తిరుమలగిరి/తిరుమలగిరి, డిసెంబర్ 28 : యాసంగి సీజన్ కోసం ఎస్సారెస్పీ ఫేజ్ 2 కాల్వలకు అధికారులు నీటిని విడుదల చేశారు. నీటిపారుదల శాఖ ఈఈ విజయ్కుమార్ మంగళవారం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని బయ్యన్నవాగు రిజర్వాయర్ గేట్లను ఎత్తి కాకతీయ కెనాల్కు 1,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం గోదావరి జలాల్లో పూలు జల్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తూముల గేట్లను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 1,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా 69డీబీఎమ్కు 500 క్యూసెక్కులు 70డీబీఎమ్కు 50 క్యూసెక్కులు, 71 డీబీఎమ్కు 1,100 క్యూసెక్కులు విడుదల చేశారు. ఒకటీరెండ్రోజుల్లో మరో 100-150 క్యూసెక్కుల నీరు అదనంగా విడుదల కానున్నది. డీబీఎం-69,70,71 కాల్వల ద్వారా నాగారం, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల మండలాలకు చేరుకున్న గోదావరి జలాలు బుధవారం ఉదయానికి సూర్యాపేట మండలానికి రానున్నాయి. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈలు సత్యనారాయణ, హరికృష్ణ, ఏఈలు అమర్, హరిస్వరూప్ పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారం నీళ్లు..
షెడ్యూల్ ప్రకారం గోదావరి జలాలను విడుదల చేస్తాం. ఈనెల 25న ప్రకటించిన తేదీల ప్రకారం ఏప్రిల్ 3వ తేదీ వరకు మొత్తం 56 రోజులు 3.36 లక్షల క్యూసెక్కుల నీటిని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో అందిస్తాం. గోదావరి జలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
-డీఈ సత్యనారాయణ, నీటి పారుదల శాఖ అధికారి
ఏడు విడుతల్లో సాగు నీరు…
యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు నీటి పారుదల శాఖ అధికారులు ఈ నెల 25న షెడ్యూల్ ప్రకటించారు. ఒక్కో విడుతలో వారం రోజుల ప్రకారం ఏడు విడుతల్లో నీటి విడుదల కొనసాగించనున్నారు. తొలి విడుతగా ఈ నెల 29నుంచి ఏప్రిల్ 3వరకు మొత్తం 56 రోజులు నీటిని విడుదల చేయనున్నారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేసి నీటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
రామన్నగూడెం జనం
అర్వపల్లి, డిసెంబర్ 28 : మండలంలోని రామన్నగూడెం ఎస్సారెస్పీ కాల్వకు ఆనుకుని ఉంటుంది. కానీ, నీళ్లు లేక గ్రామస్తులు ఏటా వలస వెళ్లేవారు. సుమారు 100 కుటుంబాలు కర్ణాటక, నిజామాబాద్, కృష్ణా, కరీంనగర్ జిల్లాలకు వలసలు వెళ్లేవారు. కానీ, కాళేశ్వరం జలాల రాకతో వలసలు నిలిచిపోయాయి. ఊళ్లోనే వ్యవసాయం, చేతినిండా పని దొరుకుతున్నది. పడావు బెట్టిన భూములన్నీ పచ్చని మాగాణుల్లా మారిపోయాయి. గ్రామస్తులందరికీ స్థానంగా ఉపాధి లభిస్తున్నది. భూమి ఉన్నవాళ్లు వ్యవసాయం చేసుకుంటుండగా లేని వాళ్లు కూలి పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుతున్నారు. నీటి రాకతో గ్రామ కళకళలాడుతున్నది.
నీళ్లొచ్చినంకనే దేశం పోవుడు బంద్ అయినం..
మూడేండ్ల నుంచి గోదారి నీళ్లొస్తున్నయి. ఊళ్లోనే చేతినిండా పని దొరుకుతున్నది. అప్పటి నుంచి దేశం పోవుడు మొత్తం బంద్ అయ్యింది. నేను మా ఊరి నుంచి ఏటా 50 మంది కూలీలను తీసుకుని కర్ణాటక, నిజామాబాద్ పోయేవాళ్లం. అక్కడే నెలకు పైన్నే ఉండి నాట్లు వేసి వచ్చేవాళ్లం. గోదారి నీళ్లు వచ్చినంక మా బాధలన్నీ పోయినయి.