నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్రావు
వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమిచ్చే అవకాశం
జిల్లా ప్రాజెక్టులకు ఈసారి మరిన్ని నిధులు..?
సొంత జాగలో డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి నిధులు
ఇప్పటికే దీనిపై ప్రకటన చేసిన మంత్రి హరీశ్రావు
సాకారం కానున్న పేదల సొంతింటి కల
వైద్య, విద్య, గ్రామీణాభివృద్ధికి మరిన్ని నిధులు!
సంక్షేమ పథకాలకు పెద్దపీట
సిద్దిపేట, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శాసనసభలో 2021-22 రాష్ట్ర బడ్జెట్ను గురువారం ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టనుండగా, ఉమ్మడి జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్కు మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలుపగా, ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని భావిస్తున్నారు. కరోనాతో దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని ఆయా వర్గాల వారు భరోసాగా ఉన్నారు. అలాగే, ఉగాది తర్వాత కొత్తగా సొంతింటి స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకునేలా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని మంత్రి హరీశ్రావు ఇప్పటికే ప్రకటించగా, ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశమున్నట్లు తెలిసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, కార్మిక రంగానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఉండనున్నట్లు సమాచారం. పంట రుణమా ఫీతో పాటు నిర్మాణంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులు త్వరతగతిన పూర్తి చేసే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు 2021-22 సంవ త్సరానికి రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో గురువారం (నేడు) ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్కు రాష్ట్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్లో అన్నివర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. బడ్జెట్లో వ్యవసాయం, సాగునీటి రంగానికి ఎప్పటిలాగే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసేలా రూపొందించినట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా నుంచి సీఎం కేసీఆర్, ఆర్థ్దిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు వస్తాయన్న ఆశతో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, కార్మిక రంగానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఉండనున్నట్లు సమాచారం.
విపత్కర పరిస్థితుల నుంచి…
కరోనా-లాక్డౌన్ నేపథ్యంలో అన్నిరంగాలు కుదేలై ఆర్థ్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదు. క్రమంగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రభుత్వానికి తిరిగి పన్ను ఆదాయం సమకూరుతున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని ఆయా వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.
మరింతగా వ్యవ‘సాయం’…
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం, రైతు లకు సబ్సిడీపై యంత్ర పరికరాలను అందజేస్తున్నది. దీనికి గాను నిధులు మరింతగా వెచ్చించి రైతాంగాన్ని ఆదుకోవా లన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ సహకారంతో పాటు కాలం అనుకూలించడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి వానకాలంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. యాసంగిలో మునుపెన్నడూ లేనంతగా పంటలు సాగయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగా నికి ప్రభుత్వం మరింతగా సాయమందించే అవకాశం ఉంది. రైతుల పంట రుణమాఫీకి సంబంధించి నిధులు ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది.
ప్రాజెక్టుల పరుగులు..సాగునీరు పుష్కలం..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రికార్డు సమయంలో రిజర్వా యర్ల నిర్మాణాలను పూర్తి చేసి, వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను జిల్లాకు ప్రభుత్వం తెచ్చింది. గతేడాది జిల్లాను గోదావరి జలాలు ముద్దాడాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయినీ మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.త్వరలోనే ఈ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు రానున్నాయి. దీంతో పాటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన కాల్వల నిర్మాణ పనులు మరింత వేగంగా చేపట్టడంతోపాటు మూడు జిల్లాల్లో సాగునీటి రంగానికి పెద్ద పీట వేసేలా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. నిర్మాణంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టు పనులు త్వరతిగతిన పూర్తి చేసే లక్ష్యంగా ఈ బడ్జెట్లో నిధులు రానున్నాయి. ఈసారి సింగూ రు, వనదుర్గా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో బంగారు పంటలు పండుతున్నాయి. వనదుర్గా ప్రాజెక్టును ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది.
వైద్యం బలోపేతం…
వైద్య రంగానికి మరింతగా నిధులు రానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వైద్య రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్ర భుత్వ దవాఖానలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఇప్పటికే జిల్లాలోని పలు దవా ఖానల్లో మౌలిక వసతులు మెరుగుపర్చి అధునాతనమైన సౌకర్యాలు కల్పించింది. మరికొన్ని దవాఖానల స్థాయిని పెంచింది. ప్రభుత్వ దవాఖానలో ప్రసూతి అయిన వారికి కేసీఆర్ కిట్టుతో పాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.12 వేలను ప్రభుత్వం అందిస్తున్నది. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా కేంద్రాల్లోని దవాఖానల్లో డయాలిసిస్ సేవలను అందిస్తున్నారు. కాన్పుల్లో ముందున్న సంగారెడ్డి జిల్లా దవాఖానలో చిన్నారుల కోసం బేబీ ఫీడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు.
విద్యారంగం…
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మరిన్ని గురుకులాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వే యడంతో పాటు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున బడ్జె ట్లో నిధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సాకారం కానున్న సొంతింటి కల…
ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో వేలసంఖ్యలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. కొత్తగా సొంతింటి స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకునేలా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఉగాది తర్వాత ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఇప్ప టికే పలు కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీంతో దీనిపై ఇండ్లు లేని పేదలు ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. సొంతిల్లు లేని వారికి ఇది ఊరటనిచ్చే అవకాశం. హరితహారం, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, పల్లెలకు ఈ బడ్జెట్లో ఆశించిన నిధుల కేటాయింపులు ఉంటాయని అంద రూ ఆశ పడుతున్నారు.