బంజారాహిల్స్ : క్రెడిట్ కార్డు వినియోగించినందుకు వచ్చే రివార్డు పాయింట్స్ను నగదుగా మార్చుకోవాలంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోంచి డబ్బుల తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యూసుఫ్గూడలోని శ్రీకృష్ణానగర్లో నివాసం ఉంటున్న రుద్ర వెంకట శుభకర్ అనే వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 13న గుర్తుతెలియని యువతి అతడికి ఫోన్ చేసి మీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించినందుకు రివార్డు పాయింట్స్ వచ్చాయని, వాటిని నగదుగా మార్చుకోవాలని సూచించింది. దీనికోసం తాము సూచించిన లింక్ను ఓపెన్ చేసి వివరాలు ఇవ్వాలని సూచించారు.
దీంతో అతడు వివరాలు అందించాడు. దీంతో ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేయాలని కోరడంతో తన ఫోన్కు వచ్చిన ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేశాడు. కాసేపటికి అతడి అకౌంట్లో నుంచి రూ.31,470 మాయమయ్యాయి. ఈ మేరకు బాధితుడు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.