అంబర్పేట : నల్లకుంట మాజీ కార్పొరేటర్ వనం రమేష్ ఇంట్లో చోరీ జరిగింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దొంగతనానికి సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నల్లకుంట మాజీ కార్పొరేటర్ శంకరమఠం ఎదురుగా, రైల్వేబ్రిడ్జి దగ్గర నివాసముంటున్నాడు.
ఇటీవలనే అమెరికాకు వెళ్లి వచ్చిన రమేష్ ఇంటికి తాళం వేసి ఈ నెల 18న నల్గొండలో తన తల్లిని చూడటానికి భార్యతో కలిసి వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు గడ్డపారతో ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు చొరబడ్డారు. ఇంట్లోని బీరువాను పగులగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం, రూ.2లక్షల నగదు, మొదటి అంతస్తులో గల 5 కిలోల వెండిని దొంగిలించారు.
ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చెల్లాచెదురు చేశారు. సోమవారం నల్గొండ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన రమేష్కు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడం, లోపల బీరువాలు కూడా ధ్వంసమై ఉండటాన్ని గమనించి పోలీసులకు దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దీనిపై ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి మాట్లాడుతూ సంఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్లు తీసుకోవడం జరిగిందని, సీసీటీవీ కెమెరాల్లో పుటేజీలను చెక్ చేస్తున్నామని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లోకి చొరబడిన దొంగలు తెల్లవారు జామున 3 గంటల వరకు ఇంట్లోనే గడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.