ఉస్మానియా యూనివర్సిటీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవమానపరిచిన ఎంపీ ధర్మపురి అరవింద్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చట్టాన్ని అవహేళన చేస్తూ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఓట్లతో గెలిచి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా పార్లమెంటులో ప్రమాణం చేసి ఎంపీగా కొనసాగుతున్న అరవింద్ ఎస్సీ, ఎస్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా అవమానించాడని దుయ్యబట్టారు.
అరవింద్ భాష, వేషాలతో తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేవరకు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో తిరుగనీయబోమని హెచ్చరించారు.
రాబోయే ఎన్నికల్లో అరవింద్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అరవింద్ ఒక పార్టీలో, తండ్రి మరో పార్టీలో, అన్న ఇంకో పార్టీలో కొనసాగుతూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా బీజేపీలో ఉన్న ఎస్టీ, ఎస్టీ నాయకులు పునరాలోచించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్జీఎసీ ఓయూజేఏసీ, ఎస్ఎఫ్ఎస్ జే నాయకులు భాస్కర్, దత్తాత్రేయ, మన అశోక్యాదవ్, నారాయణ, కిశోర్, ప్రశాంత్, ఉపేందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.