రెండో ‘అరికేసరి’కే కాక అతని కొడుకు రెండో బద్దెనకు ఇంకా అతని కొడుకు మూడో అరికేసరికి సామదేవసూరి విద్యాగురువుగా ఉన్నాడు. రెండో బద్దెన (భద్రన) పండితుడు. కవి. నీతి శాస్త్రముక్తావళి, సుమతీ శతకం గ్రంథాలను రచించాడు. నీతిశాస్త్ర ముక్తావళి (తెలుగు) అనేది సామదేవసూరి నీతికావ్యానికి అనువాదం కావచ్చును. సుమతీ శతకం కంద పద్యాలలో రాయబడిన నీతి శతకం. తెలుగులో శతక ప్రక్రియలలో వచ్చిన మొట్టమొదటి శతకం ఇది. మనకు పంపకవి సోదరుడు జినవల్లభుడి కుర్క్యాల శాసనంలో మొట్టమొదటి కంద పద్యాలు కనిపించాయి. ఆ కంద పద్యాలను ఆదరించాడు బద్దెన. సుమతి శతకంలో వంద పద్యాలున్నాయి. ఎటువంటి సమాసాలు లేకుండా చక్కని దేశీయ భాషలో సరళసుందరంగా రచించబడిన శతకం.
ఉదాహరణకు..
‘వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ’
‘ఉపకారికి నుపకారము
విపరీతము గాదుసేయ వివరింపంగా
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’
సులభంగా అర్థమయ్యే రీతిలో సరళమైన శైలిలో బద్దెన ఈ శతకం రచించాడు. ప్రతి పద్యం చివర ‘సుమతీ’ అనే మకుటం ఉన్నది. ఇప్పటికీ ఈ పద్యాలు తెలుగువాళ్ల నోళ్లపై ఆడుతున్నాయి. తెలుగులో దేశీయమైన, ప్రియమైన ఛందస్సు కందం. అటువంటి కందం వేములవాడ చాళుక్యుల కాలంలో అధిక ప్రాచుర్యాన్ని పొందింది. జినవల్లభుడి కుర్క్యాల శాసనంలో కంద పద్యాలున్నాయి. బద్దెన ‘నీతి శాస్త్ర ముక్తావళి’లో కూడా కందపద్యాలు ప్రాధాన్యం వహించాయి. ఆ తర్వాత వేములవాడ భీమకవి రచించిన ‘కవి జనాశ్రయం’ ఛందోగ్రంథంగా కూడా కంద పద్యాలనే ప్రయోగించాడు. తిక్కనసోమయాజి ‘మహాభారతం’లో కంద పద్యాలు విరివిగా కనిపిస్తాయి. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని ఆస్థానానికి వచ్చినప్పుడు తెలంగాణలో విరివిగా ఉన్న ‘కందం’ ఛందస్సు అతడిని ఆకర్షించి ఉంటుంది. అందుకే అతని మొదటి కావ్యం ‘నిర్వచనోత్తర రామాయణం’లో కందం ఛందస్సు లేకున్నా మహాభారతంలో ‘కందం’ విరివిగా చోటుచేసుకున్నది. తెలంగాణలోని కవుల కందపద్యం చేత ప్రభావితుడైన తిక్కనగాక మరేకవీ కందాన్ని ఇంతగా అభిమానించలేదు.
వేములవాడ చాళుక్యుల కాలంలో నివసించిన మరో తెలుగు కవి వేములవాడ భీమన. ఈయన ‘కవిజనాశ్రయం’ అనే ఛందోగ్రంథాన్ని తెలుగు ఛందస్సులకు లక్షణ గ్రంథంగా రచించాడు. ఇది ‘భీమన ఛందం’ పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ కవి రెండో అరికేసరి కాలంలోనో, రెండో బద్దెన కాలంలోనో.. క్రీ.శ. 950 ప్రాంతంలో నివసించి ఉంటాడు. భీమకవి భీమేశ్వరుని అనుగ్రహంతో జన్మించి ఉంటాడని ఐతిహ్యం. దాన్నిబట్టి పరిశోధనారంభంలో పరిశోధకులు భీమకవి ద్రాక్షారామం భీమేశ్వరుడి అనుగ్రహంతో జన్మించాడని అన్నారు. వేములవాడలో రెండో అరికేసరి తండ్రి మొదటి బద్దెన (క్రి.శ. 850-895) భీమేశ్వరాలయంను నిర్మించాడు. ఆ భీమేశ్వరుడు ఇప్పటికీ పూజలందుకుంటున్నాడు. వేములవాడలో కూడా ప్రసిద్ధ భీమేశ్వరాలయం ఉందనే విషయం తెలియని పరిశోధక పండితులు ద్రాక్షారామ భీమేశ్వరుడి అనుగ్రహంతో జన్మించాడని చెప్పారు. వేములవాడకు ఇప్పటికీ లేములవాడ, లేంబులవాడ అని ప్రజల నోళ్లలో ప్రచారం ఉంది. కొన్ని చాటుపద్యాలలో ఇప్పటికీ వేములవాడకు బదులు లేములవాడ, లేంబులవాడ అని ఉన్నది. కాబట్టి భీమన వేములవాడ/ లేంబులవాడలో జన్మించాడని చెప్పవచ్చు. ‘కవిజనాశ్రయం’ ఎంత ప్రసిద్ధమైన గ్రంథం అంటే.. వందల ఏండ్లు గడిచినా అది కాలగర్భంలో కలిసిపోలేదు. ‘అప్పకవీయం’ వచ్చేంతవరకు ఒక అధికారికమైన ఛందోగ్రంథంగా నిలబడింది.
