BJP | రాజస్థాన్లో ఇటీవల ఓ రాజకీయ అద్భుతం చోటుచేసుకున్నది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఫొటో తీసినప్పుడు మూడోవరుసలో అనామకునిలా ఉండిపోయిన వ్యక్తి తెల్లారేసరికల్లా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకువచ్చాడు. ఆయనే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్లాల్ శర్మ. బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపికపై చాలామంది ముక్కు మీద వేలేసుకున్నారు. మూడు హిందీ రాష్ర్టాల్లో, అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఘనవిజయం సాధించినప్పటికీ సీఎంల ఎంపిక తాత్సారం కావడం రాజకీయ వర్గాల్లో చర్చాంశమైంది. ఎంత సులభంగా గెలిచిందో, లెజిస్లేచర్ పార్టీల నేతల ఎంపిక అంత కత్తి మీద సాము అయ్యింది బీజేపీ పెద్దలకు. ఇంతలా మల్లగుల్లాలు పడటానికి కారణం ఏమై ఉంటుందా అనే కోణంలో ఊహాగానాలు కూడా జోరుగా సాగాయి. చివరికి సీఎం అభ్యర్థుల పేర్లు ఒకటొకటిగా బయటకు రావడం మొదలుపెట్టాయి. రాజస్థాన్కు శర్మతోపాటుగా మధ్యప్రదేశ్కు మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్కు విష్ణుదేవ్ సాయిని ఎంపిక చేసినట్టు బీజేపీ పెద్దలు వెల్లడించారు. ఇలా పూర్తిగా కొత్తవారిని ఎంపిక చేయడంపై సొంతపార్టీలోనే విస్మయం వ్యక్తమైంది. ఈ ఎంపికలు మారుతున్న బీజేపీ రాజకీయ ఎత్తుగడల స్వరూప స్వభావాలను చెప్పకనే చెప్పాయి.
బీజేపీ సంప్రదాయిక ఎంపికల విధానానికి భిన్నంగా పూర్తిగా కొత్త ముఖాలకే చోటు కల్పించింది. భజన్లాల్ శర్మ విషయంలో మరీ విడ్డూరం. అంతవరకు అసెంబ్లీ ముఖమే ఎరుగని వ్యక్తికి సీఎం పట్టం గట్టారు. ఇలా కొత్తవారిని తెచ్చి సత్తా నిరూపించుకోమని చెప్పి, పాతుకుపోయిన పాతతరం నాయకులను పక్కన పెట్టేశారు. ఎక్కడా ఎవరూ శాశ్వతం కాదనే సందేశం కూడా దీనవెనుక ఉండవచ్చు. కొత్తవారైతే పూర్తి విధేయులుగా ఉంటారు, సీనియర్లతో వచ్చే చిక్కులు ఉండవని మోదీ-షా ద్వయం ఆలోచించినట్టు కనబడుతున్నది. వసుంధరా రాజే సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలను విశ్రాంతి తీసుకోమని చెప్పడం గమనార్హం. దీని ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం ఒకే వేటుతో ప్రాంతీయ సామంతుల బెడదను తప్పించుకున్నది. ఒక్క యూపీ సీఎం యోగి మాత్రమే ఇందుకు మినహాయింపు. తాజా ఎంపికలతో ముగ్గురు ఘనాపాటీల రాజకీయ భవితవ్యంపై నీలినీడలు పరుచుకున్నాయి. రమణ్సింగ్ను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండే స్పీకర్ పదవికి ఎంపిక చేసినప్పటికీ వసుంధర, శివరాజ్లకు ఎలాంటి ప్రత్యేక బాధ్యతలు అప్పగించలేదు. దీంతో వారు రాజకీయాల నుంచి క్రమంగా తెరమరుగుకావడం తప్ప వేరే గత్యంతరం లేదన్న విశ్లేషణలు ముందుకువస్తున్నాయి.
హిందుత్వ రాజకీయాలు కొత్తమలుపు తిరిగినట్టు కనబడుతున్నది. కేవలం మతం పేరిట ఓట్లు రాబట్టడానికి గల పరిమితులను బీజేపీ గుర్తించిందనే చెప్పాలి. అందుకే ఆచితూచి కులాలవారీగా ఎంపికలు జరిపినట్టు భావిస్తున్నారు. బ్రాహ్మణ, ఓబీసీ, గిరిజన సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడం విశ్లేషకుల దృష్టిని ఆకర్షించక పోలేదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆయావర్గాల ఓట్లను ఆకర్షించే ఆలోచనతోనే ఇది జరిగిందనేది తెలుస్తూనే ఉన్నది.