ఉద్యమ సమయంలో కేసీఆర్ను కలిసినప్పుడు చేనేత రంగంపై వారు మాకు చెప్పిన విజన్ నేడు అమలవుతున్నది. చేనేత రంగం, చేనేత కళాకారుల జీవనవిధానంపై కేసీఆర్కు సంపూర్ణ అవగాహన ఉంది. అధికారాన్ని అనుభవించినపుడు కేసీఆర్ను పొగిడినవారు ఈ మధ్య పదవులకు దూరం కాగానే నిస్సిగ్గుగా విమర్శిస్తున్నారు. కానీ చేనేతరంగంపై ఇంతటి శ్రద్ధ పెట్టిన ముఖ్యమంత్రి, చేనేత మంత్రి దేశమంతా వెతికినా కనపడరు. ఏ రాష్ట్రంలోనూ చేనేతరంగానికి ఇన్ని సంక్షేమ పథకాలు లేవు. 38 లక్షల చేనేత మగ్గాలున్న దేశంలో ఈ రంగానికి కేంద్రం రూ.400 కోట్లు కేటాయిస్తే 18 వేల చేనేత మగ్గాలున్న తెలంగాణ రాష్ట్రంలో రూ.1200 కోట్లు కేటాయించడం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం.
‘నేతన్నకు చేయూత పథకం’ చేనేత కళాకారుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. బ్యాంకులు పిలిచి రుణ సౌకర్యం కల్పిస్తున్నాయి. మొదటి విడుత త్రిఫ్ట్ ఫండ్ పొందిన చాలామంది చేనేత కళాకారులు కూలీ నుంచి సొంత మగ్గందారునిగా మారారు. కూలీని యజమానిని చేసిన ఘనత కేసీఆర్ది. నూలుపై 40 శాతం సబ్సిడీ దేశంలో ఎక్కడా లేదు. చేనేత మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో చేనేత మిత్ర పథకం చేనేత కళాకారులకు చేరేవిధంగా అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఈ పథకం వల్ల పట్టు నేసే చేనేత కళాకారునికి గరిష్ఠంగా నెలకు ఐదువేలు, కాటన్ మగ్గం నేసే కళాకారునికి మూడు వేలు వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలైతే రాష్ట్రంలో సుమారు 60 వేల మంది చేనేత కళాకారులకు లబ్ధి చేకూరుతుంది. త్రిఫ్ట్ ఫండ్ పథకం వల్ల ప్రతి చేనేత కళాకారునికి నెలకు 1500 నుంచి 2400 వరకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం ద్వారా కనీసంగా లక్ష మంది చేనేత కళాకారులకు లబ్ధి చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. వీటికి తోడు 70 శాతం చేనేత కుటుంబాలకు ఆసరా పింఛన్లు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న చేనేత కుటుంబాలకు నెలకు రూ.8 నుంచి 10 వేల ఆర్థిక సహాయం అందుతుంది.
నేతన్న బీమా పథకాన్ని తెస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సిరిసిల్ల పర్యటనలో ప్రకటించారు. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా పథకాన్ని తేవడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ రెండు బీమా పథకాలతో చేనేత కుటుంబాలకు కొండంత అండ దొరుకుతుంది. చేనేతరంగానికి చేయవలసింది ఇంకా ఉందని, చేనేత సామాజికవర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని ఇటీవల ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరుతున్నప్పుడు చెప్పారు. అందుకు అనుగుణంగానే నిధుల విడుదల, కొత్త కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతున్నది. ఒకప్పుడు చేనేత సహకార సంఘ సభ్యులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందేవి. ఇప్పుడు దాదా పు 70 శాతం సహకారేతర రంగంలో ఉన్న ప్రతి చేనేత కళాకారుడిని జియో ట్యాగ్ విధానం ద్వారా గుర్తించి పథకాలను అందిస్తున్నారు. ప్రతిభావంతులైన చేనేత కళాకారులను కేటీఆర్ ప్రోత్సహించడంతో ఈ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. పీతాంబరి చీరను పునరుత్పత్తి చేయడం, విశ్వ ప్రసిద్ధ హిమ్రు చేనేత ఉత్పత్తిని ప్రారంభించడం, ప్రాచీన సహజ రంగుల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం వంటివి తెలంగాణ చేనేత రంగానికి మంచి రోజులు వచ్చాయనడానికి సంకేతాలు.
–యర్రమాద వెంకన్న నేత ,7382557788