కమాన్చౌరస్తా, డిసెంబర్ 31 : కరోనా నిబంధనల మధ్యన జిల్లావాసులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి పాత ఏడాదికి వీడ్కోలు పలికి, 2022కు ఘనస్వాగతం పలికారు. రాత్రివేళ విందు వినోదాలతో గడిపారు. ఈ సారి కూడా కొవిడ్ భయం వెంటాడగా, ఆంక్షల మధ్యన ఇండ్లల్లో సంబురాలు చేసుకున్నారు. నగరాలు, పట్టణాలు రోజంతా సందడిగా కనిపించగా, కేక్లు కొనేందుకు వచ్చిన వారితో బేకరీలు రద్దీగా కనిపించాయి. ఇటు ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కొత్త సంవత్సర ముందస్తు సంబురాలు ఆరంభమయ్యాయి. కేక్లు కట్ చేసి ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో సూల్ ప్రాంగణంలో ‘అల్ఫోర్స్ డిజైర్-2022’ పేరిట వేడుకలు నిర్వహించారు. విద్యాంసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించగా, అనంతరం విద్యార్థులు నృత్యాలతో హోరెత్తించారు. ఇటు ఇండ్లల్లో న్యూయార్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పలు చోట్ల పటాకులు కాల్చారు. కొత్త సంవత్సరంలో అందరూ సుఖ: సంతోషంగా ఉండాలని చర్చిల్లో అర్ధరాత్రి ప్రార్థనలు, ఆరాధనలు చేశారు. జిల్లా కేంద్రంలో చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. పాస్టర్స్ దైవ సందేశం ఇచ్చారు.