2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వివిధ రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని సాధించింది. ఇదే సమయంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర విధానాల మధ్య సారూప్య, వైరుధ్యాలు చర్చకు రావడం సహజం. ఈ ఆరేండ్ల పనితీరును పరిశీలించినప్పుడు తెలంగాణ రాష్ట్ర విజయాలు స్పష్టంగా కనబడతాయి. మరోవైపు దేశ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా గమనంలోకి తీసుకోకతప్పదు.
రాష్ర్టావతరణ జరగక ముందు దాదాపు ఆరు దశాబ్దాల పాటు పరాయి పాలనలో తెలంగాణ అల్లకల్లోలంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో శూన్యం నుంచి ప్రారంభించవలసిన పరిస్థితి. మరోవైపు పక్క రాష్ర్టానికి చెందిన ఒక కుటిల రాజకీయ నాయకుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా కూలగొడదామా అని గోతికాడ నక్కలా కాచుకుని ఉన్నాడు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలదొక్కుకోగలిగింది. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిని గాం చింది. దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. కానీ మరోవైపు కేంద్ర ప్రభుత్వ వ్యవహార సరళి ఇందుకు భిన్నంగా సాగింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించడానికి అన్ని హంగులూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు వేసిన పటిష్టమైన పునాది ఉన్నది. అంతర్జాతీయ రంగంలో ముడిచమురు ధర కూడా భారీగా తగ్గిపోయింది. ఎన్ని అనుకూలతలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలువలేక పోయింది. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే గత ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వ పాలనా విధానం నిరాశనే మిగిల్చింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో ఎంతో నిర్మాణాత్మకమైన కృషి సాగించింది. కానీ తెలంగాణలో కనిపించినటువంటి విప్లవాత్మక మార్పులు దేశవ్యాప్తంగా చోటు చేసుకోలేదు. ఇందుకు అనేక ఉదాహరణలు చూపవచ్చు.
ఎంతైనా మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యం విస్మరించలేనిది. వ్యవసాయ సంక్షోభం తెలంగాణ రాష్ర్టాన్నే కాదు, మొత్తం దేశాన్ని పీడిస్తున్నది. సమస్య ఒక్కటే, దాని స్వభావం ఒక్కటే. కేంద్రం, తెలంగాణ రాష్ట్రం అనుసరించిన విధానాలలోనే తేడా ఉన్నది. కొంతకాలంగా దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాలు పెల్లుబుకుతున్నా యి. ఏదో రూపంలో రైతులు అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ర్టాల్లో కొన్నేండ్ల కిందటే ఆందోళనలు సాగాయి. ఇప్పుడు పంజాబ్ మొదలుకొని యూపీ వరకు జాట్లోకమంతా అట్టుడుకుతున్నది. అయి నా కేంద్ర ప్రభుత్వం సంక్షోభ పరిష్కారానికి చేసిందేమీ లేదు. ఎకరానికి ఆరు వేలు ఇచ్చి చేతులు దులుపుకొంటే ఒరిగిందేమిటి? ఊదు గాలదు, పీరి లేవదు అన్నట్టు సమస్య అలాగే ఉన్నది. సంక్షోభాన్ని అధిగమించి, రైతులకు సంక్షేమాన్నిచ్చే వ్యూహమేదీ కేంద్ర ప్రభు త్వం దగ్గర లేదు. పుండు మీద కారం చల్లినట్టు వ్యవసాయ చట్టాలు రైతులను మరింత రెచ్చగొట్టాయి.
వ్యవసాయ సంక్షోభం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూలంలోకి వెళ్లి పరిష్కారాన్ని సాధించింది. ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం బారులు తీరాల్సివచ్చేది. లాఠీదెబ్బలు తినవలసి వచ్చేది. కల్తీ ఎరువులు, విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి మారింది. రాష్ట్ర ప్రభుత్వం కల్తీ లేని ఎరువులు, విత్తనాలను అందిస్తున్నది. ఇన్పుట్ సబ్సిడీ కింద ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తున్నది. ఈ విధంగా రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా కాపాడింది. రైతు మరణిస్తే, కుటుంబం కుదేలై పోకుండా బీమా లభిస్తున్నది. వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం పెద్ద ఎత్తున జరిగింది. భూసార పరీక్షలు చేయించి నేలలు, పంటలపై అవగాహన కల్పించింది. గోదాముల సంఖ్య భారీగా పెరిగింది. రైతు సమితుల ద్వారా సాగు మార్కెటింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. కరోనా సమయంలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. తెలంగాణ వచ్చిన ఈ మార్పు దేశంలోని ఇతర ప్రాంతాలలో కనిపించడం లేదు.
