ఎల్బీనగర్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు దిల్సుఖ్నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ముందుకు వచ్చింది.
సేవా కార్యాక్రమాలను చేపట్టడంలో ఎప్పుడూ ముందుంటే దిల్సుఖ్నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు వారు గత కరోనా సమయంలో బాధితులకు అన్నప్రసాదాన్ని అందించినట్లుగానే తాజాగా మూడు పూటలా అన్న ప్రసాదాన్ని అందించేందుకు గురువారం నుంచి శ్రీకారం చుట్టారు.
దిల్సుఖ్నగర్లోని శ్రీ షిర్డీసాయిబాబా సంస్థాన్ దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో హోం క్వారంటైన్లో ఉన్న వారికి సంస్థాన్ సిబ్బంది స్వయంగా వెళ్లి వారికి అల్పాహారంతో పాటుగా అన్నప్రసాదాన్ని అందిస్తారని ఆలయ కమిటీ తెలిపింది.
అలా కాకుండా స్వయంగా వచ్చి అన్న ప్రసాదాన్ని తీసుకుని వెళ్లే వారికి కూడా సంస్థాన్ పీఆర్ఓ కార్యాలయం వద్ద అన్న ప్రసాదాన్ని అందిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు సాయి సంస్థాన్ పీఆర్ఓ కార్యాలయంలో సంప్రదించాలని వారు కోరారు.
సాయిబాబా సంస్థాన్ తరపున ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం అందజేస్తామని తెలిపారు. వివరాలకు దిల్సుఖ్నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఫోన్ నంబర్లు 040-24066566, 8330966566లో సంప్రదించవచ్చునని తెలిపారు.