గోల్నాక : భారతదేశ విశిష్ఠతను ప్రపంచానికి చాటిచెప్పి, యువశక్తికి స్వామి వివేకానందుడు స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్ మారుతినగర్లో ఏర్పాటు చేసిన వివేకానందుడి జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. అనంతరం పేద విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వివేకానందుడి భోదనలు, సూక్తులు కేవలం భారత యువతరానికే పరిమితం కాకుండా యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు. భారతదేశం ప్రపంచంలోనే ఒక మహత్తర శక్తిగా ఎదగడానికి ఆయన పునాదులు వేశారని కొనియాడారు.
గోల్నాక మారుతినగర్లో స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, అంబర్పేట బాపునగర్లో కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్, తదితరులు స్వామివివేకానందుని జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వివేకానందుడి సేవలను వారు కొనియాడారు. పలు పార్టీల రాజకీయనాయకులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబర్పేట నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వివేకానందుని జయంతి వేడుకలు నిర్వహించారు.