జలవనరుల వినియోగంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. దేశవ్యాప్తంగా 70 వేల టీఎంసీల నీరు వృథాగా పోతున్నది. ఈ నీళ్ళను పంట పొలాలలోకి మళ్ళిస్తే దేశం భాగ్యవంతమవుతుంది. కానీ అటువంటి ప్రయత్నమే జరగడం లేదు. రాష్ర్టాల మధ్య నీటి వివాదాలను పరిష్కరించడం లేదు. ఈ నిర్లక్ష్యం వ్యవసాయ సంక్షోభానికి, సామాజిక అనిశ్చితికి కారణమవుతున్నది.రాష్ర్టాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కానీ
తెలంగాణలో ప్రపంచం అచ్చెరువొందే రీతిలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం అతి వేగంగా సాగింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే దాదాపు ఇరువై ప్రాజెక్టులకు సమానం. భారీ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది చెరువుల పునరుద్ధరణ జరిగింది. ప్రాజెక్టుల నీటితో చెరువులు ఏడాది పొడుగునా నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. వరుసగా కరువు వచ్చినా వచ్చినా తెలంగాణకు సాగు, తాగు నీటి సమస్య ఉండదు. రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగిపోయింది. ఈ భారీ ప్రాజెక్టులు, చెరువులు ఒక్క వ్యవసాయ రంగంలోనే కాదు, మత్స్య, మాంస ఉత్పత్తితో పాటు రవాణా, పర్యాటకం వంటి అనేక రంగాల అభివృద్ధికి దారి తీయనుంది.
పారిశ్రామిక విధానం విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రత్యేకించి చెప్పుకోవలసిందే. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టు- హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల సాధారణ జనం ఇబ్బంది పడటమే కాకుండా, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఒక ప్రముఖ వ్యాపారస్తుడు కేంద్ర ప్రభుత్వాన్ని సభాముఖంగా మంత్రుల సమక్షంలో విమర్శించాడంటే, పారిశ్రామిక వర్గాలలో ఎంత అసంతృప్తి పేరుకుపోయిందో గ్రహించవచ్చు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది. కల్పవృక్షం వంటి జీవిత బీమా సంస్థను ప్రైవేటు చేతుల్లో పెట్టాలని కేంద్రం భావిస్తున్నది.
తెలంగాణలో సులభ వాణిజ్య విధానం విజయవంతమైంది. భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన జరిగింది. జిల్లా కేంద్రాలలో కూడా ఐటీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. మన పారిశ్రామిక విధానానికి దేశ విదేశాలలో ప్రశంసలు అందుతున్నాయి. నిరంతర కరెంటు వల్ల పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతినడం లేదు. విద్యుత్ కేంద్రాలను ప్రభుత్వ రంగంలో స్థాపించడమే కాకుండా వాటి నిర్మాణానికి సంబంధించిన ఆర్డర్లను పబ్లిక్ రంగ పరిశ్రమలకు ఇవ్వడం విశేషం. రాష్ట్రంలో అనేక ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ జరుగుతున్నది. ఇందుకోసం 2017లో పరిశ్రమల చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపుగా అరవై పరిశ్రమలను పునరుద్ధరించింది. 28 పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించింది. మరో 44 పరిశ్రమలను ఆదుకుంటున్నది. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు ప్రభుత్వ విధానం వరంగా మారింది. నష్టాల్లో ఉన్న పరిశ్రమలకు ఊతం ఇవ్వడం వల్ల దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తుల పరిరక్షణ జరిగింది. వందలాది ఉద్యోగాలను కాపాడినట్టయింది. కేంద్రం ప్రభుత్వ రంగాన్ని అమ్మకానికి పెడుతూంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కంటికి రెప్పలా కాపాడుతున్నది.
ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం ఉపాధి అవకాశాలు పెరిగే ఆర్థిక విధానాలను కూడా అనుసరించడం లేదు. దీనివల్ల పారిశ్రామిక అనిశ్చితితో పాటు నిరుద్యోగం పెరిగిపోతున్నది. కానీ తెలంగాణలో ఉద్యోగ కల్పన భారీ ఎత్తున జరిగింది. ఆరేళ్ళలో లక్షా ముప్ఫై వేలకు పైగా ఉద్యోగాలు లభించాయి. గ్రామీణ ఉపాధి కల్పనలో కూడా తెలంగాణ వినూత్న వ్యూహాలతో ముందుకు పోతున్నది. ఇంతకాలం నైపుణ్యం అంటే విద్యావంతులకే పరిమితం అనే అపోహ ఉండేది. కానీ గ్రామీణ వృత్తుల నైపుణ్యాన్ని గుర్తించి, వారిని ప్రోత్సహిస్తున్నది. దీనివల్ల వృత్తి నిపుణులకు ఉపాధి లభించడంతోపాటు, సంపద సృష్టి జరుగుతున్నది. గొర్రెలు, బర్రెల పంపిణీ జరిగింది. చెరువులలో చేపలను నింపడం వల్ల మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నది. చెరువులు నిండి, పుష్కలంగా పంటలు పండుతున్నాయి. దీంతో గ్రామీణ ఉపాధి పెరిగింది. పల్లెలు భాగ్యసీమలుగా మారాయి. పల్లెలలో బతుకలేక ఇతర నగరాల వైపు వలస పోవడం, అరకొర కూలీతో జీవితాలు వెళ్ళదీయడం ఆగిపోయింది. పాలమూరు నుంచి ముంబయి బస్సు నిలిచిపోవడం ఇందుకు ఉదాహరణ.
