చంద్రయాన్-3 రాకెట్ దిగ్విజయంగా రోదసిలోకి ఎగిరింది. అది చూసిన కోట్లాదిమంది భారతీయుల ఉత్సాహమూ నింగికి ఎగిసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై ప్రశంసలు కురుస్తున్నాయి. చంద్రయాన్ వరుసలో మూడోదైన ఈ ప్రయోగం, మన కీర్తికిరీటంలో కలికితురాయి వంటిది. చంద్రునికి సంబంధించిన కీలక సమాచారం సేకరించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వసంస్థ అయిన ఇస్రో, ప్రైవేటు పరిశ్రమల కన్సార్షియం ఉమ్మడిగా చేపట్టడం విశేషం. ఒక ప్రధానమైన అంతరిక్ష కార్యక్రమంలో ఇస్రో ప్రైవేటురంగంతో చేతులు కలపడం ఇదే మొదటిసారి. చంద్రునిపై మానవ ఆవాసాలు నిర్మించుకునేందుకు గల అవకాశాలను అన్వేషించడం దీని ప్రధాన లక్ష్యం. యూరప్, అమెరికా, జపాన్, కెనడాలతో ఆర్టెమిస్ ఒప్పందంలో భాగంగా ఇండియా దీన్ని చేపట్టింది. భవిష్యత్తులో చేపట్టే చంద్రమండల అన్వేషణల్లో, మొత్తంగా అంతరిక్ష విజ్ఞాన అభివృద్ధిలో మూలమలుపు, మేలి మలుపు లాంటి ప్రయోగం ఇది.
సుదీర్ఘమైన 42 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ గమ్యాన్ని ముద్దాడుతుంది. ఆ తర్వాత అందులో ఉండే రోవర్ బయటికివచ్చి చంద్రుని అన్వేషణ కొనసాగిస్తుంది. నీటిజాడలతోపాటుగా అరుదైన లోహాల జాడ తెలుసుకుంటుంది. ఇప్పటిదాకా చంద్రుని మీదకు మానవరహిత, మానవ సహిత రాకెట్లను పంపిన దేశాలు ఉత్తరార్థ గోళానికే పరిమితమయ్యాయి. ఇప్పుడు భారత దేశం మొట్టమొదటిసారిగా చంద్రుని మరోవైపు చూడబోతున్నది. అంటే మన చంద్రయాన్-3 చంద్రునికి సంబంధించిన ఎన్నో విశేషాలను ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియజేయబోతున్నది. నిజానికి ఇలాంటి సుదీర్ఘ అంతరిక్షయాత్రలు ఉత్కంఠభరితంగానే ఉంటాయి. కానీ శుభారంభం కలిగించే ధీమా వేరే కదా!
1957లో రష్యా మొట్టమొదటిసారిగా స్పుత్నిక్తో అంతరిక్ష అన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఆ ఏడాదే భారత్ అంతరిక్ష కార్యక్రమానికి నాందీప్రస్తావన జరిగి ఇస్రో పురుడు పోసుకుంది. పేద దేశానికి రాకెట్ సైన్స్ దేనికి? అని ప్రపంచదేశాలు హేళన చేసిన రోజులవి. సంపన్న దేశాలతో పోటీపడి పరుగులు తీయడం కాకుండా, ఆధునిక విజ్ఞానాభివృద్ధిలో మేం ఎవరికీ తీసిపోమని చాటుకోవడమే తమ లక్ష్యమని భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ దీటైన సమాధానం ఇచ్చారు. సైకిళ్ల మీద రాకెట్ విడిభాగాలు ప్రయోగ కేంద్రానికి తరలించిన రోజుల నుంచి భారత అంతరిక్ష విజ్ఞానం చాలా పురోగతి సాధించింది. ఇవాళ ప్రపంచ దేశాలు భారతదేశ అంతరిక్ష సేవల కోసం బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా మన రాకెట్ సాంకేతికతకు డిమాండ్ పెరుగుతున్నది. అంతర్జాతీయంగా పెరిగిన భారత్ ప్రతిష్ఠకు ఇదొక నిదర్శనం. భారత అంతరిక్ష విజ్ఞానాన్ని మొక్కవోని దీక్షతో ముందుకు నడిపించిన దార్శనికుల కృషి మరువలేనిది.