ఖైరతాబాద్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ మహాసభలను ఈ నెల 30, 31 తేదీల్లో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో నిర్వహించనున్నట్లు ఐఎంఏ మహాసభల నిర్వహణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బి. ప్రతాప్ రెడ్డి తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలు కొవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తున్నామని, అతి తక్కువ మంది ప్రతినిధులు భౌతికంగా హాజరవుతారని, మిగతా వారు వర్చువల్గా పాల్గొంటారన్నారు.
అతిథులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్, జనీవా, ఢిల్లీ, స్వీడన్, ముంబాయి నుంచి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ సి. సంజీవి, డాక్టార్ ఫారూఖ్ ఉద్దౌలా, ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, వైద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డిలు హాజరవుతున్నారని తెలిపారు.
మహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరై ప్రారంభిస్తారని, సైంటిఫిక్ సదస్సును కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్ వైస్ చాన్సలర్ డాక్టర్ బి. కరుణాకర్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ మహాసభల్లో అధునిక వైద్య విజ్ఞానం తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ఐఎంఏ ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ బి. లవకుమార్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ విభాగం కార్యదర్శి డాక్టర్ గట్టు శ్రీనివాసులు, సహ అధ్యక్షులు పి. సురేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.