ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి తాగు నీటికీ తండ్లాడిన ప్రాంతాలు అవి. గడ్డి కూడా మొలవక రైతులు పశువులను అమ్ముకొని వలస వెళ్లిన పరిస్థితి. ఎకరం లక్ష రూపాయలకు కొనేందుకూ ఎవ్వరూ ఆసక్తి చూపని దుస్థితి. కానీ, నేడు స్వరాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో వెలుగులు ప్రసరిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో మూడేండ్లుగా ఎస్సారెస్సీ కాల్వల్లో గోదావరి జలాల సవ్వడి వినిపిస్తున్నది. వరుసగా ఏడో కారు పంటలకు నీళ్లు విడుదలయ్యాయి. ఎకరం ధర ఏకంగా రూ.30-40లక్షలు పలుకుతున్నది. వివిధ పంటలు పండిస్తూ రైతులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు. ‘గతం ఓ పీడ కల.. బతికుండగా గోదావరి జలాలు చూస్తామా.. అనుకున్నాం’అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
సాగు చిత్రమే మారింది..
ఏటా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం, పంటల ద్వారా వచ్చే ఆదాయంతో రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించారు.
మూడేండ్లుగా కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు జిల్లాకు తరలివస్తుండడంతో సాగు నీటికి కొరత లేదు. వరుసగా ఏడు కార్లు పంటలు పండిస్తూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం, పాత ఇండ్లకు మరమ్మతు, బైకులు, కార్ల కొనుగోళ్లు పెరిగాయి.
నాడు వలసలు… నేడు చేతి నిండా పనులు…
గతంలో నీళ్లు లేక భూములను పడావు పెట్టి కుటుంబాలను పోషించలేని పరిస్థితిలో ఎన్నో కుటుంబాలు వలసబాట పట్టాయి. శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు పడావు ఉండేది. పది శాతం భూమి మాత్రమే బోర్లు, బావుల కింద సాగయ్యేది. తుంగతుర్తి నియోజకవర్గం సహా సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, మోతె మండలాల రైతులు కూడా వలసలు వెళ్లేవారు. కానీ, నేడు కాళేశ్వరం జలాల రాకతో ఇంచు భూమి కూడా ఖాళీగా ఉండడం లేదు. రైతులంతా తిరిగి వ్యవసాయం చేసుకుంటూ మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. స్థానికంగా చేతినిండా పని దొరుకుతుండగా ఆంధ్రా నుంచి కూలీలు వలస వస్తున్నారు.
నాడు కమీషన్లు.. నేడు నిండా నీళ్లు..
గత పాలకులు ప్రాజెక్టులు నిర్మించకముందే కేవలం కమీషన్ల కోసం కాల్వలు తవ్వించారు. నీళ్లు పారకపోగా మొక్కలు పెరిగి, కట్టలు ధ్వంసమై కాల్వలు ఆనవాళ్లు కోల్పోయాయి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు కాల్వలను ఆధునీకరించారు. ప్రధాన కాల్వలకు సీసీ లైనింగ్ చేయించారు. పకడ్బందీగా తూములు నిర్మించడంతో నేడు టెయిల్ ఎండ్ వరకు నీళ్లు పారుతున్నాయి.
రూ.40లక్షలు పలుకున్న వ్యవసాయ భూములు..
నీళ్లు పుష్కలంగా ఉండడం, వ్యవసాయం పెరిగిన నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఐదారేండ్ల కిందటి వరకు శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని భూముల ధర ఎకరం రూ.లక్ష నుంచి 3లక్షలు మాత్రమే. నేడు కనీసం రూ.30లక్షలు పెట్టనిదే దొరకడం లేదు. భూముల ధరలు కలలో కూడా ఊహించని స్థాయిలో పెరుగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో యాసంగిలో నాగలిపట్టి దున్నలే..
కాళేశ్వరం జలాల రాకతో వ్యవసాయం పండుగలా మారింది. మా తాత, తండ్రి వ్యవసాయం చేసిన సంది నేను కూడా వ్యవసాయ పనుల్లోనే ఉన్నా. నీళ్లు లేక యాసంగిలో నాగలిపట్టి దున్నిన రోజులే లేవు. కరంటు కూడా ఉండేది కాదు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థమే కాదు. బోర్లు ఆగి ఆగి పోసేవి. పది గుంటలో, ఇరవై గుంటలో తిండిగింజల మందం వరి నాటు పెట్టినా కరంటు కోసం రోజంతా పడిగాపులు కాసేది. మెట్ట పంటలు సాగు చేయాలన్నా చాలా ఇబ్బందే. ఆ పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ, మూడేండ్లుగా కాళేశ్వరం నీళ్లు రావడంతోని ఇంచు భూమి కూడా ఖాళీగా లేదు. వ్యవసాయం పండుగలా మారింది.
నీళ్లు పుష్కలంగా ఉన్నా ఇతర పంటలు వేస్తున్నాం..
రాష్ట్రం రాకముందు నీళ్లు లేక మా భూములు పడావుబెట్టినం. మూడేండ్లుగా కాళేశ్వరం నీళ్లు ఇస్తుంటే బంగారం లెక్కన వరి పండించుకున్నం. తీరా ఇప్పుడు వడ్లు కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వరి బదులుగా ఇతర పంటలు సాగుచేయాలని చెప్పడంతో వేరుశనగ, పెసర, కంది, ఉల్లి, నువ్వులు, టమాటా సాగు చేస్తున్నాం.
బీజేపీ రూపంలో మరో పీడ..
సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్నది. దాంతో రైతులు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సాయంతో పాటు ఉచిత విద్యుత్ అందిస్తుంటే కేంద్రంలోని బీజేపీ వల్ల సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపై వివక్ష చూపడాన్ని రైతులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పార్టీలు, నాయకులపై కోపంతో రైతులను నట్టేట ముంచాలనే కుట్రలు సరికాదని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఇతర పంటలు పండిస్తామని చెప్తున్నారు.
వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు…
గతంలో నీటి వసతి లేక వ్యవసాయం వదిలి పట్నం వలస పోయినం. అప్పట్లో ఎకరం భూమి 50వేల ధర పలికేది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వల్లో గోదావరి జలాలు పారుతున్నయి. ఏటా రెండు పంటలకు నీళ్లు రావడంతో భూముల ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఎకరాకు 20 నుంచి 30లక్షల ధర పలుకుతుంది. రైతులం చాలా ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నాం.