శ్రమ దోపిడి విధానానికి, కట్టు బానిసత్వానికి ఉదాహరణగా ఉన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో గత 20 ఏండ్లుగా నెలకొని ఉన్నది. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా అనేకరకాల ఇబ్బందులతో బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఉద్యోగంలో సంతృప్తి లేదు, అలాగని ఉద్యోగం మానేసే పరిస్థితి లేదు. అనేకరకాల బాధలను కడుపులో దాచుకుంటూ కాలం వెళ్ళదీసే దుస్థితి. టీడీపీ ప్రభుత్వం 20 ఏండ్ల కిందట కాంట్రాక్ట్ వ్యవస్థకు ఆయువు పోసింది. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు. అనేక సందర్భాల్లో మంత్రులకు, నాయకులకు ఎంత విన్నవించినా ఫలితం లేకుండేది. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు లేదు. ఉద్యోగం పర్మినెంట్ చేస్తామనే మోసపూరితమైన హామీలతో కాలం వెళ్లదీశారు తప్ప ఏ ఒక్కరూ న్యాయం చేయలేదు.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా వచ్చింది. ఈ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదం కూడా ప్రధానాంశమైంది. సబ్బండ వర్ణాల వారు భాగస్వాములయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు సకల జనుల సమ్మెలో భాగస్వాములయ్యారు. అయితే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో భాగస్వాములు కావడం సాధారణ విషయం కాదు. అయినా ఉద్యోగాన్ని సైతం లెక్కచేయకుండా సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఘనత కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులది.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం సాహసోపేతమైంది. టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2016న యాక్టివ్ 94 చట్టాన్ని అడాప్ట్ చేసుకోవడంలో కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమైంది. అప్పటివరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటే ఒక కలగా మిగిలింది. కానీ కేసీఆర్ నిర్ణయం మూలంగా ఈ చిరుద్యోగుల్లో ఆశలు మొలకెత్తాయి. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో 16 శాఖల వారీగా ఉన్నటువంటి 25 వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ 16 జీవో ఇచ్చారు.
కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై విషం చిమ్ముతూ కొంతమంది రాజకీయపార్టీల ప్రోద్బలంతో కోర్టును ఆశ్రయించారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను న్యాయపరమైనటువంటి వివాదాలతో అడ్డుకోవడం ప్రతిపక్షాల దుర్మార్గానికి పరాకాష్ఠ. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డుకట్ట పడింది. అయినా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఈ చిరుద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వారిని ఏ విధంగానైనా ఆదుకోవాలని నిర్ణయించారు. వారికి భారీ మొత్తంలో వేతనాలు పెంచడమే కాకుండా ఇతర సౌకర్యాలు కల్పించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మూలంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎంతో ఊరట కలిగింది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. తొలి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినటువంటి ఈ అంశాన్ని కచ్చితంగా అమలుచేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నది. సీఎం కేసీఆర్ నాటి నుంచి నేటివరకు కాంట్రాక్ట్ ఉద్యోగులపైనే కాకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా పలురకాలుగా ఆదుకున్నారు. ప్రాథమిక విద్యారంగంలో విద్యా వలంటీర్ల 12 నెల్ల జీతాలు, సెర్ప్ ఉద్యోగులు, ఐకేపీ, అంగన్వాడీ, ఆశా వర్కర్ల, గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచారు. ఇతర సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉపశమనాన్ని కలిగించింది.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు శాసనసభ సాక్షిగా చేసిన ప్రకటన ఈ చిరుద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. కాలానుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల జీవితాన్ని వెళ్లదీయడం ఎట్లా అని దిగులు పడుతున్న చిరుద్యోగులను కేసీఆర్ దయా హృదయంతో ఆదుకున్నారు. ఇటువంటి ఉద్యోగ అనుకూల నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్కే సాధ్యం.
కరోనా విస్తరించడం వల్ల ఏడాది కాలంగా అన్ని దేశాలు ఆర్థికంగా అతలాకుతలమయ్యాయి. మన దేశంలో కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో కూడా ఆర్థిక పరిస్థితులు చక్కగా లేవు. అయినా ముఖ్యమంత్రి ఎంతో సమర్థతతో ఆర్థికవ్యవస్థను నడుపుతున్నారు. రైతులకు, ఉద్యోగులకు, భిన్నవ ర్గాల ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవడానికి కొన్ని వందల కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతున్నదని తెలిసినా వెనకడుగు వేయకుండా100-150 శాతం జీతాలు పెరిగేవిధంగా నిర్ణ యం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని యావత్ కాం ట్రాక్ట్- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు అం డగా కేసీఆర్ ఉన్నారనే భరోసా కలిగింది.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణను వర్తింపజేయడం దేశ చరిత్రలోనే అపూర్వం. ఇది ఏ రాష్ట్రం తీసుకోనటువంటి సాహసోపేత నిర్ణయం. ప్రజల బాధలను అర్థం చేసుకోగలిగే కేసీఆర్ లాం టి నాయకులు మాత్రమే ఇలాంటి నిర్ణయాలను తీసుకోగలరు. కాంట్రా క్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణలో ఇస్తున్న వేతనాలను దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని ఈ చిరుద్యోగులు చెప్పుకొంటారు. ఈ విధంగా దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఆద ర్శ, సంక్షేమదాయక ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతున్నారు.
( వ్యాసకర్త: గాదె వెంకన్న, రాష్ట్ర అధ్యక్షులు, ఆర్జేడీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం)
ముఖ్యమంత్రి కేసీఆర్లో బడగు, బలహీన వర్గాలను ఆదుకోవాలనే మానవీయ కోణం ఉన్నది. చిరుద్యోగుల వేతనాలు పెంచాలనే నిర్ణయం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకున్నది కాదు. గతేడాది జీహెచ్ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికుల జీతాలను పెంచారు. ఆశావర్కర్ల వేతనాలను కూడా వారు ఊహించినదానికంటే ఎక్కువగానే పెంచారు. అంగన్వాడీ ఉద్యోగులను గత ప్రభుత్వాలు వారిని గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్ వారిని గుర్రమెక్కించారు.