అమీర్పేట్ : పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలంగాణ సర్కిల్ హెడ్ క్వార్టర్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ టి.ఎం.శ్రీలత పేర్కొన్నారు. ఫైవ్స్టార్ పోస్టాఫీసుగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఆర్నగర్ పోస్టల్ కార్యాలయంలో స్థానిక అధికారులకు బుధవారం జ్ఞాపిక అదజేసే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిధిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకులకు దీటుగా పోస్టల్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఆర్ధిక లావాదేవీలు ఇకపై పోస్టల్ సేవల ద్వారా ఇంటి నుండి జరుపుకునే విధంగా ఆధునిక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
ప్రజలకు పోస్టల్ సేవలను దగ్గర చేస్తూనే.. ప్రతి చిన్న పనికి పోస్టల్ కార్యాలయ మెట్లు ఎక్కకుండా తమ ఇంటి నుండే అన్ని పనులు చక్కబెట్టుకునే విధంగా డిజిటల్ అకౌంట్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామన్నారు.
చక్కటి ఫలితాలను సాధించిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టాఫీసెస్ (నార్త్) సత్యేంద్ర కృష్ణ, ఎస్ఆర్నగర్ పోస్ట్మాస్టర్ స్వర్ణలతలు ఫైవ్ స్టార్ జ్ఞాపికను పీఎంజీ శ్రీలత చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, సిటీ డివిజన్ ఎస్ఎస్పీవో వై.నరేష్, ముస్తాఫా హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ మహ్మద్ ముస్తఫా అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.