ఆకలిపై జరిగిన పోరాటంలో అలుపులేని వీరుడతడు. హరిత విప్లవ పితామహుడిగా చరితార్థుడు. సాగు బాగు కోసం ఆకుపచ్చని కలలుగన్న నిరంతర స్వాప్నికుడు. ఎం.ఎస్.స్వామినాథన్ మృతితో ఒక నిండైన, మెండైన జీవనయానం ముగిసింది. ఆహార స్వయం సమృద్ధికి బాటలు వేసిన అచ్చమైన అన్నదాత పచ్చదనంలో మమేకమైపోయాడు. 1942 నాటి మాట. అటు గాంధీజీ తెల్లదొరలను క్విట్ ఇండియా అన్న రోజులవి. రెండో ప్రపంచ యుద్ధం చండచండం తీవ్ర తీవ్రమవుతున్నది. మరోవైపు వలసపాలన పుణ్యమా అని సమృద్ధ భారత్ ఆకలికేకలతో అలమటిస్తున్నది. 30 లక్షల మందిని బలిగొన్న డొక్కల కరువు పీడకలలో నుంచి మేలుకున్న సామాన్య మానవుడే స్వామినాథన్. కరువులను తరిమికొట్టిన హరిత సేనానిగా వినుతికెక్కాడు. బక్కజీవులకు పిడికెడన్నం పెట్టాలనే తపన అతడిని పొలంబాట పట్టించింది. తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాల్సి ఉండింది. రోగం నయం చేయడం కన్నా రోగానికి మూలమైన ఆకలిని అంతం చేయాలని పంతం పూనాడు. అన్నానికి మారుపేరుగా మారాడు. దిగుబడులను పెంచే గుట్టు జన్యుశాస్త్రంలో ఉన్నదని ఆ దిశగా అడుగులు వేశాడు. కొత్త వంగడాలను సృష్టించి దేశానికి కడుపు నిండా అన్నం దొరికే మార్గం చూపాడు.
1947లో భారతదేశం రాజకీయ స్వాతంత్య్రం అయితే సాధించింది కానీ, ఆకలి నుంచి విముక్తం కాలేదు. శతాబ్దాల వలస పాలనలో వ్యవసాయం అడుగంటింది. దేశానికి సరిపడా ఆహారాన్ని అందించలేకపోతున్నది. ఈ సుడిగుండం నుంచి బయటపడాలని భారత్ చూస్తున్నది. సాగును ఆధునికీకరించే వనరులు మన దేశంలో అప్పటికి అరకొరగానే ఉన్నాయి. అమెరికా వంటి దేశాల నుంచి ధాన్యం ఓడల కోసం ఎదురుచూసే పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దేశంలో హరిత విప్లవానికి నారు పోసినవాడు స్వామినాథన్. 1947లో 60 లక్షల టన్నులున్న గోధుమ దిగుబడి 20 ఏండ్లలో మూడింతలైంది. ఇది హరిత విప్లవం తొలి విజయాల్లో ఒకటి. నోబెల్ బహుమతి గ్రహీత, అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్తో కలిసి స్వామినాథన్ చేసిన పరిశోధనలు భారతదేశ వ్యవసాయరంగ అభివృద్ధికి అండగా నిలిచాయి. సృజనాత్మకమైన పరిశోధనలే స్వామినాథన్ను హరిత విప్లవ పితామహునిగా నిలబెట్టాయి. ఆహార ఉత్పత్తిలో దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించిన మహా దార్శనికుడిగా ఆయన గుర్తుండిపోతారనడంలో సందేహం లేదు.
హరిత విప్లవానికి సారథ్యం వహించిన స్వామినాథన్ ఆ విప్లవ దుష్ఫలితాల గురించి కూడా నాడే హెచ్చరించారు. స్వదేశీ వంగడాలను నిర్లక్ష్యం చేసి పూర్తిగా సంకర వంగడాలకు మళ్లడం మంచిది కాదని చెప్పారు. ఎరువులు, పురుగుల మందులు ఎడాపెడా వినియోగించడం వల్ల అంతిమంగా భూసారం తగ్గిపోతుందని హెచ్చరించిన దార్శనికుడూ ఆయనే. భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా వాడుకుంటే ముప్పు తప్పదని చెప్పిందీ ఆయనే. కేవలం శాస్త్రీయ సాగు పద్ధతుల మీదనే కాకుండా వ్యవసాయం మన సమాజంపై చూపే ప్రభావం గురించి కూడా పలు నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. పంటలే కాదు, పంటలను పండించే రైతుల బాగోగుల గురించి కూడా ఆయన లోతుగా ఆలోచించేవారు. కనీస మద్దతు ధరకు సర్కారు అండగా నిలవాలని గట్టిగా వాదించిన వారిలో ఆయన కూడా ఉండటం విశేషం. సగటు ఉత్పాదక వ్యయానికి 50 శాతం అధికంగా చేర్చి మద్దతు ధర నిర్ణయించాలన్న ఆయన సూచన సర్వజనామోదం పొందింది. దీన్ని పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న బీజేపీ తర్వాత పక్కనపెట్టింది. ఏదో ఒకరోజు తను సూచించిన ఫార్ములా అమల్లోకి వచ్చి తీరుతుందని, దీనికి ప్రత్యామ్నాయం లేదని స్వామినాథన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సాగు బాగు కోసం నిరంతరం తపించిన స్వామినాథన్కు తెలంగాణతో సన్నిహిత అనుబంధం ఉంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ వ్యవసాయరంగంలో సాధించిన అద్వితీయ విజయాలను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తెలంగాణ విత్తనరంగం జాతీయంగా, అంతర్జాతీయంగా కీలకపాత్ర పోషించే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని స్వామినాథన్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత స్వామినాథన్ 2014లోనే తెలంగాణను సందర్శించారు. వ్యవసాయరంగం అభివృద్ధిపై పలు సలహాలు, సూచనలు చేశారు. స్వామినాథన్ చూపిన బాటలో తెలంగాణ పయనిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నవిధంగా నడిచి చూపించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని కేసీఆర్ పునరుజ్జీవింపజేశారు. తెలంగాణలో వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 24 గంటల విద్యుత్తును ప్రశంసిస్తూ స్వయంగా స్వామినాథన్ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖరాశారు. అలాగే రైతుబంధు, రైతుబీమా, సాగునీటి వంటి పథకాలతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు జీవం పోసిందని మరో సందర్భంలో కితాబివ్వడం గమనార్హం. వ్యవసాయరంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని స్వయంగా వచ్చి చూస్తానని పలు సందర్భాల్లో అన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఆ కోరిక నెరవేరలేదు. సాగును బాగుపరిచి దేశం ఆకలి తీర్చడమే కాకుండా, రైతు సంక్షేమం గురించి కూడా నిరంతరం తపించిన స్వామినాథన్ సేవలు సర్వదా స్మరణీయం.