చిరునామాలూ ఉండవు..
నాలుగు దేశాల్లో ఐపీ అడ్రస్లు..
ఇప్పటికే లోన్, కలర్ప్రిడిక్షన్, గేమింగ్ యాప్లతో దోపిడీ
తాజాగా క్రిప్టో కరెన్సీ కొనిపించి.. మోసం
చాటింగ్లతోనే కథ నడిపించి.. చీటింగ్
ఆధారాలు దొరకకుండా చైనా సైబర్ క్రిమినల్స్ నయా స్కెచ్
సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): విదేశీ సైబర్ మాయగాళ్లు మన పోలీసులకు సరికొత్త చాలెంజ్ను విసురుతున్నారు. దేశంలో ఎలాంటి అకౌంట్లు లేకుండానే కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ తరహా మోసాల్లో సాక్ష్యాలు లేక దర్యాప్తు ముందుకు సాగడం లేదు. చైనాకు చెందిన సైబర్ మోసగాళ్లే అధికంగా ఇలాంటి చీటింగ్లకు పాల్పడుతున్నారని తేలింది. రుణ యాప్లు, వీడియో గేమ్స్, కలర్ ప్రిడిక్షన్ బెట్టింగ్లతో దోచుకున్న వీరు.. ఇప్పుడు తమ దృష్టిని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లపై పెట్టారు. వాట్సాప్, టెలీగ్రామ్ అప్లికేషన్ల ద్వారా ప్రక్రియ కొనసాగిస్తున్నారు. డబ్బుల సరఫరాను పోలీసులు గుర్తించకుండా మొత్తం వర్చువల్ కరెన్సీలో పెట్టుబడులను పెట్టిస్తున్నారు.
బ్యాంకు ఖాతాలు ఉండవు..
పెట్టుబడి మోసాలపై దృష్టి పెట్టిన చైనా సైబర్ మోసగాళ్లు వాట్సాప్, టెలీగ్రామ్ వేదిక నుంచి స్కెచ్ వేస్తున్నారు. కేవలం చాటింగ్లతో మొత్తం కథ నడిపిస్తున్నారు. రోజుకు రూ. 300 వందల నుంచి రూ. 3 లక్షల వరకు సంపాదించవచ్చనే ఆశ పుట్టించి.. అమాయకులను వలలో వేసి.. బోల్తా కొట్టిస్తున్నారు. పోలీసులకు దొరికిపోతామని.. ఖాతాలు లేకుండానే క్రిప్టో కరెన్సీని కొనిపించి.. వారి ఖాతాల్లోకి డబ్బులను బదిలీ చేసుకుంటున్నారు.
గేమ్స్ ఆడి..
ఆన్లైన్ గేమ్స్ ఆడిన ఓ పేరొందిన కార్పొరేట్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల చేతిలో బోల్తాపడ్డాడు. మాదాపూర్కు చెందిన అతడు ఈ కార్ట్ సంస్థలో పనిచేస్తున్నాడు. డఫ్పాబెట్.కామ్ గ్యాంబ్లింగ్ సైట్లోకి వెళ్లి.. ఏడు నెలలు…200 లావాదేవిలు జరిపి రూ. 35 లక్షలు పెట్టి గేమ్స్ ఆడాడు. గెలిచిన నగదు డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పిన ఆగంతకులు మోసం చేయడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
ఐపీ అడ్రస్సులు..
చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు చాలా వరకు పెట్టుబడులకు సంబంధించిన మోసాల ప్రక్రియలో పంపించే లింక్లను హాంగ్కాంగ్, సింగపూర్, చైనా, దుబాయ్ దేశాలలోని రిజిస్టర్ చేసుకుంటున్నారు. దీంతో ఆ ఐపీ అడ్రస్సులను గుర్తించడం పోలీసులకు అసాధ్యంగా మారుతున్నది. ఆ ఐపీ అడ్రస్సులతో కొల్లగొట్టిన నగదును తిరిగి వారి నగదుగా మార్చుకునేందుకు చైనా సైబర్ క్రైం మోసగాళ్లు వారి ఖాతాల్లోకి వచ్చి క్రిప్టో కరెన్సీని చైనాలో అమ్ముకుంటున్నారు. అలా వచ్చిన క్యాష్ను తిరిగి దుబాయ్, సింగపూర్, ఇండోనేసియా, కంబోడియా దేశాలలోకి పంపించి.. వాటిని తిరిగి వారి ఖాతాల్లోకి తెచ్చుకుంటున్నారని ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో తేలింది.
మరిన్ని మోసాలు ఇలా..
అంబర్పేట్కు చెందిన ఒక వ్యక్తి ఇండస్ ఇండ్ బ్యాంక్కు సంబంధించిన లావాదేవీలు జరిపాడు. అందులో ఇబ్బందులు ఏర్పడటంతో కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి.. సైబర్నేరగాళ్లు చేతిలో చిక్కి రూ. 1.4 లక్షలు పోగొట్టుకున్నాడు.
అంతగా ప్రాముఖ్యత లేని వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో షాపింగ్ చేసిన సికింద్రాబాద్కు చెందిన బాధితుడు రూ. 2.14 లక్షలు మోసపోయాడు.
కాకతీయనగర్కు చెందిన బాధితుడికి సంబంధించిన ఏటీఎం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు విత్డ్రా చేసి రూ. 1.5 లక్షలు కాజేశారు. ఆయా ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పెండ్లి కూతురు అలంకరణ చేస్తామంటూ గూగుల్లో ప్రకటన ఇచ్చిన మహిళకు సైబర్నేరగాళ్లు రూ. 1.8 లక్షలు బురిడీ కొట్టించారు. అమీర్పేట్కు చెందిన ఒక మహిళకు సైబర్నేరగాడు ఫోన్ చేసి.. ఆర్మీలో పనిచేస్తున్నానని.. బ్రైడల్ మేకప్తో పాటు వెడ్డింగ్ ప్లాన్ కూడా చేయాలని చెప్పాడు. బాధితురాలి నుంచి రూ 1.8 లక్షలు కొట్టేశాడు.