‘మాట బలి కోరుతుంది’ అన్నది ఒక సామెత. ‘మాట అగ్ని లాంటిది. అది ముతక ధాన్యాన్ని వండి ఆహారంగా మార్చగలదు. అదుపుతప్పితే దహించి వేయనూ గలదు’ అనేది ఒక సంస్కృత శ్లోక సారాంశం. ‘నోరా వీపుకు తేకే’ అన్నది పల్లెటూరి పలుకుబడి. మాట్లాడేటప్పుడు నాలుక మన అదుపులో ఉండాలనేది వీటన్నిటి సారాంశం. పెదవి దాటితే పృథివి దాటుతుందని నోరు కట్టేసుకొని కూర్చోవలసిన అవసరం లేదు. మనుషులు అందరూ స్వేచ్ఛగా మాట్లాడాలి.
మాట్లాడాలి. అందరూ మాట్లాడాలి. అందరికోసం మాట్లాడాలి. మాటలంటే ఏదో ఊసుపోక మాట్లాడుకునేయి కావు. మాటలంటే ప్రాణాలు. మాటలంటే జీవన గమనాలు. మాటలంటే సమాజాలను నడిపించే దారులు. మాటలంటే అందర్నీ ఏకం చేసే మహా సాధనాలు. మాటలంటే బరాబర్ చేతలే. మాటలంటే నీ కోసమో, నా కోసమో మాత్రమే కాదు, అవి ఆ కాలాన్ని నడిపించే ఆయువులు. మాటలంటే బుడిబుడి నడకల నుంచి నేర్చుకున్న మన సంస్కృతికి ఆనవాళ్లు. అందుకే వాగ్భూషణం అన్నది. వ్యక్తుల, సమాజాల, సమూహాల సంస్కారాలకు సంబంధించింది మాట.
సర్వశక్తులకు సర్వ శాస్ర్తాలకు సకల చరాచర సృష్టికి ఓంకార బీజం మాట. ప్రకృతిలోని కోటానుకోట్ల జీవరాసులకు లేని ఒక్క మనిషికి మాత్రమే లభించిన మహాత్తర భాగ్యం మాట. అందుకే మనిషి సంఘజీవి అయ్యాడు. సాంఘిక జీవిగా మనిషి నడుస్తున్న నడతకు, అడుగుకు, ప్రతి కదలికకు, ప్రతి మలుపునకు, ప్రతి ఆలోచనకు, పురోగమనానికి, పురోభివృద్ధికి మూలం మాట. ఏదైనా చేసుకుంటూ దేన్నయినా ఆలోచించుకుంటూ, తర్జనభర్జనలు చేసుకుంటూ, మనలో మనం పడే సంఘర్షణల మహా సమరాలు, అంతర్గతంగా లోపల జరిగే ప్రతి రసాయనిక చర్యకు ప్రతిరూపం మాట. మాటల సమూహమంతా కలిస్తే అది మహా సముద్రం లాంటిది. ఆకాశాన్ని, నేలను, మట్టిని, నీటిని, నేలపైన ఉన్న మనం చూస్తున్న ప్రతి దృశ్యం, ప్రతి పని, కదలికల రూపాలన్నీ మనిషి తయారుచేసుకున్న మాటలే. మాటంటే ఊరికే ఎటుపడితే అటు అడ్డగోలుగా విసిరిపారేసేది కాదు. మాటంటే నిత్య జీవనసమర యుద్ధం. మాటంటే శాంతి. మాటంటే మానవ మస్తిష్కంలోని ఆలోచనలకు విప్లవ రూపం. మాటంటే భాష రూపంలో వెలువడుతున్న ప్రపంచ విజ్ఞాన శాస్త్రం. మాటంటే ఒక మనిషిని మరో మనిషి గౌరవించే మానవీయ మహా సంస్కృతి.
మాటంటే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్న వ్యాపార ప్రకటన కాదు. మాటంటే సంస్కారం. మన సంస్కారం మనుషులను గెలవనూ వచ్చు . మనుషులను కోల్పోనూ వచ్చు. మన మౌనానికి రకరకాల అర్థాలుండవచ్చు కానీ మన మాటలకు ఒకే అర్థం ఉంటుంది. అది ఆ మాటను అర్థం చేసుకునేవాడి మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి మనం మంచి ఉద్దేశంతో అన్న మాటలు కూడా విపరీత అర్థాలకు కారణం కావచ్చు. అందుకేనేమో అధికారంలో ఉన్నవాళ్లు ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తారు.
