సంస్కృతి ఎన్నికల వ్యవస్థలను మార్చుకోవాలి. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రభావశీలంగా మార్చడం, అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వాల ప్రక్రియను కట్టుదిట్టంగా రూపొందించాలి. రాష్ర్టాలకు మరిన్ని అధికారా లు కట్టబెట్టడం ఆదేశిక సూత్రాలకు అగ్రస్థానం వేస్తూ ఉమ్మడి పౌరస్మృతిని సాకారం చేయడం, న్యాయవ్యవస్థకు జవాబుదారీతనాన్ని నప్పే నిబంధనలకు బాటలు వేయడం, అవినీతి కట్టడికి పటుతర వ్యవస్థను రూపొందించడం వంటి క్రియాశీల చర్యలను రాజ్యాంగం ప్రాతిపదికగా అంబేద్కర్ ఆలోచనలకనుగుణంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
అంబేద్కర్ ఆలోచనలు గత 70 ఏండ్ల నుంచి భారత పార్లమెంటు చేసే అనేక చట్టాలు, అనేక సామాజిక ఆర్థికాభివృద్ధి పథకాల్లో అనుసంధానమవుతూ ప్రజా అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. అంబేద్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తు తరాల వారికి కూడా అంబేద్కర్ ఆలోచనలు అందేలా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి కృషితో ముందుకు సాగాలి.
సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయాలను అందిస్తూ, భారతదేశాన్ని ప్రపంచదేశాలు గర్వించే స్థాయికి తీసుకువెళ్లేలా చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకు తగ్గట్టుగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఒక దీక్ష తీసుకొంటూ ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలి.
మతం విషయంలో అంబేద్కర్ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు. 1947 దేశ విభజన పాకిస్థాన్, హిందుస్థాన్గా విడిపోతున్న సమయంలో పాకిస్థాన్ నుంచి హిందువులు, హిందుస్థాన్ నుంచి ముస్లింలు సురక్షితంగా వెళ్లిన తర్వాతనే దేశ విభజన జరగాలని ఆకాంక్షించారు. లేదంటే రాబోయేకాలంలో విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేశారు. ఇప్పుడు అతని మాటలు నిజమవుతున్నాయి.
– ఆర్.భాస్కర్ రెడ్డి
91105 42007