మియాపూర్ : కరోనా కట్టడికి చందానగర్ సర్కిల్ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సర్కిల్ డీసీ నందగిరి సుధాంశ్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు సోమవారం డీసీ సుధాంశ్ మాట్లాడుతూ చందానగర్ సర్కిల్ పరిధిలో 4 ప్రత్యేక కేంద్రాలలో వాక్సినేషన్ చేపడుతున్నామన్నారు. నాలుగు కేంద్రాలలో కోవీషీల్డ్, కో వాగ్జిన్ రెండో డోసులు కొనసాగుతున్నాయని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి కేంద్రాల వద్ద వాక్సిన్ వేయించుకోవాలన్నారు.
గత శనివారం నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుండగా….ప్రజలు మందకొడిగా కేంద్రాలకు వస్తున్నారని డీసీ తెలిపారు. ఆయా వాక్సిన్ల రెండో డోసు పొందాల్సిన ప్రజలు ప్రత్యేక కేంద్రాలలోని వాక్సిన్ సేవలను వినియోగించుకోవాలని డీసీ సూచించారు. సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ కల్యాణ మంటపం, పీజేఆర్ స్టేడియం, మయూరీనగర్ వార్డు కార్యాలయం, అయ్యప్ప సొసైటీ కల్చలర్ క్లబ్లలో సర్కిల్కు సంబంధించిన వాక్సిన్ కేంద్రాలు కొనసాగుతున్నట్లు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీ సుధాంశ్ కోరారు.