పార్లమెంట్లో ఆమోదం పొందిన ఏపీ పునర్విభజన చట్టం-2014లోని అంశాలు పరిష్కరించకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నది. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు గడిచినా విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నది. విభజన సమస్యలపై ఇప్పటి వరకు 26 సార్లు సమావేశాలు నిర్వహించినా కేంద్రం పరిష్కారం మాత్రం చూపలేదు. అనేకసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఐనా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లయినా విభజన హామీల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలే దు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై సీఎం కేసీఆర్ గళ మెత్తడంతో ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుం డా తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మాత్రం సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నది.కేంద్రానికి అనుకూలంగా లేని రాష్ర్టాల్లో సమస్యలను జటిలం చేస్తూ వాటిని రాజకీయంగా వాడుకొంటున్నది. విభజన చట్టంలోని అంశాలను అడ్డుపెట్టుకొని రెండు తెలుగు రాష్ర్టాల మధ్య వివాదాలకు తెర లేపుతున్నది. రెండు రాష్ర్టాల సమస్యలను పరిష్కరించేందుకు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం వాటిని పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నది. చట్టంలో ఉన్న అంశాలు గాని, చట్ట ప్రకారం తెలంగాణకు రావలసిన సంస్థలు గానీ ఏర్పాటు చేయకుండా కేంద్రం నిద్ర నటిస్తున్నది.
రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టంలోని అంశాలను కేవలం పదేండ్లలో పూర్తి చేయాల్సి ఉన్నది. అయినా ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు. సమస్యల పరిష్కారం విషయంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు కేంద్రం ప్రదర్శిస్తున్న తీరు ఆక్షేపనీయం. పునర్విభజన చట్టం-2014 షెడ్యూల్ 9 లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లతో పాటు 91 సంస్థలను, అదేవిధంగా షెడ్యూల్ 10 లోని ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్తో పాటు 142 సంస్థల్లోని ఆస్తులు, ఇతర లావాదేవీలను 48:52 ప్రకారం విభజించాల్సి ఉన్నది. కానీ కేంద్రం తేల్చకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నది. షెడ్యూల్ 12 లో అప్మేల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ ఇంజనీరింగ్ కంపెనీ) కంపెనీని చేర్చారు. ఆ కంపెనీని 1994లో సింగరేణి కాలరీస్ సంస్థ దత్తత తీసుకొని లాభాల బాటలో నడిపించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కంపెనీలో తమకు వాటా ఇవ్వాలని అడగటం, కేంద్రం వత్తాసు పలకటం విడ్డూరం.
13వ షెడ్యూల్లో తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, ఉక్కు ఫ్యాక్టరీని, గిరిజన యూనివర్సిటీని నిర్మించాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. ఇవి అమలులోకి వస్తే ఉపాధి రంగంలో మార్పులు వస్తాయని ప్రజలు భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. రాష్ర్టాల మధ్య నీటి వాటాల పంపకం చేయలేదు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా ఇంతవరకు తేల్చలేదు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కేసును ఉపసంహరించుకొంటే వాటా తేలుస్తామని కేంద్రం గతంలో నమ్మబలికింది. కేసును ఉపసంహరించుకొని ఏడాది దాటినా వాటా తేల్చకపోవటం శోచనీయం. ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి, తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ( కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి) ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. కానీ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం మొండి చేయి చూపింది. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నవోదయ పాఠశాలలు ఇవ్వకపోగా తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్ ను రద్దు చేశారు. గడిచిన ఎనిమిదేండ్లలో ఒక్క వైద్య కళాశాలను గాని, ఐఐఎం లాంటి విద్య సంస్థలను గానీ కేటాయించలేదు.
కేంద్రం బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్, కర్ణాటక, రాష్ర్టాలకు అనేక సంస్థలను కేటాయిస్తూ, బీజేపేతర రాష్ర్టాల పట్ల పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి న్యాయబద్ధంగా రావలసిన నిధులు ఇవ్వకుండా వివక్ష ప్రదర్శిస్తున్నది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల కోసం తెలంగాణకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినప్పటికీ ఒక్క రూపాయి కేంద్రం ఇవ్వకపోవడం శోచనీయం. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణ ఉద్యోగులు ఇంకా అనేకమంది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. వారి గోస కేంద్రానికి వినపడటం లేదు. అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచుతామన్న హామీ అమలు కాలేదు. విద్యుత్ బకాయిల విషయం తేలలేదు. బీజేపీకి అనుకూలంగా ఉంటేనే పనులు చేస్తామన్న ధోరణిలో కేంద్రం పనిచేస్తున్నది. సమాఖ్యదేశంలో బీజేపీ సర్కార్ రాష్ర్టాల అభివృద్ధిని పక్కనపెట్టి స్వలాభాపేక్షతో వ్యవహరించడం బాధాకరం. విభజన చట్టానికి లోబడి తీసుకొనే అన్ని నిర్ణయాలకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అయినా ఆంధ్రప్రదేశ్ అనేక విషయాలలో పేచి పెడుతూ సమస్యలను జటిలం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ రాష్ర్టాల మధ్య వైరానికి ఆజ్యం పోస్తున్నది. ఇప్పటికైనా కేంద్రం కక్షతో కూడిన వివక్షను విడనాడాలి. కేంద్రం విభజన చట్టంలోని అన్ని అంశాలను పరిష్కరిస్తుందని యావత్ తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నది. అదే జరగని సమయంలో మరో ఉద్యమానికి కూడా యావత్ తెలంగాణ సిద్ధమవుతున్నది.
( వ్యాసకర్త : జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, లింగాల ఘనపూర్)
గుడి వంశీధర్ రెడ్డి
90594 44444