కొవిన్ పోర్టల్ నుంచి 111 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీకైందన్న వార్తలతో యావత్దేశం ఉలిక్కిపడింది. కరోనా సమయంలో కేంద్రప్రభుత్వం ఈ పోర్టల్ను తీసుకొచ్చింది. టీకా కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ పోర్టల్లో వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని నిబంధన పెట్టటంతో అనేక మంది తమ వివరాలను నమోదు చేశారు. దవాఖానకు వెళ్లి టీకా వేసుకున్న వ్యక్తుల వివరాలను కూడా పోర్టల్లో చేర్చారు. ఈ విధంగా కోట్లాదిమంది వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు, పాన్, పాస్పోర్ట్ తదితర వివరాలు కొవిన్లో నమోదయ్యాయి. ఇప్పుడీ సమాచారం అంతా అంగట్లో సరుకులా మారి, టెలిగ్రాం మెసెంజర్ యాప్లో ప్రత్యక్షం కావటం కలకలం రేపుతున్నది.
కొవిన్ నుంచి డాటా లీకైందన్న వార్తలు గతంలోనూ ఒకసారి షికారు చేశాయి. అటువంటిదేమీ లేదంటూ కేంద్రం ఒక ప్రకటన జారీ చేసి ఊరుకున్నది. కానీ, గట్టి చర్యలు ఏమీ తీసుకున్నట్టు లేదు. లేకపోతే, ఈసారి ఇంత భారీ ఎత్తున లీకేజీ జరిగి ఉండేది కాదు. ఇప్పుడు కూడా లీకేజీ జరగలేదని కేంద్రం చెబుతున్నదిగానీ, టెలిగ్రాంలో బయటపడిన సమాచారం వాస్తవస్థితిని వెల్లడిస్తున్నది. సదరు డాటాలో ఫోన్ నెంబర్ నమోదు చేయగానే సంబంధిత వ్యక్తుల వివరాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ రాజకీయ నేతల నుంచి జర్నలిస్టుల వరకూ పలువురి సమాచారం బయటకు వచ్చింది. అటువంటప్పుడు, దీనిని లీకేజీ కాదని కేంద్రం చేతులు దులుపుకోవటం సరికాదు. కోట్లాది మంది దేశ ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి తమ వ్యక్తిగత వివరాలను అందజేసినప్పుడు, దానిని కాపాడే బాధ్యత కచ్చితంగా కేంద్రానిదే. సాంకేతికంగా సమస్య ఎక్కడ ఉన్నదో గుర్తించి దానిని సరి చేయాలి. అంతేతప్ప దీనిని కూడా రాజకీయ అంశంగా భావించి అసత్యాలకు, అర్ధసత్యాలకు దిగరాదు.
ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 229 కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి. వీటిలో 20 శాతం భారత్లోనే సంభవించాయి. డేటా లీకేజీలో మన దేశం అంతర్జాతీయంగా రెండోస్థానంలో ఉంది. దీనిపై సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. సైబర్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ, మన దేశంలో పరిస్థితి పెద్దగా మెరుగుపడటం లేదు. 2021లో ఎయిర్లైన్ డాటా సర్వీస్ ప్రొవైడర్ సిటాపై హ్యాకర్లు జరిపిన దాడిలో 45 లక్షల మంది ఎయిరిండియా తదితర విమానయాన సంస్థల ప్రయాణికుల వివరాలు బహిర్గతమయ్యాయి. 2020లో బిగ్బాస్కెట్ వినియోగదారుల సమాచారం బయటకు పొక్కింది. అంతకుముందు ఏడాది జస్ట్డయల్, ఎస్బీఐ కస్టమర్ల వివరాలు బహిర్గతమైనాయి. కేంద్రం వద్ద ఒక పటిష్ఠమైన వ్యూహంగానీ, యంత్రాంగంగానీ లేకపోవటాన్ని ఈ వరుస దాడులు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత కొవిన్ ఉదంతంతోనైనా కేంద్రం మేల్కొనాలి. సాంకేతికంగా ముందంజలో ఉన్న దేశాల్లో తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేయాలి. సమగ్రమైన విధానాన్ని రూపొందించి, తక్షణ, దీర్ఘకాలిక చర్యలను అమలులో పెట్టాలి.