సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం
ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్, మే 3: కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్పష్టం చేశారు. పేదింటి ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సర్కారు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల మండలంలోని 45మంది లబ్ధిదారులకు సోమవారం రూ.45,05,220 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విలయతాండవం చేస్తూ వ్యక్తులను, వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నా ప్రజలకు ఇబ్బందులు రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ఆపలేదన్నారు. గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు జీతాలిస్తూ గౌరవించుకుంటున్నామని, గతంలో 8 కోడిగుడ్లు ఇస్తే ప్రస్తుతం నెలకు 30కోడిగుడ్లు ఇస్తున్నామన్నారు. ఎంపీపీ రాజేంద్రప్రసాద్, సర్పంచులు బుర్ర ప్రవీణ్, సరోజిని, మల్లారెడ్డి, తిరుపతి, జాన్, మహేశ్వర రావు, జైపాల్, ఎంపీటీసీలు మహేశ్, సురేందర్ రెడ్డి, పరశురాం గౌడ్, నాయకులు తిరుపతి, రవి, భీమయ్య, తహసీల్దార్ దిలీప్ ఉన్నారు.