ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించే 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటవుతుందని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. రాజ్యాంగపీఠం ఇచ్చిన తాజా తీర్పుతో ఈడబ్ల్యూఎస్ కోటాపై తలెత్తిన వివాదానికి న్యాయపరమైన ముగింపు పలికినట్టయింది. పేదరికంలో మగ్గుతున్నప్పటికీ కోటా విధానం తమకు మద్దతుగా లేదనే భావన గల అగ్ర వర్గాల పేదలకు రాజ్యాంగపీఠం ఇచ్చిన తీర్పు మూలంగా ఊరట లభించింది. అయితే ఇంతకాలం సామాజికంగా వెనుకబడిన తరగతులకు, ఇప్పుడు అగ్ర వర్గాల పేదలకు- రిజర్వేషన్ సౌకర్యం కల్పించినప్పుడల్లా అదొక వివాదాస్పద, ఉద్వేగపూరిత చర్చకు దారితీస్తున్నది. ప్రభుత్వాలు సామాజికార్థిక సమస్యలకు మౌలిక పరిష్కారాలు సాధించకుండా, విభేదాలు సృష్టించి లబ్ధి పొందడానికి ప్రయత్నించడమే ఈ పరిస్థితులకు కారణం.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచి అమృతోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో కూడా- ఇంకా పేదరికం ఉందనే వాస్తవాన్ని ఈ రిజర్వేషన్ అంశం గుర్తుకు తెస్తున్నది. ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో- కేంద్రంలో, రాష్ర్టాలలో అనేకసార్లు ప్రభుత్వాలు మారాయి. పలు భావజాలాలు గల పార్టీలు పాలించాయి. అయినా సామాజిక అంతరాలు తొలగిపోలేదు. పాలకులుగా ఎవరు వచ్చినా రిజర్వేషన్ ఒక మార్గమని కాకుండా దానినొక అంతిమ లక్ష్యంగా మార్చివేశారు. విస్తృత సమాజ సంక్షేమానికి రిజర్వేషన్ కల్పన ఒక మార్గమే తప్ప అదే పరిష్కారం కాదనే వాస్తవాన్ని కప్పిపుచ్చారు. కోటా చుట్టూ రాజకీయాలు నడుపుతూ పలు పార్టీలు లబ్ధి పొందుతున్నాయి. ఈ క్రమంలో భిన్న సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలను పెంచి పోషిస్తున్నాయి.
అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. కానీ, రిజర్వేషన్లను అమలు చేస్తూనే, మరోవైపు సామాజికాభివృద్ధి చర్యలనూ చేపట్టాలి. పాలకుల దగ్గర దేశంలోని భిన్న సామాజిక వర్గాలకు సంబంధించిన గణాంకాలు ఉండకపోవడం, వాటి ప్రాతిపదికన అభివృద్ధి వ్యూహాలూ రచించుకోకపోవడం ఆశ్చర్యకరం కాదా! ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గమనార్హమైనవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం అన్ని సామాజికవర్గాల ఆర్థిక స్థితిగతులపై వివరాలను సేకరించింది. తదనుగుణంగా అన్ని వర్గాలకు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నది. అగ్ర వర్గాల పేదలైనా, అణగారిన వర్గాలైనా అందరి అభ్యున్నతిని వాంఛిస్తూ సూక్ష్మస్థాయిలో పథకాలను అమలు చేస్తున్నది. బడుగు వర్గాల విద్యార్థులకూ కార్పొరేట్ విద్యాసంస్థలను పోలిన బోధన అందిస్తున్నది. అగ్ర వర్గాల పేదలకు విదేశాల్లో విద్యాభ్యాసానికి ప్రోత్సాహం ఇస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు ఏ వర్గం వారైనా తెలంగాణ నమూనా అభివృద్ధి విధానాలను కోరుకోవాలి. ప్రస్తుతానికి రిజర్వేషన్లను అమలు చేస్తూనే, అంతరాలు లేని కాలానికి తలుపులు తెరువాలి.