దేశవ్యాప్తంగా కులాలవారీ జనగణన జరపాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం సామాజిక పరివర్తన కోరుకునే వారు స్వాగతించే పరిణామం. తగిన వివరాలు లేకుండా ఏ వర్గాన్నయినా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎలా రచిస్తారంటూ కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్న ఆలోచింపదగినది. కచ్చితమైన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికా రచన, విధాన నిర్ణయాలు జరగాలనేది ప్రాథమిక అవగాహన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించి, ప్రజల మొత్తం వివరాలను ఒకే ఒక్క రోజులో సేకరించారు. ఆనాడు ప్రధాని మోదీ ఈ సర్వేపై ఆసక్తి చూపి ముఖ్యమంత్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే సందర్భంగా ప్రతిపక్షాలు ఏదో కొంపలు మునిగినట్టు గగ్గోలు పెట్టాయి. కానీ ముఖ్యమంత్రి మాత్రం వివరాలను చేతబూని, తెలంగాణ సమగ్రాభివృద్ధికి వ్యూహ రచన గావించి, క్రమపద్ధతిలో అమలు చేస్తున్నారు.
వెనుకబడిన వర్గాల వివరాల సేకరణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ముందు కేంద్రప్రభుత్వం తన అశక్తతను వ్యక్తం చేయడం గమనార్హం. 2011 నాటి జనగణన సందర్భంగా సేకరించిన వెనుకబడిన వర్గాల వివరాలు తప్పుల తడకగా ఉన్నాయనీ, ఈ నేప థ్యంలో ఇకముందు ఈ డాటాను సేకరించలేమనీ కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. దీనిని బట్టి తెలంగాణ ప్రభుత్వ సమర్థత, చిత్తశుద్ధి ఎంతటిదో తెలుస్తున్నది. బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు మన దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. పరా యి పాలకుల స్థాయిలో కూడా మనం వివరాలు సేకరించుకోలేమా? ఇప్పటికీ అవే లెక్కలపై ఉజ్జాయింపుగా ఆధారపడతామని అనడం ఆశ్చర్యకరం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ కీలకమైన అంశంపై ఎన్నికల ముందు ఒకతీరు, తరువాత మరోతీరు మాట మార్చడం మంచి పద్ధతి కాదు.
కొందరు చెబుతున్నట్టుగా కులాల వివరాలు సేకరిస్తే వైషమ్యాలు పెరుగుతాయనేది అర్థం లేని వాదన. సామాజిక అంతరాలు తొలగించి, సామరస్యం సాధించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడే వైషమ్యాలు, ఘర్షణలు చోటుచేసుకుంటాయి. అంతేగానీ గణాంకాలు సేకరించడం వల్ల కాదు. జనగణన అంటే అడవిలో జంతువులను లెక్కించినట్టు కాదు. ప్రజల సమగ్ర వివరాలు విధానకర్తలకు, సామాజిక పరిశోధకులకు ఉపయోగపడాలి. ఏయే ప్రాంతాలలో, ఏయే వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలువకుండా ప్రణాళికలను రూపొందించడం చీకటిలో బాణం వేసినట్టుగా ఉంటుంది. సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్న మన సమాజంలో గణాంకాలకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. కేంద్రం ఇప్పటికైనా కులాలవారీ జనగణన అవసరాన్ని గుర్తించాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.