జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ప్రోత్సాహకాలు
ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి సాయం
అందుబాటులో ఆధునిక సాగు పరికరాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి18 (నమస్తే తెలంగాణ) : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు పొదుపు సంఘాల్లోని మహిళా రైతులను గుర్తించి, ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నది. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ, వ్యవసాయానికి కావాల్సిన యంత్ర పరికరాలను సమకూర్చుతున్నది. సుస్థిర వ్యవసాయం జీవనోపాధుల కల్పనలో భాగంగా తోడ్పాటునందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్నది. జిల్లాలో పొదుపు సంఘాల్లో రాణిస్తున్న మహిళాలు ఎక్కువగా వ్యవసాయ కుటుంబాల నుంచే ఉంటున్నారు. వీరు వ్యవసాయంలో రాణించేలా ఆర్థిక సహాయంతో పాటు వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నది. జిల్లాలో కూరగాయలతో పాటు వైవిధ్యమైన పంటలను ఆధునిక పద్ధతుల్లో సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నది. మహిళలు పొదుపుతోపాటు వ్యవసాయంలో స్థిరపడేలా సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా కృషి చేస్తున్నారు. జిల్లాలో సుస్థిర వ్యవసాయం జీవనోపాధుల కల్పనలో భాగంగా 2018లో 115 మహిళా సంఘాల్లోని మహిళా రైతులను గుర్తించి రూ. 28 లక్షల 75 వేలతో సీడ్ ఫండ్ ద్వారా వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలు అందించారు. ఇక 2019లో.. 141 సంఘాలకు రూ. 70 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి త్వరలో యంత్రాలు కొనుగోలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే జిల్లాలో మరో 108 సంఘాలను గుర్తించి మేకల ఉత్పత్తికోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో మొదట 27 మేకల ఉత్పత్తిదారుల సంఘాలకు రూ. 6 లక్షల 75 వేలతో సీడ్ ఫండ్ ద్వారా మేకలను కోనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ. 25 లక్షలతో..
ఈ యేడాది జిల్లాలోని 15 మండలాల పరిధిలో ధనలక్ష్మి రైతు ఉత్పత్తి దారుల కంపెనీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 292 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 4558 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ కంపెనీ ద్వారా రూ. 25 లక్షలతో ట్రాక్టర్తో పాటు వ్యవసాయానికి వినియోగించే అన్ని రకాల పరికరాలను అధికారులు సమకూర్చారు. సంఘంలో సభ్యులుగా ఉన్న మహిళా రైతులు తమ వ్యవసాయంలో అవరమైన మేరకు ఈ యంత్ర పరికరాలను అద్దెకు తీసుకొని వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.