మన మాజీ ప్రధాని పీవీని మౌన ముని అంటారు. మన్మోహన్సింగ్ కూడా ప్రధానిగా పనిచేసిన కాలంలో అతి తక్కువ మాట్లాడేవారు. మాటంటే సమాజ మూలాల సాహిత్య సాంస్కృతిక ప్రతిరూపం. మాటంటే మన అస్తిత్వం. మాటలు మూటగట్టుకొని తిరిగే సంస్కారి సమాజాన్ని సంస్కారవంతంగా ఉంచుతాడు. గొప్ప తాత్విక సిద్ధాంతాలన్నీ మంచిమాటల మంచి వాక్యాల రూపాల మహాగ్రంథాలని మరువరాదు. మాట ఎదుటివాళ్లను బెదరకొట్టేది కాదు. కలిసి ఉన్న సమాజాన్ని మాట చెదరగొట్టకూడదు. విశ్వాసాలను నమ్మకాలను చెరిపేసే ప్రయ త్నం మాట చేయకూడదు. తెలియని పిల్లలు తప్పులు మాట్లాడితే పెద్దలు సరిచేయాలి. కార్యకర్తలు తప్పుగా మాట్లాడితే నాయకుడు సరిచేయాలి. నాయకుడే తప్పు మాట్లాడితే మాట తనకున్న సంస్కారాన్ని కోల్పోతుంది. నాయకుడంటే ఏ రంగాన్ని నడిపించే నేతలైనా కావచ్చు. అది చిన్న సంస్థ కావచ్చు, పెద్ద సంస్థ కావచ్చు. దేన్నయినా నడిపించే నాయకత్వ సాధనం మాట. నాయకుడంటే వ్యక్తి కాదు. వ్యవస్థ ఆకాంక్షల ప్రతిరూపం. నాయకుడంటే సమస్త జనావళిని సరైన మార్గంలో నడిపించే మహా సైనికుడు. నాయకుడంటే ప్రజలందర్నీ గుండెల్లో పెట్టి దాచుకుని భూమ్మీద ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. నాయకుడు మాటిస్తే ప్రజలు సంతృప్తిగా నిలుస్తారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలను పొందగలిగిన నాయకుడే కొత్త నిర్మాణాలను చేయగలుగుతాడు.
‘అశ్వత్థామ హతః కుంజరః’ అన్న ఒక్కమాట మహాభారత యుద్ధం మరొక మలుపు తిరగడానికి కారణమైంది. సీతారాముల పట్టాభిషేక అనంతరం అయోధ్యలో ఒక రజకుడన్న మాట ఉత్తర రామాయణ చరిత్రకు మూలమైనది. అవన్నీ ఇతిహాసాలు, పురాణాలూ కావచ్చు. కానీ మాట విశ్వరూపం విశదపరచడానికి నిలువెత్తు ఉదాహరణలు.
నమ్మకాలను నిలబెట్టగలిగిన నాయకుని మాట మీదే అశేషజనావళి నిలబడుతుంది. ప్రజల సంపూర్ణ విశ్వాసం పొందిన నాయకుని మాటకు కట్టుబడి జనసమూహం కదులుతుంది. భాష అస్తిత్వం కాబట్టి తెలంగాణ సమాజమంతా అస్తిత్వ ఉద్యమ జెండా పట్టుకొని నడుస్తున్న నాయకుని మాట వెంట నడిచివెళ్లింది. నాయకుడంటే నమస్కారం చేసి ఓట్లడుక్కునే సీజనల్ వ్యక్తి కాదు. నాయకుడంటే జాతి నడిపించే నేత. ఆ నాయకుడి మాట ప్రజలకు వేదం. అధికారం కోసం పీఠాల కోసం ఆపసోపాలు పడి అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మాట్లాడేవాడు నాయకుడిగా మనలేడు. అశుద్ధ భాషలో, అసహ్యంగా మాట్లాడే మాట అసలు మాటే కాదు. నోటికొచ్చినట్లు కారుకూతలు కూయటం ఎవరైనా చేయగలరు. మాటతో మొత్తం జాతిని ఒక తాటిపై నిలపటం నాయకునికి, మహా నాయకులకే సాధ్యం.కనుక మన మాటలు మనల్ని ఎవరెస్టు శిఖరం మీద కూర్చో పెట్టనూ కలవు. అధఃపాతాళానికి నెట్టేయనూ కలవు. తస్మాత్ జాగ్రత్త.
(నోటికొచ్చినట్లు అడ్డంగా, అడ్డదిడ్డంగామాట్లాడుతున్న కొందరి మాటలు విన్నాక, చదివాక..)
-జూలూరు గౌరీశంకర్ , 94401 69896