విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనప్పటికీ, చుట్టూరా దేశాల పరిణామాలు భారత్కు అనుకూలంగా సంభవించడం విశేషం. అయితే ఈ పరిణామాలను ఏ మేరకు ఉపయోగించుకోగలమనేదే ప్రశ్న. తమ దేశంలో అభివృద్ధి పథకాలను కొనసాగించాలంటూ తాజాగా ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ల నుంచి భారత్కు అనుకూల సంకేతాలు వచ్చాయి. తాలిబన్లు అధికారంలోకి రాకముందు రోడ్లు, డ్యామ్లు, విద్యుత్ సరఫరా లైన్లు, సబ్స్టేషన్లు మొదలుకొని దవాఖానల వరకు భారత్ వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. ఏడాది కిందట- 2021 ఆగస్టు 15న తాలిబన్లు అధికారంలోకి రావడంతో భారత్ తమ దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేసింది. తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించనప్పటికీ, ఆహారపదార్థాలను, వ్యాక్సిన్లను మానవతా దృక్పథంతో సరఫరా చేసింది. దౌత్య కార్యాలయాన్ని మళ్లీ ఇటీవలే తెరిచింది.
అమెరికా, చైనా, ఇరాన్ వంటి దేశాలే తాలిబన్లతో ఏదో ఒక స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నప్పుడు మన దేశం సంకోచించవలసిన అవసరం లేదు. ఆఫ్ఘనిస్థాన్లో అనేక రకాల ఉగ్రవాద మూకలున్నాయి. వాటి ప్రభావం మన దేశం మీద పడకూడదంటే, అక్కడి పాలకుల ద్వారా మన పట్టును పెంచుకోవడమొక్కటే మార్గం. మొదటి నుంచి మనకు నమ్మకమైన స్నేహ రాజ్యంగా ఉన్న ఇరాన్తో కూడా కొన్నేండ్లుగా భారత్కు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది కూడా మోదీ ప్రభుత్వ విధాన వైఫల్యమే. అయితే ఇటీవల మళ్ళీ ఇరాన్తో సంబంధాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రేయిన్పై రష్యా దాడి మూలంగా చమురు కొరత ఏర్పడటంతో, ఇరాన్పై ఆంక్షల విషయంలో అమెరికా అంత పట్టుదలగా లేదు.
ఈ నేపథ్యంలో చబహర్ రేవు విషయంలో ముందడుగు వేయాలని గత నెలలోనే ఇరాన్తో అంగీకారం కుదిరింది. ఇరాన్ ద్వారా ఆఫ్ఘనిస్థాన్ మీదుగా మధ్య ఆసియా వరకు రవాణా మార్గాలు నెలకొల్పుకోవడం భారత్కు అవసరం. కానీ భారత్ వేగంగా అడుగులు వేయాల్సి ఉంది. శ్రీలంకలో ప్రజా ఉద్యమం వల్ల చైనా అనుకూలురైన రాజపక్స సోదరులు పదవీభ్రష్టులయ్యారు. కానీ ఈ పరిస్థితులను భారత్ అనుకూలంగా మలుచుకోలేకపోతున్నది. ప్రజాభిప్రాయంలో భారత్కు అనుకూలంగా కొంత మార్పు వచ్చినప్పటికీ, ఇప్పటికీ చైనా పట్టు బలంగానే ఉన్నది.
అంతర్జాతీయ సంబంధాలు వేగంగా మారిపోతున్నాయి. మధ్య ఆసియా మొదలుకొని ఇండో పసిఫిక్ వరకు కొత్త మండలాలపై దృష్టి మళ్ళింది. ఏ ప్రాంతంలో ఏయే దేశాల ప్రాబల్యం నెలకొంటుందో చెప్పలేని పరిస్థితి. యథాతధ స్థితి దెబ్బతిని, బలాబలాలు మారిపోవడం భారత్ వంటి ఎదుగుతున్న దేశానికి అనుకూల పరిణామం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇటీవలి వరకు భారత్ దౌత్యనీతిలో బ్రిటన్ మాదిరిగా ఆరితేరింది. విధానకర్తలు తగిన రాజకీయ వ్యూహా లు రచిస్తే, మన దౌత్యవేత్తలు అద్భుత ఫలితాలు సాధించగలరు. కానీ మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం లోపభూయిష్టంగా ఉన్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపలేక పోతున్నది. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా తమ వైఫల్యాలను అధిగమించాలి. విదేశాంగ విధానంలో మన దేశ ప్రాభవాన్ని కాపాడాలి.