సంక్షేమ రంగానికి కేంద్ర, రాష్ట్ర విధానాలలో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కుదించాలని ఆలోచిస్తుంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పథకాలను పెంచుతూ పోతున్నది. పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు మనిషి అవసరాలేమిటి అనేది ఆలోచిస్తూ ప్రభుత్వపరంగా తోడ్పాటు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. తెలంగాణలో గత ఆరేండ్లలో అనేక మౌలిక మార్పులు సంభవించాయి. జిల్లాల పునర్విభజన జరగడంతో పరిపాలన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడమే ఒక సాహసం. దీని వల్ల వివాదాలు తగ్గిపోయి, భూములకు భద్రత లభిస్తున్నది. విద్య, వైద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఎక్కడైతే సంక్షేమ పాలన ఉంటుందో అక్కడ నేరాలు తగ్గుతాయనేది స్కాండినేవియన్ దేశాల ఉదాహరణ వల్ల తెలుస్తున్నది. తెలంగాణలో నేరాలు తగ్గిపోయి జైళ్ళు ఖాళీ అవుతున్నాయి. ఖైదీలు సంపద సృష్టిలో భాగస్వాములవుతున్నారు. కారాగారాలు కక్షసాధింపు నిలయాలుగా కాకుండా సంస్కరణాలయాలుగా మారాయి. ఖైదీలు బయటకు వచ్చిన తరువాత ఉన్నతమైన జీవనం గడుపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో రెండు ప్రధానాంశాలు కనిపిస్తాయి. ఒకటి- మానవీయ హృదయం రెండవది- పాలనా సామర్థ్యం. ఇంటింటికీ మంచి నీరు అందుతుందని కలలోనైనా ఊహించామా? సంక్షేమ వసతి గృహాలలోని పిల్లలకు గతంలో కొలత ప్రకారం ఆహారం పెట్టేవారనేది నమ్మశక్యం కాని వాస్తవం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే, పిల్లలకు కడుపు నిండా పోషకాహారం అందిస్తున్నది. బడుగు వర్గాలకు పెద్ద ఎత్తున గురుకులాల ఏర్పాటు జరిగింది. రోగులు సర్కారు దవాఖానలకు పోతున్నారు. కల్యాణ లక్ష్మి వల్ల పేద బిడ్డలకు తోడ్పాటు లభించడంతోపాటు, బాల్య వివాహాలు నిలిచిపోయాయి. ఆడబిడ్డలు పండుగలకు కొత్త చీరలు కట్టుకుని మురిసిపోతున్నరు. తెలంగాణ బిడ్డలు క్రీడల్లో రాణిస్తున్నారు, పర్వతాలను అధిరోహిస్తున్నారు. రాజ్యం సామాజిక ఆర్థిక పరివర్తనా సాధనంగా ఉండాలనే ఆధునిక రాజనీతి తెలంగాణలో అమలవుతున్నది. సమాజం పరివర్తన చెందుతున్నది. తెలంగాణలో చట్టబద్ధ పాలన సాగుతున్నది. హింసా, విధ్వంసాలు లేని తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు, ప్రజలకు ఎంతో భరోసాను ఇస్తున్నది. బంగారు తెలంగాణ దేశానికి బాట చూపుతున్నది.
– సహ్య
సంక్షేమ రంగానికి కేంద్ర, రాష్ట్ర విధానాలలో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కుదించాలని ఆలోచిస్తుంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పథకాలను పెంచుతూ పోతున్నది.
ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం ఉపాధి అవకాశాలు పెరిగే ఆర్థిక విధానాలను కూడా అనుసరించడం లేదు. దీనివల్ల పారిశ్రామిక అనిశ్చితితో పాటు నిరుద్యోగం పెరిగిపోతున్నది. కానీ తెలంగాణలో ఉద్యోగ కల్పన భారీ ఎత్తున జరిగింది. ఆరేళ్ళలో లక్షా ముప్ఫై వేలకు పైగా ఉద్యోగాలు లభించాయి. గ్రామీణ ఉపాధి కల్పనలో కూడా తెలంగాణ వినూత్న వ్యూహాలతో ముందుకు పోతున్నది.
తెలంగాణలో సులభ వాణిజ్య విధానం విజయవంతమైంది. భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన జరిగింది. జిల్లా కేంద్రాలలో కూడా ఐటీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. మన పారిశ్రామిక విధానానికి దేశ విదేశాలలో ప్రశంసలు అందుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో రెండు ప్రధానాంశాలు కనిపిస్తాయి. ఒకటి- మానవీయ హృదయం రెండవది- పాలనా సామర్థ్యం. ఇంటింటికీ మంచి నీరు అందుతుందని కలలోనైనా ఊహించామా? సంక్షేమ వసతి గృహాలలోని పిల్లలకు గతంలో కొలత ప్రకారం ఆహారం పెట్టేవారనేది నమ్మశక్యం కాని వాస్తవం.