కవిజనాశ్రయాన్ని వేములవాడ భీమకవి గాక, మల్లియరేచన రచించాడని పరిశోధకులు కొందరు విశ్వసిస్తున్నారు. కానీ మల్లియరేచన కవిజనులకు ఆశ్రయం ఇచ్చేవాడు. ఈ కృతికి కృతిభర్త మాత్రమే. నిజానికి ఈ కృతిని భీమన రేచనకు అంకితమీయకుండా రాజరాజ నరేంద్రున్ని సంబోధిస్తూ రచించాడే కానీ అంకితంగా ఇవ్వలేదు.
కన్నడంలో కన్నడఛందస్సు ‘కవి రాజమార్గము’ పేరుతో ఛందోగ్రంథాన్ని రాష్ట్ర కూట రాజు ‘నృపతుంగుడు’ దాదాపు కీ.శ. 950 ప్రాంతంలోనే రచించాడు. ఆ రచన ప్రేరణతోనే భీమన కవిజనాశ్రయం అనే ఛందోగ్రంథాన్ని రచించాడేమో. భీమకవిని ప్రాచీన కవులు చాలామంది ప్రశంసించారు. ‘కవిజనాశ్రయం’ కర్తగా చెప్పారు. శ్రీనాథుడు ‘వచియింతు వేములవాడ భీమన భంగి శుద్దండలీల నొక్కొక్కమాట’ అని నన్నయకన్నా ముందే భీమనను ప్రశంసించాడు. దీన్నిబట్టి నన్నయ కన్నా పూర్వమున్న కవి భీమన అని తెలుస్తుంది. కొరవి గోపరాజు, మొల్ల, కాకునూరి అప్పకవి, పింగళి సూరన, చిత్రకవి పెద్దన, వార్తా కవి రాఘవయ్య, కూచిమంచి తిమ్మకవి మొదలైన కవులెందరో భీమనను ప్రస్తుతించారు. ‘కస్తూరి రంగ కవి’ (క్రీ.శ. 1750) ఆదిమ కవి- భీమన రేచన మీద అంకితంగా చెప్పినాడు’ అని భీమనను ఆదికవిగా ప్రశంసించాడు. ఓరుగంటి రామకవి (క్రీ.శ.1710)’ ‘భీమేశ్వర లబ్ధ కవితా వాచా సిద్ధి గల వేములవాడ భీమనార్యుడొనరించిన జనాశ్రయం అను ఛందం బు’ అని తన కవితా లక్షణ సారంలో కవిజనాశ్రయ కర్తగా భీమనను కీర్తించాడు.
ఆధునిక కాలంలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు (కాకినాడ) వారు కవి జనాశ్రయాన్ని 1917లో మొదటిసారి ప్రచురిస్తూ దాని పరిష్కర్తలైన జయంతి రామయ్య పంతులు గారు కవిజనాశ్రయము రాసింది వేములవాడ భీమకవి అని చెప్తూ భీమన్న తెలంగాణలోని వేములవాడ నివాసి అని అంగీకరించారు.
మానవల్లి రామకృష్ణ కవి కవిజనాశ్రయాన్ని అచ్చు వేస్తూ భీమకవి రచించాడనే విషయం అంగీకరించి, నిడదవోలు వెంకట్రావుగారి కవిజనాశ్రయానికి 1951లో ముందుమాట రాస్తూ వేములవాడ భీమకవి రచనయే ‘కవిజనాశ్రయం’ అని చెప్పాడు. ఇలా ఎంతోమంది కవిజనాశ్రయం భీమన కృతిగానే అంగీకరించారు. కానీ మధ్యకాలంలోనే కవిజనాశ్రయంలో మార్పులు, చేర్పులు చేసి ఆశ్రయదాత అయిన మల్లియరేచన దాని కర్తగా వక్రీకరించారు. శైవుడైన వేములవాడ భీమకవి జైన సంప్రదాయంగా రచించిన కవిజనాశ్రయము అతని రచన కాదని చెప్పటం సమంజసం కాదు. శైవులు ఎంతోమంది జైనాన్ని ఆదరించారు.
– ముదిగంటి సుజాతారెడ్డి , 99634 31606