ఖైరతాబాద్ : హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానెల్ ద్వారా ఓ హృదయానికి జీవం పోశారు. బ్రేయిన్ డెడ్కు గురైన వ్యక్తి గుండెను తరలింపులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటంతో మరో వ్యక్తికి కొత్త జీవితం అందింది. కేవలం తొమ్మిది నిమిషాల్లో 11 కిలోమీటర్లు ప్రయాణించి సురక్షితంగా ఆస్పత్రికి చేర్చారు.
వివరాల్లోకి వెళితే మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం, నడింపల్లి గ్రామానికి చెందిన నకిరెకంటి శేఖర్ (31) ఓ ప్రైవేట్ సంస్థలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈనెల 13న తన పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శేఖర్ను స్థానికంగా ఆస్పత్రిలో చేర్పించి, మెరుగైన చికిత్స కోసం పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు.
చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 17న రాత్రి బ్రేయిన్ డెడ్కు గురైనట్లు నిర్ధారించారు. విషయాన్ని తెలుసుకున్న జీవన్దాన్ ప్రతినిధులు కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం విశిష్టతను వివరించగా, అందుకు వారు అంగీకరిం చారు. కాగా, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నగరానికి చెందిన వ్యక్తి (45) ప్రస్తుతం గచ్చిబౌళిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వ్యాధి ముదరడంతో గుండె మార్పిడి ఏకైక మార్గమని వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్లోనే జీవన్దాన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి శేఖర్ గుండె మ్యాచ్ కావడంతో వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. దీంతో విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా, హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ కమిషనరేట్లు అందుకు ఏర్పాటు చేశాయి.
పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 మీదుగా కేబుల్ బ్రిడ్జి మీద నుంచి గచ్చిబౌళిలోని ఎఐజీ ఆస్పత్రి వరకు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా ఉండేందుకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. దీంతో కేవలం 9 నిమిషాల్లో 11 కిలోమీటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుండెను చేర్చగా, బాధితుడికి అమర్చారు.
మరణించినా జీవించాడు
అవయవదాత నకిరకంటి శేఖర్ మరణించినా జీవించాడు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు కాలేయం, గుండె, రెండు ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కండ్లు మొత్తం ఎనిమిది అవయవాలను సేకరించారు. ఇందులో గుండెను గచ్చిబౌళిలోని ఏఐజీ దవాఖాన, ఒక కిడ్నీ నిమ్స్, మరో కిడ్నీ ఉస్మానియా దవాఖాన, ఊపిరితిత్తులు కిమ్స్, కండ్లు సరోజినిదేవి కంటి దవాఖానకు తరలించారు.
స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి అవయవాలను దానం చేసిన శేఖర్ కుటుంబ సభ్యులను వైద్యులు, జీవన్దాన్ ప్రతినిధులు అభినందించారు.