దేశాభివృద్ధిలో వ్యవసాయం, విద్య, వైద్యరంగాలు కీలకమైనవి. ఈ రంగాల అభివృద్ధితోనే ప్రజల జీవన, ఆర్థికస్థితిగతులు మెరుగుపడుతాయి. ఈ మూడు రంగాలు ముందుకుసాగాలంటే సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలుకావాలి. అందుకోసమే సీఎం కేసీఆర్ బహుళ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్ వంటి వారి ఆశయాలే అజెండాగా విద్యారంగానికి సంబంధించి దేశంలో ఎక్కడాలేని పథకాలకు రూపకల్పన చేశారు.
రాష్ట్రం ప్రగతిబాటలో ముందుకు సాగాలంటే పేద పిల్లలకు మెరుగైన విద్య అవసరమని భావించిన కేసీఆర్ ప్రత్యేక గురుకులాలను ప్రోత్సహించారు. రాష్ట్రంలో 298 ఉన్న గురుకులాల సంఖ్యను 663కు పెంచారు. వీటితోపాటు 53 గురుకుల డిగ్రీ కాలేజీలను నెలకొల్పి వయోజన విద్యను ప్రోత్సహించడానికి కృషిచేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరుగా గురుకులాలను ఏర్పాటుచేసి విద్య ప్రతి ఒక్కరి హక్కుగా అమలుచేస్తున్నారు. గతంలో 14కే పరిమితమైన మైనారిటీ గురుకులాలను 206కు పెంచారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీ పాఠశాలలను కలిపి మొత్తం రాష్ట్రంలో 1,725 గురుకులాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు విదేశీ విద్యనభ్యసించడానికి అవకాశం కల్పించాలని, వారికోసం ప్రత్యేకంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం కొత్తగా 11 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటుచేసింది. విద్యార్థులకు సన్నబియ్యం, ఉపకారవేతనాలు, బాలికలకు ప్రత్యేక కిట్లు, ఉచిత దుస్తుల పంపిణీ వంటి వసతి సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తున్నది.
విద్యారంగంతోపాటు సంక్షేమరంగాన్ని కూడా వేగంగా ముందుకు నడిపించడంలో సీఎం కేసీఆర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలితాలు అందాలన్న దృఢసంకల్పంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల కోసం ఆత్మగౌరవ భవనాల పేరిట ప్రత్యేక భవనాలను నిర్మిస్తున్నారు. వీటిద్వారా ఆయా వర్గాల్లో సామాజిక, రాజకీయ స్వావలంబన సాధించవచ్చని సీఎం కేసీఆర్, 10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో 36 సంచార కులాలకు కలిపి ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారు.
గొల్ల కురుమలకు ఉచిత గొర్రెపిల్లల పంపిణీ, ముదిరాజులు, గంగపుత్రులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, గౌడలకు నీరా పథకం, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, రజకులకు ఇస్త్రీపెట్టెల పంపిణీ వంటి అనేక పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. వెనుకబడిన బీసీకులాల కోసం ప్రత్యేకంగా ఎంబీసీ శాఖను ఏర్పర్చడమే కాకుండా, రూ.1000 కోట్ల బడ్జెట్ను కేటాయించి ఆయా వర్గాలకు సీఎం కేసీఆర్ బాసటగా నిలిచారు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పథకాలకు రూపకల్పన చేశారు. కులాలు, మతాలకు సంబంధం లేకుండా అందరికీ వర్తించేలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకువచ్చారు.
సంక్షేమ పథకాలను రూపొందించడం ఒక ఎత్తయితే, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం ప్రభుత్వాలకు ఒక సవాల్. ప్రతి పథకం- ప్రతి ఇంటికి, ప్రతి లబ్ధిదారుడికి చేరాలనే సీఎం కేసీఆర్ లక్ష్యంతో తెలంగాణలో ప్రభుత్వ పథకాలు సంపూర్ణంగా అమలవుతున్నాయి. జాతీయ, సామాజిక ఉద్యమకారుల నినాదాలను ఎన్నికల అస్ర్తాలుగా వాడుకున్న నేతలున్న ఈ కాలంలో మహాత్మా జ్యోతిబాపూలే, అంబేద్కర్లు కలలుగన్న అభివృద్ధి ఆశయాలకు సీఎం కేసీఆర్ బాటలు వేశారు. సీఎం కేసీఆర్ రూపకల్పనలో తీసుకువచ్చిన పథకాలన్నీ ప్రభుత్వాలకు, భవిష్యత్ తరాలకు దిక్సూచి కానున్నాయి.
కిషోర్గౌడ్(జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని)