బంజారాహిల్స్ : బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కువద్ద సంచలనం సృష్టించిన సినీనటి షాలూ చౌరాసియాపై దాడి ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ బృందాలు నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నాయి.
ఆదివారం రాత్రి 8.45 ప్రాంతంలో కేబీఆర్ పార్క్ బయట వాక్వేలో వాకింగ్ చేస్తున్న నటి షాలూ చౌరాసియా మీద గుర్తుతెలియని దుండగుడు దాడి చేయడంతో పాటు ఆమె సెల్ఫోన్ను లాక్కుని పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినీనటిపై దాడి ఘటనలో నిందితులను త్వరగా పట్టుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
పరిచితుడా..? అపరిచితుడా..?
ఇదిలా ఉండగా షాలూ చౌరాసియా మీద దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరయి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చీకటి ప్రాంతంలో ఒంటరిగా యువతి కనిపించడంతో కేవలం ఆభరణాలు, నగదు, సెల్ఫోన్ కోసమే దాడి చేశారా..లేక ఎవరైనా తెలిసిన వారే ఆమె కదలికలపై రెక్కీ నిర్వహించి దాడి చేశారా.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేబీఆర్ పార్కు చుట్టుపక్కల సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బయట రోడ్డుమీద ఉన్న ఎల్అండ్టీ కెమెరాలు, వాణిజ్య సముదాయాల కెమెరాల్లో ఫుటేజీతో పాటు సెల్ఫోన్ సిగ్నళ్లే ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నటి షాలూ చౌరాసియాను కలిసిన పోలీసులు దుండగుడి ఆనవాళ్లను అడిగి తెలుసుకుని ఊహాచిత్రాన్ని గీయించే పనిలో నిమగ్నమయినట్లు తెలుస్తోంది.